ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ప్రాఁతక్రొత్తలు

వికీసోర్స్ నుండి

నిమిత్తమై వెంకటరామయ్య మద్రాసు వెడలిపోయెను. మేము బెజవాడకు మరలివచ్చితిమి.

14. ప్రాఁతక్రొత్తలు

కడచిన సంవత్సరమున నేను జేసిన పనులను విమర్శించుకొనుచు, 1896 వ సంవత్సరము జనవరి మొదటితేదీని నేనొక పట్టికను వ్రాసికొంటిని. అందులో గత సంవత్సరమున పరీక్షకొఱకును వినోదార్థమును జదివిన పుస్తకములఁ బేర్కొని, ముందు సంవత్సరమునఁ జదువఁ బూనిన ముఖ్యగ్రంథముల నామముల నుదాహరించితిని. గతసంవత్సరము నేను జదివిన యుద్గ్రంథములలో ముఖ్యములైనవి, మిల్లువిరచితమగు "మతవిషయికవ్యాసత్రయము", కార్లయిలుని "సార్టారు రిసార్టను", ఇమర్సునుని "మానుష ప్రతినిధులు", రీననుని "క్రీస్తుజీవితము"ను, మిత్రుఁడు రామమూర్తిగారి సహవాసమహిమముననే నా మనస్తత్త్వమున కిపుడు ఇమర్సను, కార్లయిలులు సరిపడుట చేత, ఈసంవత్సరము కార్లయిలుని "శూరులు" "భూతవర్తమానములు" అను పుస్తకములు చదువ నేర్పఱుచుకొంటిని. తమ్ముఁడు కృష్ణమూర్తి రాజమంద్రిలో నున్నప్పటికంటె జ్ఞానశీలాదులంయం దభ్యున్నతి నొందుచుండెను. ఈ సంవత్సర మాతని గుఱించి నే నెక్కువగ శ్రద్ధ వహించి, ప్రవేశపరీక్షలో నాతఁడు జయమందునట్లు చేయ నుద్యమించితిని. భార్య విద్యావిషయమైకూడ మిగుల పాటుపడి, మత సంఘ సంస్కరణములయం దామె కభిరుచి కలిగింప నుద్యమించితిని.

ఆ కాలమున నా దేహమును బీడించు పెనుభూతమగు మలబద్ధమును నిర్జించుటకై, నిద్రాభోజనాదులందు మితత్వముఁ గలిగి, నిత్య మును వాహ్యాళి కేగుటయు, డంబెల్సుతో కసరతు చేయుటయును ముఖ్యసాధనము లని నాకుఁ దోఁచెను. విద్యావిషయమై నే నతిజాగ్రతతో నుండఁగోరి, రాత్రి పదిగంటల పిమ్మట చదువవలదనియు, తెల్లవాఱుజామున మూఁడు నాలుగుగంటలకు మెలఁకువ వచ్చెనా తిరిగి నిద్రింపక, చదువునకుఁ గాని ప్రార్థనవ్యాయామములకుఁ గాని గడంగవలె ననియు నియమముచేసికొన నుద్యమించితిని.

నా యాత్మోజ్జీవనవిషయమును విమర్శనఁ జేసికొనుచు నే నిట్లు వ్రాసితిని : - "గతసంవత్సరమునకంటె నే నిపుడు మంచి స్థితి నున్నాను గాని, యిపుడైనను భగవంతునికి హృదయపూర్వక ప్రార్థనలు చెల్లింపనేరకుండుట శోచనీయము గదా ! అనుదినప్రార్థన మభ్యాసము చేసికొని, కోపదు:ఖములు పొడసూపు నుద్రేక సమయములందును, విషయలాలసయందును, దైవమును స్ఫురణకుఁ దెచ్చుకొనుట వలన నాత్మోజ్జీవనము కలుగును. నీ సంభాషణాది యనుదినకార్యక్రమమునందె దైవభక్తి ప్రకటీకృత మగుచుండవలెను. శీలసౌష్ఠవ మొకటియే ప్రాణోత్క్రమణ సమయమందు నిన్నుఁ జేయి విడువని పరమమిత్రుఁ డని నమ్ముము ! ఉత్తమజనులస్నేహమును సముపార్జించి, నీరసుల సముద్ధరింపఁబూనుము. మిక్కిలి యోగ్యమగు పుస్తకములే చదువుచుండుము. సౌహార్దమె మానవులయం దేకీభావ మొనఁగూర్చు దివ్యమంత్ర మని నమ్ముము". ఇట్లు నేను మానసబోధముఁ గావించు కొంటిని.

