ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/చెన్నపురిస్నేహితులు

వికీసోర్స్ నుండి

వీనిలోఁ గల భావసౌమ్యతా రచనాసౌష్ఠవములలో వీసమంత యైన నాయాంధ్రవ్యాసములందుఁ గనుపడకుండెడిది !

అంతకంతకు నాకలమునకు సంపూర్ణ స్వేచ్ఛానువర్తనము వాంఛనీయ మయ్యెను. స్కాటుదొర సజ్జనులలో సజ్జనుఁడు. కాని, ఆయనకు విరోధములగు విషయములను గుఱించిన నా యింగ్లీషురచన లాయన సవరించునా ? నైల్సు అను నొకక్రైస్తవుఁడు మాపత్రిక కొకయాంగ్లేయలేఖ వ్రాసెను. అది పత్రికలోఁ బ్రకటింపవలదా ? ప్రకటించినచో, క్రైస్తవాభిప్రాయములు సమర్థించెడి యాజాబునకుఁ దగుప్రత్యుత్తర మీయవలదా ? అంత నే నాలేఖను బ్రచురించి, దానికి సమాధానముగ నొక పెద్దయాంగ్ల వ్యాసము వ్రాసి, యది నేనే దిద్దుకొని, ఆసంచికయందే ప్రకటించితిని. సంకుచితాదర్శ యుతమగు క్రైస్తవమత మెన్నఁటికిని ఏకేశ్వరారాధన ప్రబోధకమగు బ్రాహ్మధర్మము కానేర దనియు, క్రైస్తవమతము సిద్ధాంతమున విగ్రహారాధనమును నిరసించుచున్నను ఆచరణమున నాదరించుచున్నదనియును, నిరాకారుఁడగు పరమాత్ముని ధ్యానించుటకు హిందువునకు పాంచ భౌతిక విగ్రహము కావలసినట్టే క్రైస్తవునికి క్రీస్తుజీవితము ఉపాధిగ నుపకరించుచున్నది. గావున రెండు మతములవారును విగ్రహారాధకు లనియును, బ్రాహ్మమతస్థు లిట్టి బాహ్యసాధనముల నపేక్షింపక, పరమాత్ముని మనసున ప్రత్యక్షముగ ధ్యానింపనేర్తు రనియును, నేను సమాధానము చెప్పితిని. నావాదన, నావాక్కులు, నావైఖరియును, ప్రార్థనసామాజికులకు హృదయరంజక ముగ నుండెను.

37. చెన్నపురిస్నేహితులు

నేను కొన్ని నెలలు పూర్తిగఁ జదువు విరమించినను, నాకనులు నెమ్మదిపడలేదు. మరల నేను చెన్నపురి పోయి కన్నులు పరీక్షింపించు కొని, అనుమానరహితము చేసికొని వచ్చుట కర్తవ్య మని రంగనాయకులునాయఁడుగారు చెప్పి, తమతమ్ములును రాజధానీవైద్యకళాశాలలో నధ్యాపకులును నగు నారాయణస్వామినాయఁడుగారికి నన్ను గుఱించి వ్రాసిరి. నేనంత కళాశాలకు శీతకాలపు సెలవు లీయకమునుపే గుంటకల్లుమార్గమున రెయిలులో చెన్నపురికిఁ బోయితిని. వెంకటరత్నమునాయుఁడుగారి యేర్పాటుచొప్పున నేను బ్రాహ్మమందిరమున విడిసియుంటిని.

మరల నేత్రవైద్యాలయమున నాకనులు పరీక్షింపఁబడెను. ఈమా ఱచట వైద్యాధికారియగు కింగు అనుదొర నాకనులు పరీక్షించి, అం దేమియు దోషము లే దని చెప్పివేసెను. ముత్తెపుసరములవంటి చుక్కలు కనులనరములమీఁద నుండినను, వానివలన దృష్టికేమియు విఘాతము గలుగదనియు, కనులమంటలు శరీరదౌర్బల్యమున జనించిన వగుటచేత, బలమునకు మందు పుచ్చుకొనవలెననియును ఆయన నుడివెను. ఈయభిప్రాయమును వెంకటరత్నము నాయుఁడుగారి మిత్రులగు వైద్యులు నంజుండరావుగారు స్థిరపఱిచిరి. కావున నేను కనులనుగుఱించి భీతిల్లక, క్రొత్తనేస్తులగు వెంకటరత్నమునాయఁడు, నారాయణస్వామినాయఁడుగార్ల సావాసమునఁ గొన్ని దినములు గడపితిని.

