ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/యం. యే. పరీక్ష.

వికీసోర్స్ నుండి

నాకీ సుదతీమణి, చిన్ని తమ్మునితోవలె, భార్యను నేను ప్రేమించి లాలింపవలె ననియు, నగలవిషయమందామెకుఁ గల చిన్నకోరికలు చెల్లింపవలె ననియును, మెల్ల మెల్లగ హితబోధనముఁ జేయుచుండెడిది. గర్భసంబంధమగు వ్యాధికి లోనయిన నాసతికి, తరుణముననే చికిత్స చేయించి, గార్హస్థ్యజీవితమును సుఖప్రదముగఁ జేసికొమ్మని ప్రేమపూరిత హృదయయగు సోదరివలె నీసౌశీల్యవతి నా కుద్బోధనము చేయుచుండెడిది.

ఆ పత్నీ పతుల యన్యోన్యానురాగము కడు శ్లాఘాపాత్రముగ నుండెను - ఎన్నఁడుగాని అనంతముగారు తమసతీమణిమీఁద నలుక చెందుట నేను గాంచియుండలేదు. ఆకోమలి పతిమీఁదఁ గినుక వహించుటయు నెఱుఁగను. సంతత కోపావేశమునను, పరుషవాక్య ప్రయోగమునను, సతీహృదయమును చీకాకుచేసి, స్వకుటుంబశాంతినిభంగ పఱచుకొనియెడి నాకు, వీరి యనుకూలదాంపత్య మాదర్శప్రాయముగ నుండెను. ఒకనాఁడు, సంసారసౌఖ్యరహస్యమును గుఱించి అనంతము గారు నాతో ముచ్చటించుచు, మలయమారుతపుఁదాఁకుననె సౌరభము నొకింత కోలుపోవు కోమలకుసుమముతోఁ గుటుంబ సౌఖ్యమునుఁ బోల్చి, భావగర్భితముగ మాట్లాడిరి. దాంపత్య జీవితమున కామ సుఖలాలసయే ప్రధానమని భావించు స్త్రీలోలుఁ డెన్నఁడును, ఏతత్సుఖానుభవమునకు దూరుఁడగుచుండు నని నే నపుడు గ్రహించితిని. కాని, యౌవనప్రాదుర్భావమునఁ జెలంగువారలకు జితేంద్రియత్వ భాగ్య మొక్కసారిగ లభించుట కడు దుర్లభముకదా.

8. యం. యే. పరీక్ష.

ఆగష్టు 20 వ తేదీని వేకువనే నేను షికారుపోయి, నా భావికాల కర్తవ్యములనుగుఱించి యీజించితిని. నేను యల్. టి. పరీక్ష పూర్తిచేసినఁ గాని నా కీవృత్తిలో వేతనాభివృద్ధి గలుగ దనుట స్పష్టము. ఆ పరీక్షలో జయ మందుటకు వేఱుగ ప్రయత్న మక్కఱయే లేదు. నన్నుగుఱించి పరీక్షాధికారులు సదభిప్రాయ మందుటయే నా విజయమునకు హేతువు. ఇట్టి యదృష్టముమీఁద నేను బూర్తిగ నాధారపడక, స్వయంకృషిచేత దీని కంటె నుత్తమపరీక్ష నిచ్చి, బోధకవృత్తిని చిరస్థాయిగఁ జేసికొనవలదా ? అదియే యం. యే. పరీక్ష. నే నందు జయ మందినచో, యల్. టి. లో మరలఁ దప్పిపోయినను, ఏ కళాశాలలోనైన నిప్పటికంటె మిగుల గౌరవస్థానమును బడయనర్హతను గాంచియుందును. కావున నేనా యున్నత పరీక్షకుఁ జదువ నిపుడు దీక్షవహించితిని. ఆంగ్ల సాహిత్యమునందు నా కభిరుచి మెండు. అయినను దానిలోకంటె తత్త్వశాస్త్రముననే నేనా పరీక్షకుఁ జదివినచో, వినోదములును, జ్ఞానదాయకములునునగు మహత్తరవిషయము లనేకములు గ్రహింప నా కవకాశము గలుగును. ఇట్లే చేయుమని వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు మిత్రులును నాకుఁ జెప్పిరి. కావున నేను తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ నుద్దేశించుకొంటిని.

