ఆంధ్రనిఘంటుత్రయము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ఆంధ్రభాష విశేషముగ సంస్కృతముపై నాధారపడి యున్నమాట వాస్తవమేకాని యందుఁ జాలదేశ్యపదములు గూడ నిమిడియున్నమాట యంద ఱెఱుంగనిది కాదు. సంస్కృతభాషయం దమరకోశము మున్నగు నిఘంటువులు పెక్కులున్నవి. నిఘంటుసాహాయ్యము లేనిదే యెంతటి భాషానిష్ణాతునకైన నొక్కొక్కచో నొక్కొకశబ్దముయొక్క విశేషార్దములు గోచరింపక మహాకవులు కావ్యరసగ్రహణమున కంతరాయము కలిగించును. అట్టి నిఘంటువులు మన యాంధ్రభాషయందుఁ జాలతక్కువ. ఉన్నవానిలో నిఘంటుత్రయమని పిలువఁబడుచున్న 1 ఆంధ్రనామసంగ్రహము 2 ఆంధ్రనామశేషము 3 సాంబనిఘంటువు నను నీమూఁడును బ్రశస్తములు, వ్రాత కనువగు సాధనములు స్వల్పమగుటయు గురుముఖము నుండి శిష్యున కెట్టిశాస్త్రమైనఁ బరంపరాగతము కావలసియుండుటచేతను బ్రాచీనకాలమునుండియు నేశాస్త్రమైనను ఛందోబద్ధము కావింపఁబడుచుండెడిది. ఆసంప్రదాయమున కనుగుణముగనే యీమూఁడు నిఘంటువులును బద్యరూపముగ విరచింపఁబడినవి. విశేషశబ్దములఁ దమనిఘంటువులఁ జేర్చి యాంధ్రమహాకవులరచనలు జనసామాన్యమున కందుబాటులో నుండుటకుఁ దోడ్పడిన పైనిఘంటుత్రయకర్తల కాంధ్రజనులు చిరకృతజ్ఞతను జూపవలసియున్నది. 

ఆంధ్రనామసంగ్రహము

ఇది పైడిపాటి లక్ష్మణకవిచే రచింపఁబడినది. ఈకవి యేకామ్రమంత్రి పుత్రుఁడు. కౌండిన్యగోత్రుఁడు. శివభక్తుఁడు. ఈ కవి కాలమును నిర్ణయించుటకుఁ దగినయాధారములు దొరకలేదు. కాని యడిదము సూరకవి యాంధ్రనామసంగ్రహమునఁ చెప్పని తెలుఁగుపదముల నేరి యాంధ్రనామశేషమను నిఘంటువు రచియించెదనని చెప్పుటచేత నాతనికన్నఁ బ్రాచీనుఁడని మాత్రము చెప్పవచ్చును.

ఆంధ్రనామశేషము

ఇది అడిదము సూరకవిచే రచింపఁబడినది. ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు. ఈకవితండ్రి బాలభాస్కరుఁడు. ఈతఁడు రచించిన చాటుపద్యములు మున్నగువానివలన నీతఁడు విజయనగరాధిపతియైన రెండవ విజయరామరాజుగారి కాలములో నున్నట్లు విశదమగుచున్నది. ఈ విజయరామరాజు గారు క్రీ.శ. 1759 సం॥రం మొదలుకొని 1794 సం॥రం వరకు రాజ్యపాలనము చేసిరి. కావున నీకవి కూడ నీకాలములోనివాఁడే యని తెలియుచున్నది. ఇతఁడు కవిజనరంజనము, కవిసంశయవిచ్ఛేదము, ఆంధ్రచంద్రాలోకము, రామలింగేశ్వరశతకము అను గ్రంథములనుగూడ రచించెను.

సాంబనిఘంటువు

ఇది కస్తూరిరంగకవిచే రచింపఁబడినది. ఈకవి యార్వేలనియోగిబ్రాహ్మణుఁడు. ఈతనితండ్రి వేంకటకృష్ణయామాత్యుఁడు. తల్లి కామాక్షమ్మ. ఇతఁడు క్రీ.శ. 1790 సం॥రం ప్రాంతమున తంజావూరి సంస్థానమునందుండెను. ఈ కవి లక్షణచూడామణియను నామాంతరము గల రంగరాట్ఛందస్సును, కృష్ణార్జునసంవాదమను ప్రబంధమునుగూడ రచించెను. ఆంధ్రకాళిదాసబిరుదశోభితుఁడగు నాలూరి కుప్పనకవి తా నీతనిశిష్యుఁడని తన శంకరవిజయమున వ్రాసికొనియున్నాఁడు.

ఈ కవిత్రయము రచించిన పైమూఁడునిఘంటువులను బండితు లగువారిచే టీక వ్రాయించి నిర్దుష్టముగ ముద్రింపించితిమి. దోషము లున్నయెడలఁ బండితులగువారు దయయుంచి మాకుఁ దెలియఁజేసినయెడల రాబోవుముద్రణమున సవరించుకొందుము.


కురుకూరి సుబ్బారావు