నారాయణస్వామినాయఁడుగారు తమయన్న వలెనే క్రైస్తవమతవిశ్వాసులే కాక, క్రైస్తవధర్మస్వీకారము చేసినవారును. ఆయన బ్లాక్‌టౌనులోఁ గాఁపుర ముండిరి. సోదరునివలెనే వీరును సహజ సౌజన్యస్వభావులును, దయార్ద్రహృదయులును. అన్న దమ్ములకుఁ గల భేదములును నేను గనిపెట్టితిని. అన్న గంభీరస్వాభావుఁడు, తమ్ముఁడు సరళశీలుఁడు. ఈ భేదము మతానుష్ఠానమునందును ప్రస్ఫుట మయ్యెను. కుటుంబ సాంఘికపరిస్థితుల వ్యత్యయముచే రంగనాయకులునాయఁడు మతాంతరుఁడు కానొల్లక యుండినను, నిజమతవిశ్వాసములను దాఁపఱికము లేక స్నేహితుల కెఱిఁగించి, హిందూసంఘ సంస్కరణపరాయణుల యెడల పరిపూర్ణసానుభూతి చూపెడి విశాల హృదయుఁడు. నారాయణస్వామినాయఁడు తన విశ్వాసముల చొప్పున నడచుకొనుట కావంతయు వెనుదీయకుండెడి ధైర్యవంతుఁడు. సంస్కరణాభిరతులయెడ నీయనకును అభిమాన ముండినను, తాను నమ్మిన సత్యక్రైస్తవదీక్ష నెల్లరు నేల గైకొన రని యాయన సంప్రశ్నము. క్రైస్తవమతావలంబనమే మానవులకు మోక్షప్రదాయకమని యాయన మనసార నమ్ముచుండువాఁడు. రంగనాయకులునాయఁడు నిరంతర మందహాసమున నొప్పెడి ప్రశాంతచేతస్కుఁడు. నారాయణస్వామినాయఁడు కాపట్య మెఱుఁగని కోపస్వభావుఁడు. బాలకునివలె సహృదయుఁడై, బాలకునివలెనే తాత్కాలి కాగ్రహాది భావోద్రేకాదులకు వశవర్తి యగుచుండును. మనసు గలసిన మిత్రునికి వలసిన సాయము చేయుట కీయన వెనుదీయకుండువాఁడు. అన్న యన్ననో, తమ్మునకుఁ దీసిపోని నైసర్గికసౌజన్యమునఁ జెలంగుచుండియు, పరిస్థితుల వై పరీత్యమునకుఁ జెక్కుచెదరని శీలసమత్వమునఁ జెన్నొందెడి శాంతమూర్తి. సుగుణోపేతులగు నీసోదరుల యరమరలు సవరించి, యిరువురికి సామరస్యము నొడఁగూర్ప నే నానాఁడు ప్రయత్నించితిని.

చెన్నపురిలో నీమాఱు నాకు లభించిన మిత్రు లింకొకరు శ్రీ వెంకటరత్నము నాయఁడుగారు. ఈయన యప్పుడే యమ్. యే. పరీక్ష నిచ్చి, పచ్చప్పకళాశాలలో నుపాధ్యాయుఁడుగ నుండెను. సునిశిత బుద్ధివికాసమునకును, ఆంగ్ల సారసత్వమున పాండిత్యగరిమమునకును, అనర్గళవచోవిభవమునకును, చెన్నపురియం దీయన మంచి కీర్తి గడించెను. నీతిమతవిషయములం దసమానమగు ప్రజ్ఞయు పట్టుదలయు వీరికిఁ గలవు. ఇట్టికీర్తిప్రతిభలతో నొప్పెడివారికి నిరువదియైదువత్సరములలేఁ బ్రాయముననే పత్నీ వియోగము సంభవించెను. ఒక కొమార్తెమాత్రము గలదు. ఎంద రెంతఁగ బోధించినను, పునర్వివాహము చేసికొనలేదు. బంగారమునకు వెలిగారమువలె, ఈమహాశయుని సచ్చారిత్రమునకును మతాభినివేశమునకును, ఆయనవైరాగ్యబుద్ధియు బ్రహ్మచర్యనిష్ఠయు మఱింత వన్నె గొనివచ్చెను.

