ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/నూతన దృక్పథము

వికీసోర్స్ నుండి

నాకు నీయెడఁగల ప్రేమాతిశయము నెట్లు నీ కింక వ్యక్తపఱుపఁగలను ? ఎవ్విధమున నీస్మారకచిహ్న మిచట నెలకొల్పనగును ?"

18. నూతన దృక్పథము

నూతన మతాన్వేషణమునుగుఱించి 1889 వ సంవత్సరమధ్యమున నాకుఁ గలిగిన యుత్సాహోద్రేకములు, ఆ సంవత్సరానంతరము వఱకును నా మనస్సును గలఁచివైచినవి. ఇదమిద్ధ మని నేను నమ్మవలసినది వైష్ణవమా క్రైస్తవమా, సంస్కరింపఁబడిన హిందూమత ధర్మములా, ప్రార్థనసమాజవిధులా; - యని నే నా యాఱునెలలును తల్ల డిల్లి తిని. ఈవిషయమై సత్యనిరూపణము చేసికొనుటకు స్నేహితులతోఁ జెలిమి చేసితిని, సావాసులతోఁ జర్చలు సలిపితిని, సభలలో నుపన్యాసములు వింటిని, సద్గ్రంధపఠనముఁ గావించితిని. వీనియన్నిటి పర్యవసానము, ఆ సంవత్సరాంతమున నేను బ్రాహ్మమతధర్మవిశ్వాస మలవఱచుకొంటిని. అప్పటినుండియు నేను మతాన్వేషణమునకై మరల తత్తరపడలేదు. ఉన్నతపర్వతాగ్రమున నిర్మితమగు గృహరాజమువలె, నామతవిశ్వాసము లింతటినుండి స్థిరములు సుందరములునై విరాజిల్లెను. మతగ్రంథపఠన మతపరిశోధనములు చేయుటకును, ఆత్మాభివృద్ధి ఆత్మపారిశుద్ధ్యములు గాంచుటకును వలసిన పరిశ్రమము ఇంతటితో నంతరించిన దని నేను జెప్పుటలేదు. వీని యన్నిటికిని మఱింత యనుకూల మగు నావరణ మేర్పఱిచెడి దృఢత్వ స్థిరత్వములు నా మతవిశ్వాసముల కిపుడు లభ్యమయ్యెననియే నేను జెప్పుచున్నాను.

నా దృష్టిపథమునఁ గలిగిన యీపెద్దమార్పు, 1889 డిశంబరు 31, 1890 జనవరి 1 వ తేదీలదినచర్యలలో స్పష్టముగ వివరింపఁబడెను. అందలి ముఖ్యభాగము లిచట నుల్లేఖించుచున్నాను : "31 - 12 - 89 : - దయామయుఁడవగు తండ్రీ ! నేను ఈ సంవత్సరారంభమున, స్థిరసంకల్పము గాని, దృఢవిశ్వాసము గాని లేకుండెడియువకుఁడను. ఇపు డేస్థితిలో నున్నాను ? అజ్ఞానతిమిరము నుండి నీ జ్యోతిర్మయమండలమువైపున కొక యంజ వేసితిని. ఈ వత్సరమున శరీరమందును, మనస్సునందును, ముఖ్యముగ నీతివిషయమునను, నే నెన్నియో మార్పులు చెందినాఁడను. సత్ప్రవర్తనమున నేనీ వత్సరమున నుచ్చదశ ననుభవించితిని. మనుజుని సచ్ఛీలతా సత్ప్రవర్తనములు దేవదేవునికిఁ బ్రియతమము లని తుదకు నేను గనుగొంటిని." *** "1 - 1 - 90 : - 'సర్వసమర్థుఁడా ! నాశత్రువులనుండి నన్ను రక్షింప నీవే యోపుదువుగాని, కడు దుర్బలుఁడ నగునేను గానుసుమీ !, యని ప్రారంభప్రార్థన సలిపి, నూతనసంవత్సరమున నేను జెల్లింపవలసిన విధులనుగూర్చి యోజించితిని. ప్రథమశాస్త్రపరీక్షకు బాగుగఁ జదువవలె ననియు, తమ్ములయొక్కయు చెల్లండ్రయొక్కయు విద్యాపరిపోషణముఁ గావింపవలె ననియు, పరిశుద్ధాస్తికమతప్రచారము సలుపవలె ననియు, నేను కృతనిశ్చయుఁడ నైతిని. విధికార్య నిర్వహణవిషయమున నే జేసికొనిననియమములఁ గొన్ని యిచట నుదాహరించుచున్నాను : -

1. శరీరసాధకమునుగూర్చి ముఖ్యముగ శ్రద్ధ వహింపవలెను.