గత సంవత్సరమున బెజవాడలో ప్రార్థనసమాజము నెలకొల్పితిమి. జనానాపత్రికను నడిపి, పాఠశాలలోని కార్యక్రమమును సరిగ జరిపితిని. ఈసంవత్సర మింకను ఈపనుల నెక్కువశ్రద్ధతో నాచరించుచు, జనోపయుక్తములగు నుపన్యాసము లిచ్చుచు, సంఘసంస్క రణ సమాజమును నెలకొల్పి కార్యసాధనముఁ జేయవలెనని నేను సంకల్పించుకొంటిని.

స్నేహితుఁడు రామమూర్తి 1896 వ సంవత్సరారంభమున బెజవాడ విడిచి పోయి, బందరు నోబిలుకశాశాలలో నుపాధ్యాయుఁ డయ్యెను. కావున కామశాస్త్రి, రాజారావు, రామస్వామిశాస్త్రిగార్లు మున్నగు మిత్రులతోఁ గలసి, నే నీకాలమునఁ బ్రొద్దుపుచ్చుచుండువాఁడను. "సత్యసంవర్థని"కి దఱచుగ వ్రాయుచు, "జనానాపత్రికను" బ్రచురించుటయే కాక, మద్రాసునందలి "స్టాండర్డు" పత్రికకుఁను, "సంఘసంస్కారి" పత్రికకును, ఆంగ్ల వ్యాసములు లిఖించుచును వచ్చితిని.

ఈ 1896 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో మిత్రుఁడు మృత్యుంజయరావు క్షయరోగపీడితుఁడై తుదకు మృత్యువువాతఁ బడుటకు నే నెంతయు వగచితిని. అతనిని గుఱించి "సంఘ సంస్కారిణీ" పత్రికలో నొక వ్యాసము వ్రాసి, కళాశాలదినములలో ప్రార్థన సమాజమునకును, సత్యసంవర్థనీ పత్రికవిషయమునను, అతఁడు చేసినకృషి నభినందించి, వితంతూద్వాహములఁ బ్రోత్సహించిన సంఘసంస్కారి యనియు, నిక్కమగు దైవభక్తుఁ డనియు నాతనిని బ్రశంసించితిని. రాజమంద్రిలో "ఆస్తికపాఠశాల" నెలకొల్పసమకట్టిన సుజనుఁ డనియు, అతని మృత్యువువలన మా సమాజమునకే కాక, ఆంధ్రావని కంతకును తీఱనికొఱఁత వాటిల్లె ననియు నేను వక్కాణించితిని.

శరీరదార్ఢ్యములేని నాకును అతనికివలెనే యకాలమరణము సంభవించి, మాకుటుంబమును మితిమీఱిన కష్టములపాలు చేయవచ్చునని భీతిల్లి, అట్టిపరిస్థితులలో సతికి జననికిని గొంత జీవనోపాధిఁ గలిగింప విధ్యుక్తమని యెంచి, నేను ఈసంవత్సరము ఏప్రిలునెలలో నాజీవితమును "ఓరియంటల్ భీమాకంపెనీ"లో నాలుగువేలరూపాయిలకు భీమా చేయించి, మూఁడు "పాలిసీలు" తీసికొంటిని. కుటుంబ ఋణము లెప్పటికి తీఱినను, ఆపత్సమయమునం దీభీమాసొమ్ము మావారలకుఁ గొంత లాభకారిగ నుండఁ గల దని నమ్మి, అప్పటినుండియు నేను మనోధైర్యమున నుంటిని.

ఈ సంవత్సరము వేసవిసెలవులలో నెప్పటివలెనే పత్నీ సమేతముగ నేను రాజమంద్రి వెళ్లి యుంటిని. అప్పుడు నాభార్య తీవ్రజ్వరముచేఁ గొన్నిదినములు బాధపడెను. రెయిలువేవైద్యుఁడు జే. రంగనాయకులు నాయఁడుగారు మం దిచ్చి వ్యాధినివారణము చేయఁగా, ఆమె తన పుట్టినింటికి కట్టుంగ వెడలిపోయెను. అచట వెంకటరత్నమునకు విడువని దారుణజ్వరము వచ్చుచుండె నని మామామగారు కొలఁదిదినములలోనే నాకొఱకు రాజమంద్రి బయలుదేఱి వచ్చిరి. నే నపుడు కట్టుంగ వెళ్లి చూడఁగా, జ్వరముతీరు సవ్యముగ లేదు. ఆ కుగ్రామమునుండి రోగిని గదల్చి రాజమంద్రికిఁ గొనిరానిచో నతఁడు జీవింప నట్టుగఁ దోఁచెను. అంత నా వడివేసవిదినములలో నొకరాత్రి సవారిలోఁ గూర్చుండఁబెట్టి రోగిని రాజమంద్రి చేర్చితిమి.