నే నానాఁడు నిశ్చయించుకొనిన సంగతి యింకొకటి కలదు. నా కీలోకమునఁ బ్రియతమమగు విషయములలో పరిశుద్ధాస్తికమతవ్యాపనమొకటి. ఇది మెల్లగఁ గొనసాగించుటకుఁ బ్రార్థనసమాజస్థాపన మావశ్యకము. ఈబెజవాడపట్టణమం దిదివఱకు బ్రార్థనసమాజము లేకుండినను, ఏతత్సమాజాభిమానులు లేకపోలేదు. కాని, వయసు వచ్చినవారినికంటె, విద్యార్థియువకులనే ప్రార్థనసమాజసభ్యులగఁ జేర్పఁబ్రయత్నించుట శ్రేయము. బాల్యమున విద్యార్థిమనోక్షేత్రమునఁ బడిన మతబీజములు సకాలమున మొలకలెత్తి భావిజీవితమున విజృం భించి సత్ఫలముల నొసంగఁగలవు. కావున ప్రార్థనసమాజ మిట స్థాపించి, నా విద్యార్థిస్నేహితుల నందుఁ జేర్పింప నే నుద్యమించితిని. ఒకనాఁడు సంభాషణసందర్భమున అనంతముగారితో నే నీసంగతి ప్రస్తావింపఁగా, వారు క్రైస్తవమతవిశ్వాసకు లయ్యును ప్రార్థనసమాజస్థాపనము విద్యార్థుల నైతికాభివృద్ధికి లాభకరమని యొప్పుకొని, నాకుఁ బ్రోత్సాహముఁ గలిగించిరి. క్రైస్తవమతస్థుల కన్యమతప్రచార మంతరంగమున నసమ్మత మని నామిత్రులును, పాఠశాలలో నాంధ్రోపాధ్యాయులునునగు జానపాటి కామశాస్త్రులుగారు సదా హెచ్చరించుచుండినను, ప్రార్థనసమాజాదర్శములు మొత్తము మీఁద క్రైస్తవుల కిష్టములే యనియును, మాపాఠశాలాధికారులగు క్రైస్తవసంఘమువారు నాయెడ సానుభూతిఁ జూపుదురనియును దలంచి, నే నీకార్యమునకుఁ గడంగితిని. 25 వ ఆగష్టు శనివారమునాఁడు ప్రార్థనసమాజస్థాపనము జరుగునని పాఠశాలలోని పైతరగతులలో నేను బ్రకటించితిని.

కాని, ఆరోజున "హిందూబాలసమాజము" నెలకొల్పఁ బడునని నేనొక ప్రకటనము చూచితిని. కాన నాఁడు ప్రార్థనసభ జరుగుటకు వలనుపడ దనియు, ప్రార్థనసమాజస్థాపన మొకవేళ నా యుద్యోగమునకే భంగకరముగఁ బరిణమింపవచ్చు ననియును నేను దలంచి, "సంఘపారిశుద్ధ్య సమాజము"ను నెలకొల్పినచో, నే నెవరియీర్ష్యకును లోనుగాక విద్యార్థిలోకమునకు మే లొనరింపఁగలనని యెంచితిని. "హిందూబాలసమాజము" విద్యార్థుల నీతిపోషణమునకు సహకారి కాక, విగ్రహారాధనాది మూఢవిశ్వాసములకుఁ బ్రోత్సాహకరముగ మాత్రముండునని నమ్మి, ఆసమాజమునఁ జేరవలదని నావిద్యార్థులకు బోధించు చుండువాఁడను. హిందూమత మనిన నాకెంతో వెగటుగను విగ్రహారాధనము కంటకసదృశముగను నుండెడిది. మా చిన్న మేనమామ వెంకయ్యగారు మమ్ముఁ జూచిపోవుటకు సెప్టెంబరు 5 వ తేదీని బెజవాడ వచ్చి, కృష్ణానదిని కనకదుర్గాలయమును దమకుఁ జూపింపుమని నన్ను గోరిరి. నేనీ పట్టణము వచ్చి కొన్ని నెలలైనను, దుర్గాదేవిదర్శన మింకను జేసికొనియుండలేదు. మామేనమామ ప్రోత్సాహమున నేనిపుడు ఆగుడి కేగితిని. పర్వతమధ్యమున నొక రమ్యప్రదేశమునం దాదేవాలయము నిర్మింపఁబడెను. ఆ పరిసర దృశ్యము లత్యంత రమణీయములు. మామామ నన్ను గర్భాలయములోని కాహ్వానింపఁగా, ఆయనను సంతృప్తిపఱచుటకే నేను లోని కేగినను, దుర్గ విగ్రహమునకు మ్రొక్క నాకుఁ జేతులు రాలేదు! భక్తిపారవశ్యమున వినమ్రుఁడైన తనసరసను, చేతులు జోడింపక, చెట్టువలె నిలువఁ బడిన నామీఁద మామామ మిగుల విసువుఁజెందెను. దేవునికిని పూజారికిని కాసైనఁ జెల్లింపక నే నెటులో యంతట బయటపడితిని !

సెప్టెంబరు 8 వ తేదీని బెజవాడపట్టణ మమితకల్లోలమున కాకర మయ్యెను. కొన్ని దినములక్రింద నచటి కొక మార్వాడీవర్తకుఁడు వచ్చి, యెక్కువ వడ్డీనిచ్చి, జనులనుండి చిన్న చిన్న యప్పులఁ గొనఁజొచ్చెను. రూపాయి బదులిచ్చినవానికి వారమురోజులపిమ్మట పావులావడ్డితో అసలీయఁబడుచుండెడిది ! ఈమనుజునిచుట్టును జనులు మూఁగుట చూచి, యీతనివలెనె మఱికొందఱు ఎక్కువవడ్డీకి బదుళ్లు పుచ్చుకొనసాగిరి. అంతకంతకు వడ్డీపరిమితి పెరిఁగి, వారమునకు రూపాయికి రూపాయి యయ్యెను ! పేదజను లీ వ్యాపారవ్యామోహమునఁ బడి, తమ వృత్తులు కట్టిపెట్టి, తమకుఁగల ధనమంతయు బదుళ్లలోఁ ద్రిప్పసాగిరి. ఒకనాఁడు నామిత్రుఁడును, వాణీముద్రా క్షరశాలాధికారియును నగు శ్రీ దాసు కేశవరావుగారియింటికేగి, యచట ముద్రితమయ్యెడి ప్రకటనపత్రిక నొకటి నేను జూచితిని. "అత్యా పేక్షాధైర్యసంఘము" అను పెద్దపేరు పెట్టుకొనిన యొక వడ్డీవ్యాపారస్థుని సంస్థనుగుఱించిన కాకితమే యిది! అత్యా పేక్ష ధైర్యమునకైనను అధైర్యమున కైనను, ఎడమీయు నని యిందలి ధ్వన్యర్థ మని నవ్వుచు స్నేహితుఁడు నాకుఁ జెప్పెను. నదీప్రవాహమునఁ గన్పడు బుడగలవంటి యీవర్తకసంఘములు, దురాశచే నేర్పడు నవియేగాని సదుద్దేశముతో నెలకొల్పఁబడునవి కావు. అప్పుపుచ్చుకొన్న కొంచెపు మొత్తములతో విరివిగ నేవర్తక వ్యాపారములు స్వల్ప కాలమున సాగఁగలవు? కావున కేవల ద్రోహ చింతనముతోనే యీసంఘములు వెల సె ననుట స్పష్టమయ్యెను. ఈద్యూతవ్యాపారము ప్రబలు దినములలో రక్షకభటులు, ప్రభుత్వోద్యోగులును ఏచర్యనుఁ బుచ్చుకొనక, 8 వ సెప్టెంబరున నకస్మాత్తుగ సంఘమువెంటసంఘము దివాలుచేయుటచేత సొమ్ము పోఁగొట్టుకొనిన జనుల కోలాహలము ప్రబలినప్పుడుమాత్రమే, వారు తమ కర్తవ్యమునకుఁ గడంగుటకై కనులు తెఱచిరి ! పురమం దెచటఁ జూచినను కొద్దిగనో గొప్పగనో సొమ్ము పోఁగొట్టుకొని విలపించుజనులే గానవచ్చిరి ! మాపాఠశాల బంట్రోతు కనకయ్య తన సంగతి నాకుఁ జెప్పెను. తాను మూఁడు నాలుగు రూపాయి లీ యప్పులకు ముందు పెట్టుబడి పెట్టి, కొద్ది రోజులలో ముప్పది రూపాయలవఱకును బెంచి, దానిలోఁ జాలవఱకిపుడు కోలుపోయినను, తనయొద్ద నింకను పది పదునైదు రూపాయిలు నిలిచియుండె నని చెప్పెను. కడుధైర్యముతోనైనను అధైర్యముతోనైనను అతిలోభబుద్ధితో జరిగెడియిట్టి వ్యాపారద్యూతము, జనసామాన్యమునకు తుదకు చేటు తెచ్చుననుట కీయుదంతమే తార్కాణము!

