ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తిమ్మరాజు

వికీసోర్స్ నుండి

30. తిమ్మరాజు


ఈకవి రాజవంశజుడు; ఓబలరాజు కొడుకు; అనంతరాజు మనుమడు. మంగళగిరి శ్రీనృసింహస్వామి కంకితము చేసి పరమయోగి విలాస మనెడి యైదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఈపద్యకావ్యము నితడు వెంగళనాథుడుచేసిన ద్విపదకావ్యమును జూచియైనను జేసియుండవచ్చును; లేదా స్వతంత్రముగా నైనను జేసియుండవచ్చును. ఇరువురుకవులును నించుమించుగా సమకాలిను లయినందున, ఎవ్వరే గ్రంథమును ముందుగా జేసిరో నిర్ధారణము చేయుటకు శక్యము కాదు.


శా. శ్రీరంజిల్లగ బానకం బనిశమున్ సేవింపగా దద్గుణం
బారూఢిం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్యల
క్ష్మీరమ్యాకృతి నొప్పుమంగళగిరి శ్రీమన్నృసింహుడు స
త్కారుణ్యామృతవృష్టిచే దనుపు నిత్యంబుం బ్రపన్నావళిన్.


ఇది పరమయోగివిలాసములోని ప్రధమపద్యము. ఈకవిత్వము సర్వవిధములచేతను ద్విపదకావ్యమునకంటె శ్రేష్ఠతరముగా నున్నది. ఈకవి కృష్ణదేవరాయనియల్లు డై నయళియరామరాజునకు దోడబుట్టిన పడుచైన కోనమాంబకు కుమారు డై నందున, వసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయనికిని మేనల్లుడే. ఆకాలమునం దితడు కృష్ణా మండలములోని కొండవీటిసీమకు పరిపాలకుడుగా నుండెను. కవి తాను రామరాజాదులకు మేనల్లు డయినట్లును, కొండవీటికి ప్రభు వయినట్లును, పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములో జెప్పుకొన్నాడు-


సీ. ఏరాజుముత్తాత భూరిసామ్రాజ్యలక్ష్మీధురీణభుజుండు సిద్ధనృపతి
యేనరాధిపుతాత నానార్థిసంతానసంతానశాఖి యనంతశౌరి

యేగుణాఢ్యునితండ్రిభోగ వైభవనూత్నసుత్రాము డోబలక్షోణిభర్త
యేవిభుం డలెరామభూవిభు తిరుమలప్రభువేంకటేంద్రుల భాగినేయు
డట్టితిమ్మభూవరు డాజిహతతురుష్క
రక్తశోణనదీకృతప్రబలసలిల
వితతకృష్ణానదీకు డూర్జితుడు కోన
మాంబసుతుడు శ్రీరంగరాజానుజుడు.

మ. సకలశ్రీయుతకొండవీటినగరీసామ్రాజ్యధౌరేయతా
ధికతన్ మీఱుచు నొక్కనా డచలభక్తిస్ఫూర్తి శ్రీవైష్ణవ
ప్రకరంబు న్భజియింపుచున్ హరికథాప్రస్తావనన్ దివ్యయో
గికథల్ వించు దదర్థకావ్యరచనాకేళీసమాసక్తుడై.

ఉ. ఉన్నతి మీరగా బరమయోగివిలాసముపేరికావ్య ము
ద్యన్నవభావబంధురరసాన్వయసన్నుతశబ్దశుద్ధిసం
పన్నత నిట్లు సిద్ధనరపాలునియోబళతిమ్మభువరుం
డెన్నిక జేయ బూని మది నెంతయు సంతస మొందు ధన్యతన్.


పయిపద్యములనుబట్టి యీకవి కావ్యాలంకారసంగ్రహాదులకృతి భర్తలగునరసభూపాలాదులతోను, కృతికర్తలగు రామరాజభూషణాదులతోను, సమకాలికు డగుట స్పష్ట మగునున్నది. కాబట్టి యీ తిమ్మరాజు 1570వ సంవత్సరము మొదలుకొల 1600వ సంవత్సర ప్రాంతములవరకును ప్రసిద్ధు డయియుండవచ్చును. ఈకవి కవితమునం దసమాన మయినప్రజ్ఞ గలవాడు; ఇతడు రచియించిన పరమయోగి విలాసమును నద్భుతములైన చరితములను కలిగియున్నది. పరమయోగివిలాసములోని యీక్రిందిపద్యములవలన కవిత్వప్రౌఢిమ కొంత తేటపడవచ్చును-

ఉ. రెండవమౌనిపుంగవుడు బ్రేమసమాహ్వాయ మైనప్రమ్మిదన్
నిండగ భక్తియన్ చమురు నించి హృదబ్జము వత్తిగాగ ను

ద్ధండతరప్రబోధసముదంచితదీపము సర్వలోకనా
ధుం డగుచక్రికిం బ్రియముతోడ సమర్పణ చేసె నయ్యెడన్. అ. 1.

ఉ. ఇంతుల గూడి చిట్టకము లి ట్లొనరింపగ నించు కేనియున్
వింతతెరంగు లేక ధరణీధరముంబలె నున్నయాదృఢ
స్వాంతుని జూచి రాపతిమచక్కిలిగింతలువోలె గంటిరే
మెంతయు రిత్తవోయె మసయిందరిచేష్టలు నంచు నవ్వుచున్. ఆ. 2.

ఉ. దేవుడొ మౌనియో యని మదిం దలపోతలు నాకె కాని నిన్
వేవురు వేయిచందముల నిందయొనర్చెద రిప్డు మూగయన్
పావులనోరు నీయెడమపాదతలంబున దన్నినట్లుగా
నీవొక యింతయావురని యేడ్వగదన్న కుమారరత్నమా. ఆ. 1.


31. తాళ్ళపాక తిరువెంగళనాధుడు

ఇతడు నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు తాళ్లపాక యన్నయార్యుని మనుమడును, తిరుమలార్యునిపుత్రుడును అయినట్టు గ్రంథారంభమునందలి యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-


ద్వి. హరిసేవ కాశ్వలాయనసూత్ర నంద
వరవంసభవ భరద్వాజగోత్ర
పావనశ్రీతాళ్ళ పాకాన్నయార్య