ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"చిత్రకథామంజరి"

వికీసోర్స్ నుండి

కృష్ణమూర్తి ప్రథమశాస్త్రపరీక్షలో తప్పెను. అతని చదువు సాములరీతి నా కేమియుఁ దృప్తికరముగ లేదు. 26 వ తేదీని అనంతముగారు బళ్లారినుండి బెజవాడకు వచ్చిరి. మే మందఱము రెయిలుదగ్గఱ వారిని గలసికొని పాఠశాలలో వారికొక విజ్ఞాపనము సమర్పించితిమి. మావిద్యాలయమున నలుగురు ప్రవేశ పరీక్షలో గెలుపొందిరి. తమ్ముఁడు సూర్యనారాయణ యాపరీక్ష నిచ్చెనని విని యానందభరితుఁడ నయితిని.

నా కిపుడు మరల గుండెమంటలు ప్రబల మయ్యెను. నేనే వంట చేసికొనుచువచ్చుటచేత, భోజనసౌకర్యము లేదు. అందువలన నాదేహమున నిస్సత్తువ యేర్పడెను. మాతమ్ముఁడు మద్రాసులో పరీక్ష నిచ్చి రాజమంద్రికి మరలివచ్చుటచేత, నాభార్య 11వ ఫిబ్రవరిని బెజవాడ తిరిగివచ్చెను.

45. "చిత్రకథామంజరి"

నేను దొరతనమువారి కొలువులోఁ జేర నిపు డాశింపఁ జొచ్చితిని! ఫిబ్రవరి 25 వ తేదీని నాకు స్కాటుదొరగారు వ్రాసిన జాబులో, నేను డైరక్టరుగారి కర్ఝీ పెట్టుకొనినచో, తాము చేయవలసినసాయము తాము చేతు మని యుండెను. మఱునాఁడు వీరేశలింగముగారియొద్దనుండికూడ లేఖ వచ్చెను. స్కాటుదొరగారి నాయన చూడఁబోఁగా, రాజమంద్రి కళాశాలలో నొక తాత్కాలికోద్యోగము చేయ నాకు సమ్మతమా యని దొరగా రడిగిరఁట. వెంటనే నే నొకయర్జీ నంపి, నా కీవిషయమున సాయము చేయుఁడని యుభయులను గోరితిని. ఈయూరు విడిచి రాజమంద్రి వెడలి పోవ మాయిద్దఱికి నిష్ట మే. ఈ సమయమున మాతమ్ముఁడు సూర్యనారాయణకు వివాహ సంబంధములు కొన్ని వచ్చెను. ఆతనికిఁ గట్నము లిచ్చెద మని పలువురు భ్రమపెట్టునప్పుడు, ఋణబాధతో నుండు మా కాతనిబెండ్లి యెడఁ గొంత సుముఖత్వము గలుగుచువచ్చెను. కాని, మే మావిషయమున నేనిర్ధారణమునకును రాఁజాల కుంటిమి.

"అక్కఱ కల్పనకు జనని" అను నొక లోకోక్తి యాంగ్లమునఁ గలదు. "జనానాపత్రిక" కు నెలనెలయును నేను బెక్కు వ్యాసములు వ్రాయవలసివచ్చెను. ఏదైన పుస్తక మారంభించి వ్రాయుచున్నచో, పత్రికకుఁ దగినంత మేఁత దొరకునని నే నిదివఱకు "హిందూసుందరీమణుల" రెండుభాగములును వ్రాసితినిగఁదా. ఇపుడు కొంతకాలమునుండి "ఇంగ్లీషువారి సంసారపద్ధతులు" కూడ తెలుఁగు చేసి పత్రికలోఁ బ్రచురించుచున్నాఁడను. కాని, యీపుస్తకములు వ్రాయుటలో నాస్వకపోలశక్తి యంతగ వ్యక్త మగుటలేదు. పద్యరూపమున నుండు పురాణకథలు గద్యమున లిఖించుటయందుఁగాని, యాంగ్లేయ పుస్తకము నొకటి యాంధ్రమున కనువదించుటయందుఁ గాని, స్వతంత్రరచనమున కవకాశ మేమిగలదు? సొంతకథ లల్ల నాకిపుడు కుతూహలము పొడమెను. 1901 మార్చినెల 'జనానాపత్రిక'లో "బాలాంబరాణి" యను నొక కథ వ్రాసి ప్రచురించితిని. దీని నాఱుప్రకరణములుగఁ జేసి, ప్రతిప్రకరణమునకు మకుటముగ నొకపద్యము నుల్లేఖించితిని. ఇదియొక విషాదాంతకథ. కొండవీటి రెడ్లనాఁటి కథగా దీని నేఁ జెప్పినను, చరిత్రాంశము లిం దేమియుఁ గానరావు. మఱుసటినెల పత్రికలో నింతె పరిమాణముగల "శారద" యనునొక సంతోషాంతకథను వ్రాసితిని. ఇట్లే తక్కినకథలును వ్రాసి, యీకథాసముదాయమునకు వీరేశలింగముగారి "నీతికథా మంజరి"ని బోలిన "చిత్రకథామంజరి" యను పేరిడితిని. ఈకథలలో మిగుల దీర్ఘమగునది "కృష్ణవేణి" ఇది కొంతవఱకు చరిత్రాత్మకమగు కథ యనవచ్చును. ఇటీవల చదివిన "కృష్ణామండల చరిత్రము" నుండి కొన్ని చిన్న యంశముల నూఁతగఁ గొని నే నీకథ నల్లితిని. ఇది నా కెంతో ప్రియమైనది. ఈ పుస్తకము మొదటి కూర్పులో చిత్రకథలు గానివికూడ కొన్ని చేర్పఁబడినవి. "నూర్జిహాను" "గాబ్రియలు సోదరి"యును చారిత్రగాథలే. 'ఉత్తమపుష్పము' ను చిన్నకథ యనుటకంటె వ్యాస మనియే చెప్పనగును !

మే మిటీవల బెజవాడలోఁ గొనినగేదెను కాయుటకు పొరుగుననుండు నొక బాలకుని నియమించితిమి. వాని యజాగ్రతచే నొకనాఁడది తప్పిపోయెను. దానిని వెదకుటకు వాని తలిదండ్రులు చూపిన యశ్రద్ధనుబట్టి వారల దుర్మంత్రములవలననే యీమోసము జరిగె నని మాకుఁ దోఁచెను. చుట్టుపట్టులగ్రామము లన్నియు నేను గాలించి వచ్చితిని. లాభము లేకపోయెను. పోలీసువారి వారింప లైన గమనింపక యాపిల్లవానితల్లి మమ్మూరక తిట్టిపోయసాగెను ! అంత పిల్లవానిమీఁదను వానితండ్రిమీఁదను మోసమునకు నే నభియోగము తెచ్చితిని. సబుమేజిస్ట్రేటు విచారణచేసి, పిల్లవానిని శిక్షించెను. కాని, పై న్యాయాధిపతి వానిశిక్షను రద్దుపఱిచెను.

ఇటీవల చనిపోయిన రానడిగారి సంగ్రహచరిత్రమును నే నాంగ్లమున వ్రాసి యొక బెజవాడసభలోఁ జదివి, "సంఘసంస్కారిణీ" పత్రికలోఁ బ్రచురించితిని. ఇంగ్లీషున "భీష్ము"ని గుఱించి యొక వ్యాసమువ్రాసి, రాజమహేంద్రవర ప్రార్థనసమాజవార్షిక సభలోఁ జదివించితిని. అదియు "సంఘసంస్కారిణీ" పత్రికలో ముద్రిత మయ్యెను. మూఁడేండ్లక్రిందటనే యల్. టి. పరీక్షలో విజయ మందినను, పట్టభద్రులసభ కిదివఱకు నేను వెళ్లియుండలేదు. 1901 మార్చి 27 వ తేదీని నే నాసభకుఁ బోవుటకు మద్రాసు బయలు దేఱితిని. బండిలో నరసింహరాయఁడుగారు మున్నగు మిత్రులు కానఁబడిరి. చెన్నపురిలో స్నేహితులు కొల్లిపర సీతారామయ్య గారియింట నేను బసచేసి, పరశువాక మేగి, వీరేశలింగము బుచ్చయ్యపంతులుగార్లను జూచితిని. మద్రాసు స్టాండర్డు పత్రికా సంపాదకీయ వర్గములోని బి. వరదాచార్యులుగారిని సందర్శించితిని. ఆయన మరల న న్నాపత్రికకు బెజవాడ యుపవిలేఖకునిగ నుండుఁడని కోరి, దినపత్రిక నంపుచువచ్చిరి. స్కాటుదొరను జూచితిని గాని యాయన నా కేమియు సాయము చేతుననలేదు.

మేరీకారిల్లయి వ్రాసిన "వెండెట్టా", "మైటీ ఆటమ్" అను నవలలను ఏప్రిలు నెలలోఁ జదివితిని. "సైతానువెతల" వలెనే 'వెండెట్టా'యును మిగుల మనోహరమగు విషాదాంత కథయే.

అంత మాపాఠశాలకు సెలవు లగుటచేత, మేయి 5 వ తేదీని బతలుదేఱి, ఏలూరుమీఁదుగ రాజమంద్రి వెడలిపోయితిమి. రాజమంద్రి స్టేషను నుండియే యత్తయు భార్యయు కాకినాడ పోయిరి. మాతల్లియు తమ్ములును త మ్మీచర్య చిన్న పుచ్చెనని తలపోసిరి !

46. వీరేశలింగముగారి సాయము

మా చెల్లెలికూఁతుని భారసాల 8 వ మే తేదీని జరుగఁగా పిల్లను దీసికొని తల్లిదండ్రులు అర్తమూరు మఱునాఁడె వెడలి పోయిరి. మా తమ్మునిభార్యను, పిల్ల వానిని మోగల్లునుండి తీసికొని