2. కోపము, గర్వము, అసూయ, లోభము - వీని నదుపులో నుంచవలెను.

3. ప్రేమ, మతోత్సాహము మున్నగువానిపట్ల మితి మీఱరాదు. 4. నిరర్థకవిషయములనుగుఱించి కాలము వ్యర్థ పుచ్చఁగూడదు.

5. ఏపరిస్థితులందును పరనింద చేయరాదు.

6. మంచిసంగతి నైనను, అధిక వ్యామోహమునఁ జింతింపరాదు.

  • * * *

10. పరీక్షలో నఖండవిజయమున కైన నారోగ్యముఁ గోలుపోవరాదు.

11. ఈవిధులను జెల్లించుచు, దుస్సహవాసములు, దుస్సంకల్పములు, దృష్టదృశ్యములు - వీనిని త్యజింపవలయును."

మతములలో నెల్ల నాకు బ్రాహ్మధర్మము రుచిరముగ నుండెను. బ్రాహ్మసమాజశాఖలు మూఁడింటిలో నాకు సాధారణ బ్రాహ్మసమాజము ప్రియతమ మయ్యెను. నే నిపుడు కళాశాలలోఁ జదువు ప్రాచీనగ్రీసుచరిత్రములోఁ గన్పట్టెడి రెండు రాజకీయపక్షములలోను, ప్రజాయత్తపరిపాలనాపక్షమే నా కిష్ట మయ్యెను. ప్రభు పక్షమువారగు స్పార్టనులు నా కాజన్మశత్రువు లనియు, ప్రజాస్వామిక పరిపాలకులగు అథీనియనులు పరమమిత్రు లనియు నే నెంచువాఁడను. అదేరీతిని, ఆంగ్లేయరాజ్యతంత్రమునఁగల పూర్వాచారపరులు సంస్కారప్రియులును వరుసగా నాకు శత్రుమిత్రకోటిలోనివారైరి ! ఏతత్కారణముననే నేను హిందూసంఘమునఁగల పూర్వాచారపరులను నిరసించుచు, సంస్కర్త లనిన సంతసించువాఁడను. ఆంధ్ర దేశమున నాకు నచ్చిన సంస్కర్త మాగురూ త్తములగు వీరేశలింగము పంతులే. ఆయన సంస్కారప్రియత్వము, ఒకసాంఘికపథముననే గాక, మతరాజకీయాదివిషయములకును వ్యాపించియుండెను. కావున నే నాయన నత్యంతగౌరవమునఁ జూచుచుండెడివాఁడను. కాని, ఆయనతో నేను పలుసారులు సంభాషించుట కిపుడు వలనుపడెడిదికాదు. ఆయన పరీక్షాపత్రములు దిద్దునప్పుడు ఒక నెల మే మాయనతోఁ బ్రసంగింపరాదు. ఇదిగాక, ఆకాలమం దాయన ఏలూరి లక్ష్మీనరసింహముగారి యభియోగములలోఁ జిక్కుకొనియుండుటచేత, పలుమాఱు న్యాయవాదులతో మాటాడుచును, న్యాయ సభల కేగుచును నుండెడివాఁడు. పంతులవంటి సంస్కర్త, సమదర్శి, సత్యసంథుఁడును, సామాన్యజనుల వగపువెఱపులకు లోనగుచు, వ్యక్తిగతకక్షలు సాధించుటకై న్యాయస్థానముల కెక్కుచుండుట, నాకే కాదు, సంస్కారప్రియులగు నామిత్రులకును నెంతయు నసమంజసముగఁ దోఁచెను ! నా స్నేహితులలో నొకఁడు, తానే పంతులవలె సంస్కర్తయై తనమీఁద వ్యాజ్యెము వచ్చినచో, ఆయనవలె న్యాయసభలు చొచ్చి, అందు న్యాయముఁ బడయఁగోర ననియు, న్యాయాధిపతి తనకు విధించునన్యాయమగు దండనమే మౌనమున నంగీకరించి, వలసినచో, కారాగారమున కేగెద ననియును, పలుకుచుండెడివాఁడు ! ఇట్టితలంపులలోఁ గొంత పటుత్వము లేకపోలే దని మే మనుకొనెడి వారము ! ఆ ఫ్రిబ్రవరి 11 వ తేదీని, నేను వెంకటరావు మాటాడు కొనుచు, వీరేశలింగమహాశయుని సమకాలికులముగ నుండుభాగ్యమనుభవించు చుండుమేము, వారిజీవితమునుగుఱించిన యమూల్యసత్యములను సంపాదించి, ఆ యుదారపురుషునిచరిత్రము లోకమునకుఁ బ్రకటిత మొనరించుట మా ముఖ్యధర్మ మని తలంచితిమి. ఆనెల 16 వ తేదీని నేను నా పూర్వస్నేహితుఁడగు శ్రీతోలేటి వెంకట సుబ్బారావుగారిని సందర్శించితిని. వీరేశలింగముగారిచరిత్రము తాను వ్రాయుచుంటి నని యాయన చెప్పెను. నా కిది మిగుల విపరీతముగఁ దోఁచెను. కొలఁదిదినములక్రిందటనే యీసంగతినిగుఱించి వెంకట రావుతో మాటాడునప్పుడు, ఇట్టి జీవితచరిత్రములలో సత్యము ప్రథాన మని తలంచితినిగదా. ఈ చరిత్రకారుఁడు లోఁతుచొరని వికటకవి యని నా యప్పటితలంపు. దైవసహాయ మున్నచో, వీరేశలింగముగారి జీవితచరిత్రమును మెకాలెవలె సంగ్రహవ్యాసరూపమున నేను రచింప నుద్దేశించితిని. నాయాశ్చర్య మే మని చెప్పను ? ఆమఱుసటిదినమే కాంతయ్యగారిని నేను గలసికొనినప్పుడు, పంతులుగారికిని, గౌరరాజు లక్ష్మీనరసింహముగార్లకును గలభేదములనుగూర్చి యాయన నాతో ముచ్చటించెను. వీరిలోఁ గడపటివారు మొదట వితంతూద్వాహపక్షపువా రయ్యును, పంతులుగారియెడ మనస్పర్థ లూని తనపేరునకుఁ గళంకము తెచ్చుకొనె నని చెప్పెను. పంతులుగారి శీలమునఁగల కొఱంతలును కొన్ని యాయన సూచించెను.

