ఆంధ్ర రచయితలు/విక్రమ దేవవర్మ

వికీసోర్స్ నుండి

విక్రమ దేవవర్మ

1869


శ్రీ జయపుర సంస్థాన ప్రభువు. క్షత్రియుడు. కాత్యాయనసూత్రుడు. భారద్వాజసగోత్రుడు. తల్లి: రేఖాదేవి. తండ్రి: శ్రీకృష్ణచంద్రదేవ మహారాజు. జననము: 1869 జూన్ 28 వ తేదీ, (శుక్ల సంవత్సర జ్యేష్ఠ బహుళ తృతీయాగత చతుర్థీ భానువాసరము. గ్రంథములు: 1. శ్రీనివాస కల్యాణము (నాటకము) 2. మానవతీచరిత్ర. 3. -- 4. శృంగారగీత వ్రాతము 5. శ్రీ మహారాజ విక్రమదేవవర్మ రచనలు (1940 ముద్రితము) 6. కృష్ణార్జున చరిత్ర టీక (మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి రచించిన ద్వ్యర్థి కావ్యమునకు వ్యాఖ్యానము) 7. రాథామాధవ నాటకము (ఉత్కలము) ఇత్యాదులు.


ఆంధ్రరాజులలో 'కృష్ణదేవరాయలు' అద్వితీయుడుగా బరిగణింపబడినాడు. శౌర్యసంపదను మించిన యుత్సాహము, భాషాభిమానమును మించిన కవిత్వశక్తి, విద్యత్పోషణమును మించిన కళాదరము నతనియందుండి తెలుగుమన్నీల కతని దొరతనపు దెన్ను మేలుబంతియైనది. 'ఆముక్తమాల్యద' నీమహారాజ శిరోమణి రచించినటులుగా పరిశోద మహాశయులు నిర్ధారించియున్నారు. ఈ వాస్తవవిషయమును----పఱుచుటకు, ఆంధ్రకవితాపితామహుడు నాస్థానకవియునగు పెద్దన రచింప చేసి తనపేరు పెట్టుకొనె యని విపరీతవిమర్శనములు బయులు .................. .................. ............ ............ ............. ........... .....................

(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) సభలలో దఱచు చూచి యుందుము. ముదిమిచే దటస్థించిన చిన్న యొదుగుగల మధుర కంఠస్వరముతో నీమహారాజు తెలుగుభాషలో నభిభాషించునపుడు తెలియనివా రేమనుకొందురు? లక్షల కొలది రాబడి వచ్చు సంస్థానమునకు బ్రభువు లని యూహింపగలరా? కాలుక్రింద బెట్టనక్కఱలేని రాజ్యాధిపతి యని తలంపగలరా? ఏమనుకొందురు? చక్కగా నుపన్యసింపగల యెవరో వృద్ధవిద్వత్కవి యని మాత్రము తెలిసికొన గలుగుదురు.


శ్రీ విక్రమదేవ వర్మగారు ఆంధ్రముననే కాదు, ఆంగ్లమునను మృదువుగా నుపన్యసింప గలుగుదురు. ఉత్కలభాషలో వీరికి మంచి ప్రవేశ మున్నదని చెప్పుట ఆ భాషలో "రాధామాధవ నాటకము" సంఘటించినారని తెలియుచున్నది. సంస్కృతవాజ్మయములో వీరికి ధారాళమైన సాహిత్య మున్నది. ఆభాషలో రచించిన వీరి శ్లోకములు చక్కని ధోరణిలో సాగినవి.


శ్లో. సంసృత్య పారజలధే స్తరణైక పోతౌ

పాపాంధకార పటలీదివసాధినాధౌ

భక్తాళినిత్య సుఖకైరవ షండసోమౌ

చైతన్య దేవచరణౌ శరణం ప్రపధ్యే

శ్లో. సంసార పాశబద్ధానాం ప్రాణినా మతిదు:ఖినాం

ముకుందనామ వర్ణాళి స్మరణం ముక్తిసాధనం.


వీరు సంగీతకళలో గూడ బరిచితిగలవారు. జ్యోతిషము తెలియును. నాట్యము నెఱుగుదురు. ఇట్టి విజ్ఞతలు వారిలో నున్న వనుటకు రచనలు నిదర్శనములు. కావ్యరచనయందును, కథా గ్రథనమునందును వీరికి మంచిచాతుర్యము కలదు. పెక్కు గ్రంథములు వ్రాయలేదు కానివ్రాసిన నిర్దష్టముగ నుండును. వీరి కవితాశయ్యలో శుచిత్వము హెచ్చు. రుచి కొంచెము తక్కువ. వీరి మానవతీచరిత్రము, శ్రీనివాస కల్యాణము పరికింపవలయును. 'రాజధర్మము' నుగూర్చి వీరి పద్యములు చూడుడు.


