ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చిత్రకవి అనంతకవి

వికీసోర్స్ నుండి

ఉ. పాయక బ్రాతృయుక్తుడయి భవ్యసుఖంబులు గాంచుచు న్జగ
   ద్గేయయశుం డతండు పరగె న్మహిదై వతపూజలం బితృ
   వ్యాయతతర్పణక్రియల నంచితధర్మము విస్తరిల్లగా
   జేయుచు భూరినిష్ఠ మహిషీయుతుడై మమఖాళి సల్పుచున్.


45. ముద్దరాజు రామన్న


ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈకవి "శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద" యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవిలోకసంజీవనినుండి యతడు తనసులక్షణసారములో నేమియు గైకొనలేదు.



46. చిత్రకవి అనంతకవి

ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు.

సీ. శ్రీహనుమద్వర శ్రీలబ్ధనుకవిత్వచతురుండ లక్షణసారసంగ్ర
   హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతు డగుచిత్రకవి పెద్దనార్య సుతుడ
   విష్ణుచిత్తీయాదివివిధకావ్యార్థముల్ తెలిసి వక్కాణించుధీరసుతుడ
   గండికోటాఖ్యదుర్గస్థలాద్యక్షుడై పృథివి వంతుకు నెక్కు పెమ్మసాని


   చిన్నతిమ్మక్షమాపాలశేఖరుండు
   గారవింపగ బహుమానగౌరవముగ
   మనినధన్యుండ సభ్యసమ్మతగుణైక
   గరిమ వెలయు ననంతాఖ్య కవివరుండ.

ఈవ్యాఖ్యానమును చేయునప్పటికి గవి యిందుమతీపరిణయమును జేయలేదు. ఇతడు చేసిన యిందుమతీపరిణయము నాకు లభించినదికాదు. కవికాశ్రయుడైన పెమ్మసాని చినతిమ్మరాజుయొక్క యన్న పెదతిమ్మరాజు 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసిన వేంకటపతిరాయనికి మంత్రిగా నుండెను.



47. లింగముగుంట రామకవి


ఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు నాకు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు