ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/సింహాద్రి వేంకటాచార్యుడు

వికీసోర్స్ నుండి

చ. అలరె జకోరముల్ ప్రియతరాబ్జముఖీమణిదృక్చకోరముల్
కలగె సరోజముల్ మదనకంపితపాంథమనస్సరోజముల్
తొలగెను భీతి జక్రములు ధూర్తగుణోజ్జ్వలజారచక్రముల్
నలినవిరోధినూత్నకిరణంబులు కొన్ని దివిం దలిర్పగన్. ఆ. 3.

చ. అతిముద మొప్ప ధర్మతనయాదులు చూచిరి కేకికోకిల
ప్రతతివతంసహంసమదబంభరడింభరథాంగనాదమం
డితబహుగంథబంధురపటీరతటీరతటీరమమాణగోపికా
ధృతమణిదీపికానికరతేజము రైవతకాద్రిరాజమున్. ఆ. 4.



51. సింహాద్రి వేంకటాచార్యుడు

ఈకవి లక్షణావివాహమను నామాంతరముగల చమత్కారమంజరిని రచించెను. చమత్కారమంజరి మూడాశ్వాసముల ప్రబంధము. ఈకవి శ్రీవైష్ణవుడు; చెన్నకేశవాచార్యుల పౌత్రుడు; తిరుమలాచార్యులపుత్రుడు; గౌతమగోత్రుడు. "భధ్రాచలస్వామి రామచంద్రుడొసర నాడెందమున నిండియుండు గాత" అని భద్రాచలరామస్వామి నిష్టదైవతముగా స్తుతియించి యుండుటచేత కవి గోదావరిమండలములోని వాడని తోచుచున్నది. ఇతడు తనగ్రంధమును వైష్ణవమతోద్ధారకుడైన రామానుజాచార్యున కంకితము చేసెను.అప్పకవికి బూర్వికులయిన లాక్షణికు లెవ్వరు నీతిగ్రంధమును పేర్కోనకపోవుటన నితడు 1630-40 వ సంవత్సరప్రాంతముల యందుండెనని యూహింపదగియున్నది. అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను, ఈతని కవిత్వము మొత్తముమీద ప్రౌడముగానే యున్నది. చమత్కారమంజరినుండి రెండుమూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.