రాజమంద్రి ఇన్నీసుపేటలో నిదివఱకు మాకుఁగల నివేశమునకుఁ జేరిన యింకొక స్థలమును మాతండ్రి యిటీవల కొనెను. ఆరెండింటియందును నుండినవి తాటియాకులయిండ్లే యైనను, సొంత యింటఁ గాపురము మాకు సుఖప్రదముగ నుండెను. మాతలిదండ్రులు, సోదరులును వెంకటరత్నమున కమితముగఁ బరిచర్యలు చేసిరి. ఒక నెలవఱకును, సన్నిపాతజ్వర మాతనిఁ బీడించెను. ఆతని ప్రాణమును గుఱించి మే మాదినములలో నధైర్యపడినను, దైవానుగ్రహమున నెట్టకేల కాతనికి శరీరస్వాస్థ్యము కలిగెను. సెలవులపిమ్మట మేము మువ్వురమును బెజవాడ వెడలిపోయితిమి.

తమ్ముఁడు కృష్ణమూర్తి వెనుక రాజమంద్రిలోవలెఁ గాక యిపుడు చదువునం దెంతో శ్రద్ధవహించి యుండెను. ఆటలందును నతఁ డెక్కువ చుఱుకుగనుండెను. ఆరెండు సంవత్సరములును పాఠశాలలో నాటలనుగూర్చిన యేర్పాటులు నేనె చేయుచుండువాఁడను, సోదరుఁడు, స్నేహితులు, విద్యార్థులు మున్నగువారలతోఁ గలసి నేను కాలిబంతి, బాడ్మింటను బంతులాట లాడుచుండువాఁడను. మే మెంతో పట్టుదలతో నాడుచుండుటవలన, రెండుమూఁడు సారు లెదటికక్షలో నుండు సోదరుని వలననే నాకు కాలిబంతిదెబ్బలు పెద్దవి తగిలెను !

మాతండ్రి నా కాదినములలో వ్రాసిన యీ క్రిందియుత్తరము వలన, మాకుటుంబవ్యవహారములు, ఆయన శీలభావలేఖ నాదుల వైచిత్ర్యములునెగాక, ఆకాల పరిస్థితులును గొంతవఱకు తేటపడఁగలవు:-

"29 - 8 - 96 స్థిరవారం, రాజమంద్రి, యిన్నిసుపేట.

శ్రీరాములు.

"చిరంజీవులయిన మా కుమారుడు రాయసం వెంకటశివుడును సుబ్బారాయుడు చిరాయవులుగాను దీవిస్తిమి.

"తరువాత యిక్కడ అంత్తా క్షేమం. యీనెల16 తేది లగాయతు 23 తేదీవర్కు గోదావరి పుష్కరములు. తూర్పుపడమర ప్రజలు రెయిలు వుండుటచేత అన్కేమంది జనం వచ్చినారు. కోట్లింగాలవద్ద సరకారువారు విస్తారం పాకలు వేయించ్చినప్పట్కి, అనే కేమంది బస్తీలోనే ప్రవేశించ్చినారు. రేవులవద్దను వీధులలోనూ గలిబిలి జర్గకుండా 400 కనిస్టేబిలు పిల్పించ్చి ఘాట్లు ఫారాలు యేర్పర్చినారు. చోరీలు మొదలయ్నివి యేమీ జర్గకుండా సబుకల్కటరుధొరవారు శ్రధన్ పుచ్చుకున్నారు.

"వేలివెన్ను పశువేదలవారు యావన్మందింన్ని, ధవిళేశ్వరం నుంచ్చి చింనప్పామన్ను, క్నకంమ అత్తగారుంన్ను ఆమె నాలుగో కుమార్డు కృష్ణమూర్తిగారుంన్ను యిక్కడ మ్నయింట్కి వచ్చినారు. నింన కొంత్తమందింన్ని, యీరోజున కొంతమందిన్ని వారివారి గ్రామములకు వెళ్లినారు.