గీ. రాజు నిజదేశమునకును బ్రజలకు దొర

ననుచు దలపక తన్ను శ్రీహరిజనులకు

సేవ వ్హేయుట కొఱకే సృజించె నంచు

నెంచి విఱ్ఱవీగక సంచరించు టొప్పు.


గీ. ప్రజలు శ్రమపడి యార్జించి భక్తి దనకు

నిచ్చినధనంబు వారికై వెచ్చ పెట్ట

కాత్మభోగాళి కొఱకును ఖ్యాతికొఱకు

వమ్ముసేయుట తగునె నృపాలకులకు


ఆ. వె. తనదు ప్రజలు వెతలు గను చుండ వారిని

తలప కన్య దేశములకు నేగి

సామి యలర దగునే ? జనుల రంజింపని

వాని నృపు డనంగ బాడి యగునె ?


గీ. ప్రజల సుఖదు;ఖములు ధరావరుడు దనవి

గా దలంచుచు నీతిమార్గమున జనుచు

సజ్జనుల గౌరవించుచు స్మయము పడక

పరమపురుషుని భక్తిచే బరంగవలయు


ఈ రాజధర్మముల గీటుదాటకుండ బ్రజాపాలనము చేసిన విక్రమదేవవర్మ యభినందనీయుడుగదా! 1940 సం. లో "శ్రీమహాదేవ వర్మ రచనలు తలిసెట్లి రామారావు గారు ప్రచురించిన అనేక గద్య పద్యములున్నవి. నేటి తెలుగు అను శీర్షికతో శ్రీ మహాదేవ వర్మగారు వెలువరించిన రచన నిచట ప్రచురించెదను. ఈవ్యాకరణంలో వ్రాసిన నాధునికాంధ్ర బస గూర్చి శ్రీవారి యభిప్రాయము " సజీవ నిర్జీవ యుక్తంబగు జగంబు నియమయుతంబు విలసిల్లు చుండుటవలన నియమ మత్యావశ్యక మనుట యతిశయోక్తి గాదు. అట్లగుటవలన విజ్ఞలు నియమమును విడనాడుట యసమంజసము. ప్రవర్తన నియమమును స్మృతి విధించునట్లె భాషానియమమును వ్యాకరణము శాసించెడివి. కనుక వ్యాకరణవిరుద్ధ పదములతోడ వెలుయు కైత గర్హితమ యగును. నాణెములగు బాసలందు మిన్న యని యెన్నంబడు తెలుగుబాసకు సమగ్రమగు వ్యాకరణము నేటికిని లేకుండుట మిక్కిలి శోచనీయము. వ్యాకరణ మసమగ్ర మను నెపము చేత నున్న నియమములను మీఱుట యుక్తము గాదు......'వాడు' యొక్కయు 'అవి' యొక్కయు ద్వితీయానిభక్తిరూపము 'వానిని'. కనుక విభేదము కొఱకు 'అవి' యొక్క ద్వితీయావిభక్తిని "వాటిని" అని వ్యవహరించుట యుక్తము. "అయితే"-"కూతురును" మొదలగు కొన్నిరూపములు గ్రాహ్యములని సాయాశయము. భాషాభిమానముగల పండితులొకచోట గూడి గ్రహింప దగిన రూపములను నిర్ణయింప వలెను. మఱి యవియే వాడ బడవలెను. అట్లు కానిచో దెలుగు బాస కోదుబాస కంటె నీచతర మగును.

భాషావాద విషయములో విక్రమదేవవర్మగారిది మంచి పట్టుదల గ్రామ్యవాదమును సహింపనేరరు. అదియటుండ, ఏగుధాతువు-అమరసింహుడు, ధారుణరూపము, నన్నయభట్టుయుగము మొదలగు రచనలవలన వీరి విమర్శన నైశత్యము వెల్లడియగును. కథారచనలో గూడనీయనకు జాతురీ యున్నది. పయనపు జెలికాడు-ముసలిమగడు అనుకథలు ఆంధ్రిపత్రికలలో బ్రకటింప బడినవి. మంత్రిప్రెగడ మార్య ప్రకాశకవి "సీతారామచరిత్ర" మను ద్వ్యర్థికావ్యము రచింపగా, దానికి ------రచించినారు దానివలన వీరి పాండితీ విశేషము స్పష్టపడుచున్నది.ఆంధ్రసరస్వతిని వీరనేక రీతుల బోషించు చున్నారు. (పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) 'ఆంధ్ర విశ్వవిద్యాలయము' సాలునకు నూఱువేలు వీరి వలన బడ్యుచున్నది. దానికి వీరు ప్రధానాధ్యక్షులు. విశ్వవిద్యాలయము మీది యభిమానముచేగాబోలు, ఈపండిత ప్రభువు 'విశాఖపట్టణము'లో దఱచు మకాముచేయుచు 'హావామహాలు' విశాలమైన వరండాలో దర్శింపవచ్చిన విద్వాంసులను, కవులను, అర్థులను దత్తదుచితరీతి నాదరించి గౌరవించుచు నిరంతరము గ్రంథపఠనమునందో, గ్రంథ రచనమునందో నిమగ్నుడై యుండును. వీరు 8-61981 వ.తేదీని జయపుర సామ్రాజ్య సింహాసనమునకు వచ్చిరి. రాజ్యమునకు వచ్చన పూర్వము పరముకూడ వీరి స్వభావము గర్వరహితమైనదే.