9. కష్టకాలము, శుభకార్యము

అమలాపురోద్యోగపుఁజిక్కు లింతటితోఁ దొలఁగలేదు. నేను బెజవాడయందలి యుద్యోగమున నుండుటకే నిశ్చయించుకొంటిని కాని, అమలాపురోద్యోగము వదలితి నని వ్రాసివేయలేదు ! వదలుకొనుటకు ముందుగ, ఆపని నాకీయఁబడె నను కాకితమే యింతవఱకును నాచేతి కందలేదు! కావునా నా కీయుద్యోగ మక్కఱలేదని నే నెట్లు వ్రాసివేయఁగలను? ఎట్టకేలకు, 8 వ సెప్టెంబరున అమలాపురపుఁబని నా కిచ్చితి మని నాగోజీరావు పంతులుగారి నుండి హుకుము వచ్చెను. నా కిటు లొసఁగఁబడినట్టియు, దొరతనమువారి కొలువుతో సమానస్థిరత్వముగలిగినట్టియు, బోర్డుపని వలదని చెప్పివేసి, క్రైస్తవపాఠశాలను నమ్ముకొని యుండుట భద్రమా యని నే నంత సందేహ మందితిని. బెజవాడమీఁదుగఁ బ్రయాణము చేయు నాగోజీరావుపంతులుగారిని నేను రెయిలుస్టేషనులో 11 వ తేదీని గలసికొంటిని. వెంటనే బెజవాడ పని వదలి, అమలాపురము పొమ్మని వారు ఖచితముగఁ జెప్పివేసిరి! మరల నే నీ విషమద్వంద్వావస్థలోఁ జిక్కుకొనిపోయితిని !

ఇపుడు కొన్నిరోజులు సెల వగుటచేత 16 వ సెప్టెంబరున రాజమంద్రి వెళ్లి, సబ్‌కలెక్టరును జూచి మాటాడితిని. ఈవిషయమై తా నేమియుఁ జేయలే ననియును, నేను నాగోజీరావుగారినే సంప్రదించి చిక్కు విడదీసికొనవలె ననియును, ఆయన చెప్పివేసెను. అమలాపురమందలి యుద్యోగమును స్వీకరింపఁజాలనని నేనంత పంతులుగారికి వ్రాసివేసితిని.

రాజమంద్రిలో నాకనుల కెల్లెడలను కష్టదృశ్యములే కానవచ్చెను. పాపము, దొరతనమువారికళాశాలలో నూఱురూపాయిల