"షుమారు 10 రోజులునుంచ్చి విశూచి జాడ్యములు కనిపించ్చి రోజు 1 కి షుమారు 10 మంది జ్నంచొప్పున చనిపోతుంన్నారు. యిక్కడ యితరదేశపు ప్రజలు వారివారి దేశముల్కు వెళ్లిపోయ్నీరు.

"లక్ష్మీపతిగారి నింన్ని రామచెంద్దర్రావుగార్నింన్ని చూచినాను. తమకు యివ్వవలశ్ని వెంకటచెలంపంత్తులు గారు యింక్కా యివ్వ లేదనింన్ని యిచ్చిన వెంటనే పయిసలు చేయిస్తానని లక్ష్మిపతిగారు శల్వుయిచ్చినారు. వెంకటచెలంపంత్తులుగారు య్నీం అంమ్మకమయ్నిసొంము యీగ్రామంలో మెర్కవీధికాపులవద్ద నిలవ వుంన్నది. రామచెంద్రరావుగారు చెప్పిన దేమనగా, కొంతదస్తు శిధంగా వుంనదనింన్ని తతింమ్మాదస్తు 10 రోజులలో తాము జమీగ్రామములలో నుంచ్చి రాబడుననింన్ని తప్పకుండా యిప్పిస్తామనిన్ని చెప్పినారు. *** రామభద్దిర్రాజు గారు 4 రోజులకిందట కోటున్ పనినిమిత్తం రాజమంద్రికి వచ్చినారు. వీరభదృడు కూడా వుత్తరం వ్రాసినాడు. 4 రోజులలో రేలంగి వెళ్లి యిలిందలపర్తి వ్యవహారం పరిష్కారం చేస్తాను. అత్తిలి వెంకటరత్నంగారిపేర వుత్తరం 15 రోజులకిందట వ్రాశినాను. జవాబు లేదు. నేను వెళ్లి అత్తిలి వగైరాలు కనుక్కుని వారం రోజులలో తిర్గి రాజమంద్రికి చేరి వుత్తరం వ్రాస్తున్నాను."

ఆ సంవత్సరము డిశెంబరులో జరిగెడి ప్రవేశ పరీక్షకు తమ్ముఁడు కృష్ణమూర్తి పోయియుండెను. శీతకాలపు సెలవులలో మే మిరువురమును రాజమంద్రి వెడలిపోయితిమి. అక్కడనుండి నాభార్య తన పుట్టినింటికి కట్టుంగ పోయెను. రక్తగ్రహణిచే నే నాదినములలో నధికముగ బాధపడితిని. అత్తిలి భూముల యమ్మకమునకై నన్ను రేలంగి రమ్మని చెప్పి ముందుగ మాతండ్రి రాజమంద్రినుండి బయలుదేఱెను. కొంచెము నీరసముగ నుండినను నేను రేలంగి ప్రయాణమైతిని. ఎంతో ప్రయాసపడి నే నచటికి డిశంబరు తుది దినములలోఁ జేరితిని. కాని అప్పటి కింకను వ్యవహారము తెమలకపోవుటచేత, భార్యను రాజమంద్రి కొనిపోవుటకై యచటినుండి నేను కట్టుంగ పయనమైతిని.

15. కీళ్ల వాతము

నేను రేలంగినుండి డిసెంబరు 31 వ తేదీని ప్రొద్దుననే బయలు దేఱి, కాలినడకను మధ్యాహ్నమునకు కట్టుంగ జేరితిని. నాఁడు కటిస్థలమున నొప్పిగ నుండినను, నే నది లెక్కసేయ లేదు. ఆగ్రామములో మాయత్తమామలు, వారి కుమారుడు, కొమార్తెలు నుండిరి. మాబావమఱఁదితో ముందలి సంగతు లాలోచించుచు, జనవరి 1, 2. తేదీలలో నేనచటనే యుంటిని. ఈసంవత్సర మైనను నేను యల్. టి. పరీక్షలో గెలుపొందనిచో, నా కిష్టములేని న్యాయవాదివృత్తిలోఁ బ్రవేశించుటకై, న్యాయశాస్త్ర పరీక్షకుఁ జదువ నాయుద్దేశమని చెప్పి వేసితిని. ఇది యాతఁ డామోదించెను.