ఆంధ్ర రచయితలు/బహుజనపల్లి సీతారామాచార్యులు

వికీసోర్స్ నుండి

బహుజనపల్లి సీతారామాచార్యులు

1827 - 1891

ద్రవిడదేశ వైష్ణవులు. జననము: 1827 సం|| నిధనము: 20-3-1891 సం|| పుట్టుక: నాగపట్టనము. నివాసము: చెన్నపట్టనము. రచించిన గ్రంథములు: సౌందర్యరాజస్వామి శతకము 1849 - వైకృతదీపిక, పదార్థనామకోశము, బాలచంద్రోదయము, 1871 - ఆలఘుకౌముది 1872-నీతిమాల 1872- సతీధర్మసంగ్రహము, ప్రపన్న పారిజాతము 1887-ఆంధ్రశబ్దమంజరి, ఉపాధ్యాయ బోధిని, వినాయక శతకము, త్రిలిజ్గ లక్షణశేషము, శబ్దరత్నాకరము 1855.

సీతారామాచార్యులుగారి పేరు చెప్పినంతనే శబ్దరత్నాకరము, ప్రౌడ వ్యాకరణము జ్ణప్తికి వచ్చుచుండును. శబ్దరత్నాకర ప్రాశస్త్యమును గనిపెట్టి చెన్నపురిలోని దేశభాషాగ్రంధకరణసభ వా రాచార్యులుగారి కైదువేలు సన్మానముగా నిచ్చిరి. నిజమాలోచించినచో నైదులక్ష లిచ్చినను దెలుగువారు వారియప్పు దీర్చుకొనలేరు. "శరీరకష్టమును విత్త నష్టమును నించుకేనియుం బాటింపక" రేలుంబవళ్లు శ్రమించి రచించిన నిఘంటువని నిఘంటుకారులు వ్రాసికొనియేయున్నారు. శబ్దరత్నాకరములోని శబ్దములరూపనిర్ణయము సర్థనిర్ణయము శాస్త్రసమ్మతమైనది. పూర్వ నిఘంటువులకంటె నిది బహువిధముల మేలైనది. అక్షరక్రమముగా రచింపబడిన నిఘంటువులలో నిదిశ్రేష్టము. తెలుగున నీరకమైన నిఘంటువులకు దారితీసినవారు ఎ.డి.కాంబెలు పండితుడు, సి.పి.బ్రౌను పండితుడును. వీరిర్వురు నాంగ్లేయులే. అక్షరక్రమ నిఘంటువులు తెలుగులో వెలయుట కాంగ్లేయులదే యాదిభిక్షము.

తరువాత బరవస్తు చిన్నయసూరిగా రాంధ్రజనసామాన్యమునకందు బాటులో నుండునటు లొక తెనుగుపదముల నిఘంటువును రచింప దలచి పదములు ప్రామాణిక గ్రంధములనుండి యెత్తివ్రాసికొని యచ్చటచ్చట గొన్నిపదముల కర్థనిర్ణయము చేసికొని యీమహోద్యమము తుద ముట్టకుండగనే పరమపద మలంకరించిరి. వారియనంతరము సీతారామాచార్యులవారు సంస్కృతాంధ్రపదములు తదర్థములు కొన్నిప్రయోగములు చేర్చి శబ్దరత్నాకరము సంధానించిరి. ఇది 1885లో వెలువడినది. శబ్దరత్నాకరము తరువాత 'శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు' వెలువడిన విషయము తెలుగువారికి దెలిసినదే.

చిన్నయసూరి వెనుక లాక్షణికులలో సీతారామాచార్యులుగారు ముఖ్యులు. ఈయన సూరికి శిష్యుడ నని వ్రాసికొనలేదు. కాని శిష్యుడైనట్లు జనశ్రుతి. ఆచార్యుల వారు కొండొకచో నిటులనుచున్నారు. "ఫరవస్తు చిన్నయసూరిగారి కాంధ్రమునందును దదుపయుక్త సంస్కృత ప్రాకృతములయందును దలస్పర్శియగు పరిజ్ణానము కలదని వారుచేసిన లక్ష్యలక్షణగ్రంధములే నిరూపించుచున్నవి. మేము వారితో జిరకాలము సావాసము చేసియుంట వారిపాండిత్యము మాకనుభవసిద్ధము." ఇది చూచి వీరి శైష్యోపాధ్యాయిక తెలిసికొన వచ్చును.

ఆచార్యులవారు పండితోత్తముడు సజ్జనాగ్రేసరుడునగు తమ తండ్రిగారికడ విద్యాభ్యాసము చేసిరి. కవితారసథార యథోచితముగ బసినాటనే కలిగినది. అప్పుడు బాలవయోవష్టాకాల వాసస్థానమైన నాగపట్టణములో నున్న సౌందర్యరాజ స్వామిపై శబ్దాలంకారభరితమైన శతక మొకటి రచించిరి. ఈ శతకము శతక కవిచరిత్ర కారులకు దొరికినది. కవిత ప్రాధమికమైనను నిటులు మాధురీభరితముగ నున్నది.


హరశూల నామశరదా
శరదాసితగాత్ర భక్తజనహితసరదా !
వరదామరుచిర సురదా
మరక్షాస్య మహిత సురాజ సుందరరాజా !