మతవిశ్వాసములందు నా కిపుడు కొంత స్థిరత్వము గలిగినను, హిందూసంఘమున నల్లి బిల్లిగ నల్లుకొని, జనులయభ్యుదయ మరికట్టెడి దురాచారప్రాబల్యము కనిపెట్టినపు డెల్ల నాడెందమున నాగ్రహ ముప్పొంగెడిది ! పూర్వాచారపరాయణత్వము నా ప్రబలవిరోధి యని పరిగణించువాఁడను. ఆజనవరి 3 వ తేదీని, మాతల్లి వలదని ఘోషించుచుండినను, నా చెవిపోగులు తీయించివైచి, దిగ్విజయము చేసితి ననుకొంటిని ! ఆమార్చి 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు, అభ్యంగనము మానివైచి, పూర్వాచారధిక్కారము చేసితినని యుప్పొంగితిని ! ప్రాఁతనేస్తుల సావాసము నా కిపుడును ప్రియమయ్యును, వారిలో పూర్వాచారాపరాయణులగు కొండయ్యశాస్త్రి వంటివారిమీఁద కొంత "మోజు" తగ్గెను. వెంకటరావు నా కాంతరంగికమిత్రుఁ డయ్యెను. మతవిశ్వాసములందు భిన్నాభిప్రాయుఁ డయ్యును. సంఘదురాచారనిరసనమున నా కాతఁడు పరిపూర్ణసాను భూతిఁ జూపుచువచ్చెను. కాని, యాచారసంస్కరణవిషయమై శాంతనార్గ మవలంబనీయ మని నా కాతఁడు హితవు చెప్పుచుండెడివాఁడు. దురాచారమును ఆగర్భశత్రువుగఁ జూచుచుండెడివాఁడను నేను. ఎట్టిదురాచారనిరసనమందైన, మనశ్శాంతిని గోలుపోక, కుటుంబ సౌఖ్యమును, సాంఘికసామరస్యమును జెండాడవల దని బోధించు చుండువాఁ డాతఁడు. మాయాసంస్కరణవ్యాసంగమునఁబడి యారోగ్యముఁ బోగొట్టుకొనుచుంటి నని శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ బలుమాఱు హెచ్చరించిరి. మా పెద్దతమ్ముని పెండ్లిమాట లిపుడు జరుగుచుండెను. ఇపుడు వివాహము వలదని నే నింట తలిదండ్రులతో మిక్కిలి పట్టుదలతో వాదించుచుంటిని. నా తీవ్రవాదన యర్థము సరిగా లోకులు గ్రహింపక, లేనిపోనియుద్దేశములు నా కారోపింతు రనియు, కాన, నేను గడుసుఁదనమున మితభాషిత్వ మూమటయె శ్రేయ మనియు వెంకటరావు నాకు బోధనఁజేసెను.

