ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/ఏర్చూరి సింగన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఏర్చూరి సింగన


ఇతఁడు భాగవతమునందలి షష్ణస్కంధమును రచించి శ్రీకృష్ణున కంకిత మొనర్చెను. ఇతఁడు తన వంశమునకు మూలపురుషుఁ డేర్చూరి యెఱ్ఱన ప్రెగ్గడ యని చెప్పికొన్నాడు. ఇతఁడు కవిత్రయములోని యెఱ్ఱాప్రెగ్గడ కంటె భీన్నుడు. ఏర్చూరి యెఱ్ఱనకవిగా ప్రసిద్ధుఁడు కాఁడు. షష్ఠ స్కందమునంతను ఇతఁడు రచింపలేదనియు, పోతన రచింపఁగా శిథిలమైన షష్ణస్కంధభాగములను పూరించెననియుఁ గొందఱు తలంచుచున్నారు, కొన్ని పద్యములు పోతన పద్యములవంటి విందుఁ గానవచ్చుచున్నవి,

సింగనకవి కువలయాశ్వచరిత్రమను ప్రబంధమును గూడ వ్రాసెనని తెలియుచున్నది. అందలి పద్యములు కొన్ని పెదపాటి జగ్గన్న ప్రబంధ రత్నాకరమునఁ గానవచ్చుచున్నవి. కువలయాశ్వచరిత్రము లభింపలేదు.


పిడుపర్తి బసవన-1


ఇతఁడు పాలకురికి సోమనాథుని శిష్యుఁడైన శివరాత్రి కొప్పయ్యయ్యకు మనుమని మనుమఁడు. ఇతఁడు క్రీ.శ. 1420 ప్రాంతమున జన్మించెనఁట. గురుదీక్షా బోధ, పిల్లనైనారుకధ, బ్రహ్మోత్తరఖండము మున్నగునవి యీతని రచనలు. పద్యబసవపురాణకర్తయగు సోమనాథుని కీతఁడు తండ్రి. ఇతని ప్రోత్సాహముననే సోమనాథుఁడు పద్యబసవపురాణమును రచించెనఁట