ఈయన "సాహిత్యసామ్రాట్టు" గా బేరుమోసి యెందఱో తెలుగు కవుల వలన మధురకృతులు పొందిరి. రసజ్ఞడు, విద్వాంసుడు, మహారాజు నగు నీ విక్రమదేవవర్మకు శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు 'మేఘ దూత' కావ్యము నంకిత మొసగినారు. ఒసగుచు వారు వ్రాసిన పద్యమిది:-


ప్రజలు బెగడొంద యుద్ధ లంపటుడుగాని

కృష్ణరాయడు, తెలుగున మృదుల కపన

మును బొనర్పగ నేర్చిన భోజరాజు

తలప విక్రమదేవ విద్వత్ప్రభుండు.


కొక్కొండ వేంకటరత్నముగారు 'సింహాచలయాత్ర' విక్రమదేవవర్మగారి కంకితము చేసిరి. విఖ్యాత విద్వాంసులగు బులుసు పాముల శాస్త్రిగారు తాము రచించిన 'అలంకారసంగ్రహము'న నీ సాహి ................. .................... .................... ..................... ....(పై ఖాళీలలోని అక్షరములు కనబడుటలేదు) ప్రసాదరాయ కవి 'మొయలురాయబారము' విక్రమదేవవర్మ కంకితము గావించెను. కృతికర్తయు, కృతిభర్తయు నగుట మంచియదృష్టము. అది పట్టిన మహారాజు విక్రమదేవవర్మ సంస్కృతాంధ్రములు, ఆంగ్లము కాక 'హిందీ' కూడ వీరికి సుపరిచతమైన భాష. తులసీదాసుని వర్షఋతు వర్ణనము, శరదృతువర్ణనము పద్యరూపముగా వీ రనువదించిరి. బహుభాషాప్రవేశము గలవారే యసలు తక్కువ; మహారాజులలో మఱియు దక్కువ.


శ్రీ విక్రమ దేవవర్మగారు పూరించిన యీసమస్యలు కొన్ని మీముందుపెట్టెదను. ఆయన యెట్టియాలోచన కలవారో నిర్ణయించుకొనుడు.


సమస్య:-కొడుకును దా వలచి యొక్కకూతుం గనియెన్.

క. పుడమికి మేనక యనియెడు

పడతుక దివినుండి వచ్చి పావనమగు కా

ఱడవిని నృపుడగు కుశికుని

కొడుకును దా వలచి యొక్కకూతుం గనియెన్.

సమస్య:-అంధుడు భాస్కరునిజూచి యానందించెన్.


క. అంధత్వహరుండగు రవి

బంధురకృప గ్రుడ్డితనము వాయగ గవితా

సింధుపు మయూరు డనెడు పు

రాంధుడు భాస్కరుని జూచి యానందించెన్.

సమస్య:-తల్లీ! దండం బటంచు దారకు మ్రొక్కెన్.


క. ముల్లో కంబుల మేలున

కల్ల మహిష దనుజు జంపు మను తఱియందే

యెల్ల సురలతో భర్గుడు

తల్లీ! దండం బటంచు దారకు మ్రొక్కెన్. ప్రౌడార్థప్రదీపితములు, భావభూషితములు నగు నీ జయపురాధీశ్వరుని పద్యరచనలు పరికించినచో "కృష్ణదేవరాయలు విష్ణుచిత్తీయకృతికర్తకా"డను దుర్వాదము సడలిపోవును. ఆ కవిరాజు వ్రాసికొన్న 'కవిజన్మకుండలి' యిం దుదహరించుట యెందు కేని మంచిది.


గీ. అజము లగ్న మచ్చోటనే యమరగురుడు

యుగ్మమున రవి బుధ శుక్ర లొప్పుచుండ

గర్కి రాహువు కుజుడు సింగంబునందు

వృశ్చికంబున శని కర్మ గృహమునందు

జంద్ర కేతువు లుండంగ జంద్రనంద

శైల శశి శాలివాహన శకనమ దగు

మిధున మానేషు శశిదిన మిళిత శుక్ల

పక్ష శుక్ర మాసా పరపక్షమందు

జవితి నినవారమున ధనిష్ఠా ద్వితీయ

పాదమున విక్రమేశ్వవర్మ వొడమె

గుజదశా శేషమగు నాలుగు సమ లైదు

నెలలు నిరువది యేడు నాళులు గణింప.

[శాలివాహనశకము 1791 శుక్ల సం. జ్యేష్ఠ బ 4 ఆదిత్య]

                             ___________