30 - 3 - 90 తేదీన సంస్కరణవిషయమై ముత్తుస్వామిశాస్త్రికిని నాకును దీర్ఘ సంభాషణము జరిగెను. సంస్కరణముల నాచారణమునఁ బెట్టుటయందు భార్యసానుభూతిసాహాయ్యము లత్యంతావశ్యకము లని యతఁడు చెప్పెను. హిందూయువతులకు పాతివ్రత్య మనునది యమూల్యాభరణము. దాని నూఁతగాఁ గొని, పురుషుఁడు స్త్రీపై నిరంకుశాధికారము చెల్లింపవచ్చును. క్రొత్తగఁ గాపురమునకు వచ్చిన భార్య నొకసారిగాఁ దనసంస్కరణమహార్ణవమున ముంపఁబూనక, సంస్కరణపక్షమునం దామె కభిరుచి పుట్టించుటకై సంస్కర్త మెల్ల మెల్లగ ప్రబోధము గావించుచుండవలెను. తలిదండ్రులయెదుట నైనను మన సంస్కరణతీవ్రతను జూపింపక, విచారపూరితమగు మన మౌన మితభాషిత్వములుచూచి వారు ప్రశ్నింపఁగా, అపుడు మాత్రమే, హిందూసంఘవృక్షమునకు వేరుపురుగులగు దురాచారముల సంగతి వారికి మనము సూచింపవలె ననియు శాస్త్రి నాకు బోధించెను. వేగిరపాటు నైజగుణముగఁగల నాకీ సామపద్ధతి సంకెలవలెఁ దోఁచెను ! సంఘసంస్కర్త సమష్టికుటుంబజీవితమును త్యజించినఁగాని, అతనికి సతికిని బొత్తు గలియ దనియు, భార్యాభర్తలకు బాహాటముగా సంభాషణములు జరుగుట కవకాశ మేర్పడినఁగాని సంస్కరణవిషయము లందు పత్ని కామోదము గలుగ దనియు, నానిశ్చితాభిప్రాయము. ఐనను, మిత్రులయాలోచనలలోఁగల యమూల్యసత్యముములనుమాత్రము నేను గ్రహించుచుండువాఁడను.

19. సంఘసంస్కరణసమాజము

1900 మార్చిమాసారంభమునుండి సంఘసంస్కరణ విషయమున నా యుత్సాహము కడు తీవ్రముగ నుండెను. సహపాఠియగు చెన్నాప్రగడ నరసింహము నేనును ఆనెల మొదటితేదీని మాటాడుకొనుచు, సంస్కరణోద్యమవిధుల ననుసరించి నడువఁగోరితిమేని హిందూసంఘ దురాచారముల కెల్ల మూలకందమగు సమష్టికుటుంబ జీవితమున కొడంబడక, భార్య కాపురమునకు వచ్చినది మొదలు వేరుగ నుండుట ప్రథమకర్తవ్య మని మేము నిర్ధారించుకొంటిమి. ఆమఱునాఁడు వెంకటరావు, ఇంకొకస్నేహితుఁడు నేనును సంస్కరణవిషయమై ప్రసంగించితిమి ఉద్రిక్తచేతస్కుఁడనగు నాకుఁ గల కార్యతీవ్రత తనకు లేమింజేసి, జీవితమున నా నాయకత్వ మనుసరించి, నిరతము నా యడుగుజాడల నడచుచు, నా యుద్వేగమును తగ్గింపవలసినపు డెల్ల నన్ను దా వెనుకకు లాగుచుందు నని వెంకటరావు చెప్పినప్పుడు, అహంభావమున నేను మిన్ను ముట్టితిని. ఆ యేడవతేది రాత్రి కనకరాజు వెంకటరావు నేనును గలసికొని,