మలయజ శిశిర తనురుచిర
జలరుహదళ సదృశనయన జలనిధిశయనా !
కలరవ కలిత కటకయుగ
సులలిత మృదుపద పయోజ ! సుందరరాజా !


ఇది వ్రాయునాటికి గవియీడు ఇరువది రెండేడులు. అప్పటికి జిన్న సాహితియు గవితాధోరణియుగల యాచార్యులుగారు, ఇంక నిచట కూపమండూకమువలె నుండరాదని సమీపమునగల మదరాసునకు వచ్చెను. వచ్చి యానాడు చెన్నపురిలో మంచి వ్యుత్సన్నుడై ప్రామాణికుడైయున్న పరవస్తు చిన్నయసూరిని జేరి యతనితో ననేకవిషయములు చదివెను. సూరి రాజధానికళాశాలలో బ్రధాన పండితుడు. పురాణము హయగ్రీవశాస్త్రిగారు రెండవపండితులు. ఈయిర్వుర సాహచర్యము సీతారామాచార్యులుగారికి విద్యాసంగ్రహణమున జాల నుపకరించినది. 'శబ్దరత్నాకర' నిఘంటురచనాబీజ మాచార్యులవారి హృదయకేదారమున బడినది యీసమయమే. సూరి యహోరాత్రము లదేపనిగా విశ్వనిఘంటురచనోపయోగి పరికర సంగ్రహణ మొనరించుచున్న సమయమది. పాపము! అతనితలచినపని పూర్తికాకుండగనే 1862 మ్రింగి వైచినది. సూరి తత్సమపదములకర్థము వ్రాయవలయునని తలపెట్టలేదు. మన యాచార్యులుగారు తత్సమ పదములుచేర్చి, సూరినిఘంటువు నాదర్శముగా దీసికొని సర్వప్రశస్తముగా "శబ్దరత్నాకరము" నావిష్కరించిరి. సూరి గతించిన 1862 లో నారంభమై యించుమిం చిరువదిమూడేడుల వఱకు సాగి 1885 లో నీనిఘంటువు బయటికివచ్చినదని చరిత్రజ్ణానువులకు దెలివిడి. శబ్దరత్నాకరరచన సాగుచున్న కాలముననే యాచార్యులవా రనేకకృతులు వ్రాసిరి. నిఘంటునిర్విఘ్న పరిసమాప్తికి 'వినాయక శతకము', రచించిరి. దానిలోని పద్యములు సొగసుగా నున్నవి.


వంకర తొండము చేటల
సొంకము గలచెవులు పెద్దపొట్టయు దగ ని

ర్వంకల వందులు వొగడగ
బింకముతో దాల్తువయ్య వేర్వెనకయ్యా!
తల్లిని పరిగొన భక్తుల
కుల్లాసము పుట్టజేసి యురు మదధారల్
వెల్లిగొన సొంపుసూసెడు
బల్లిదు నిను గొల్తునయ్య భవు వెనకయ్యా !

పాఠశాలలకు బనిచేయు విభ క్తిదీపిక, బాలచంధ్రోదయము, అలఘుకౌముది, వైకృతదీపిక మున్నగు చిన్న పుస్తకములుకూర్చిరి.

ఇవియెల్ల నటుండె, శబ్దరత్నాకరము తరువాత నాచార్యులవారికీర్తిని ధ్రువముచేయుగ్రంధము ప్రౌడవ్యాకరణము. నిఘంటురచనాకాలమున భారతాదిగ్రంధ పరిశోధనమువలన గలిగినఫలమే ప్రౌడవ్యాకరణము. సూరి బాలవ్యాకరణమునకు శేషగ్రంథమగుట దీనికి ద్రిలిబ్గలక్షణ శేషమని పేరుంచిరి.సూరివలె నాచార్యులుగారికి సూత్రపఱుచుటలో బొందిక కుదురలేదనవలయును. ఆచార్యులుగారు వ్రాసికొనినట్లు, ఇందలి లక్షణము లసాధారణములనియు నియ్యది విద్యార్థుల కత్యంతోపకారక మనియు ననుటలో సందేహములేదు.

క్షేత్రయ్య సీతారామాచార్యులుగారి దృష్టిలో బరమ ప్రామాణికుడు. క్షేత్రయపదములు వేశ్యలభినయించునపుడు వీరుచెవులు కోసికొనువారట. అభినయాభిరుచియాచార్యులుగారికి బెద్దదని పెద్దలవలన వినుట.

వీరు చెన్నపురిలోని బోధనాభ్యసన పాఠశాలలో ద్వితీయపండితులుగా 1864 లో మొట్టమొదట బ్రవేశించిరి. అక్కడినుండి రెండేండ్లకు ప్రథమపండితస్థాన మాక్రమించి యావబ్జవ మచటనే గడపి చెన్నపురిలో నాడుద్యోగించెడి కొక్కొండ వేంకటరత్నశర్మ, చదులువాడ సీతారామశాస్త్రి మున్నగువారితోపాటు సీతారామాచార్యులవారు నొక పండితస్థానము నాక్రమించిరి. శబ్దరత్నాకరము చదలువాడ సీతారామశాస్త్రిగారేసంధానింపగా, వారితరువాత సీతారామాచార్యులు తమపేర దాని నించించుకమార్పులుచేసి ప్రకటించుకొని రని నమ్మజాలని ప్రతీతి.