నే నీసమయమున నిట్టి సచ్ఛీలుఁడగు బ్రాహ్మధర్మవిశ్వాసుని సావాసమునే మిక్కిలి కాంక్షించుచుంటిని. వీరేశలింగముపంతులు లౌకికవిద్యయందువలె పారమార్థికవిషయములందును నా గురూత్తములే. ఐనను, వారిప్రజ్ఞానైపుణ్యములు సంఘసంస్కరణరంగముననే ముఖ్యముగ ప్రదర్శితము లగుచుండెను. ఆయనకుఁ బ్రియమగు మతము బ్రాహ్మధర్మమే. బ్రాహ్మసమాజాదర్శములు వారికిఁ గొట్టినపిండియే. కాని, యింగ్లీషువిద్యయే పరమావధి యైన యాకాలపువిద్యాధికులకు, ఆవిద్యలో నున్నతస్థాన మలంకరించిన నాయఁడుగారివంటివారు చేసెడి ధర్మప్రసంగములే మతవిషయములందు పరమప్రమాణములు. నేను జదువవలసినగ్రంథములు, జరుపవలసిన విధానములనుగూర్చిన యనేకవిషయములు నేను వారివలన గ్రహించితిని.

నాకంటె నాయఁడుగారు 6, 7 సంవత్సరములు మాత్రమే పెద్దలు. నామనస్సునఁ దోఁచిన పలుసందియముల నాయన సోదరభావమునఁ దీర్చుచుండువారు. ఇంతియ కాదు. బ్రాహ్మధర్మమున కాయువుపట్టగు ప్రేమగుణము వారియందు మూర్తీభవించినటు లుండెను ! వయోవ్యత్యాస మెక్కువగఁ గలిగి, ఆగ్రహ మితభాషిత్వములతో నొప్పెడి వీరేశలింగముపంతులుగారి నెన్నఁడునుగాని మేము వేయ వెఱగండెడిప్రశ్నములకు, సమవయస్కులగు నాయఁడుగారు సౌమ్య భావమున సదుత్తరము లిచ్చు చుండువారు. యువజనహృదయాకర్షము చేయుసమర్థతయు, వారలను సన్మార్గమునకుఁ బురిగొల్పెడి సౌజన్యమును, వారియందుఁ గలవు. కావున నేను గనులనుగుఱించి చెన్నపురికిఁ గట్టినపయనము వ్యర్థ మని యెంచక, అంతర్చక్షువికసనమున కిది సందర్భ మయ్యెనని మిగుల సంతసించితిని.

చెన్నపురియందు నే నుండు దినములలోనే యచటి బ్రాహ్మసమాజవర్ధంతి జరిగెను. ఆసందర్భమున నాయఁడుగా రొక యుపన్యాసము చేసిరి. ఆయుత్సవానంతరమున, 1892 జనవరి 4 వ తేదీ సోమవారమున చెన్నపురినుండి నే నింటికి బయలుదేఱితిని.

38. సంరంభము

ఆకాలమున చెన్నపురి నుండి యుత్తరాంధ్రమండలములకు రెయిలుపయనము చేయువారు మిగుల మెల్లగను, మిక్కిలి చుట్టు మార్గమునను పోవలసివచ్చెను. మద్రాసు నుండి గుంతకల్లువఱకును మెయిలులో నొకరాత్రి; గుంతకల్లునుండి కంభమువఱకు నొకపగలంతయు; అంత, కంభము చలిలో నిర్బంధ విశ్రమము రాత్రియంతయు; కంభమునుండి బెజవాడకు మఱునాఁటి యుదయమునుండి సాయంకాలము వఱకును. నేను పయనము చేయుబండిలో నదృష్టవశమున మద్రాసునుండి బెజవాడవఱకును ఇంజనీరింగ్ కాలేజివిద్యార్థు లుండిరి. వారిలో నా పూర్వసహపాఠి రంగనాయకులుగారుండుటవలన నాకుఁ గాలక్షేపము సుకర మయ్యెను. బెజవాడలో నే నెక్కినపడవలోనే