అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఈ రెండు పుస్తకాలనూ ప్రతి ఒక్కరూ చదవాలి

వికీసోర్స్ నుండి


తెలుగు జాతి ఆధునిక చరిత్ర

ఈ రెండు పుస్తకాలనూ ప్రతి ఒక్కరూ చదవాలి



తెలుగుజాతి ఆధునిక చరిత్రలో 19వ శతాబ్దిలో నెలకొన్న చారిత్రక పరిణామాలను నమోదు చేస్తూ వెలువడిన రెండు పుస్తకాలను ప్రముఖ నటుడు, 'జనసేన ' అధినేత పవన్‌ కళ్యాణ్‌ అవిష్కరించారు. 2021 మార్చి 29న హైదరాబాదులో అనూహ్యంగా జరిగిన సమావేశంలో ఈ అవిష్కరణ జరిగింది. ఆరెండు పుస్తకాలు 1. దక్షిణ భారతదేశంలో ప్రధమ ప్రజాఉద్యమకారుడు గాజుల లక్ష్మీనరసు చెట్టి(1806 -1868). 2. 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం. గాజుల లక్ష్మీనరసు చెట్టి పుస్తకాన్ని ఆచార్య వకుళాభరణం రామకృష్ణ కొంపల్లి సుందర్‌లు రచించగా 19వ శతాబ్ధి సీమాంధ్ర సమాజం పుస్తకాన్ని కొంపల్లి సుందర్‌ రచించారు. పుస్తకాలు ప్రచురణకాగానే పవన్‌ కళ్యాణ్‌ చదివి, తానుగా చొరవ తీసుకొని, వీటిని మార్చి 29న స్వయంగా ఆవిష్కరించడం విశేషం.

19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం" పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం అని ఆయన అన్నారు. ఆంగ్ల వలస పాలకులవల్ల సీమాంధ్ర ప్రాంతంలో ఎలాంటి అన్యాయాలు జరిగాయో, ఆర్థికంగా, సాంఘకంగా, సాంస్కృతికంగా ఎలా అణగదొక్కారో, ఈ రోజు మనం ఇలా ఉండటానికి కారణాలు ఏమిటో- అనే విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తాయని చెప్పారు.

ఇది మంచి పరిశోధన గ్రంథం. దీన్ని ఇంతకు ముందే సుందర్‌ గారు మొదట “ఇన్‌ పర్ఫ్యూట్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ " పేరుతో 2018లో ఇంగ్లీషులో ప్రచురించి, తనకు ఒక పుస్తకం పంపారని తెలిపారు. ఈ పుస్తకం మీరు చదివితే మీ రాజకీయ జీవితానికి బలమైన తోడ్చాటునందిస్తుందని తెలియజేశారు. దీన్ని చదివిన తర్వాత - ఇంత అద్భుతమైన గ్రంథం కేవలం రీసెర్చి స్కాలర్లు, జర్చలిస్టులు, విద్యార్థుల దగ్గరే ఆగిపోతుందని తెలిసి, బాధపడ్డానన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ చదవాలంటే మీరే తెలుగులోకి అనువదించండని కోరానన్నారు. పోరాటయాత్రలో ఈ పుస్తకంలోని విషయాలను ఉటంకించానన్నారు. మూడేళ్ళ తర్వాత ఎంతో శ్రమపడి తెలుగులోకి తెచ్చారన్నారు. సమాజాన్ని అర్ధం చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని చెప్పారు.

తెలుగు సమాజం కోసం తన సర్వస్వాన్ని భారపోసిన గొప్ప తెలుగుబిడ్డ - గాజుల లక్ష్మీనరసు చెట్టి చరిత్ర మంచి పుస్తకమని, ఆయన మరుగున పడిన తెలుగువాడని- ఇటువంటి వారి జీవితాల నుండీ నేర్చుకోదగిన అంశాలు చాలా ఉన్నాయన్నారు. వీరు 'ప్రజాహక్ములు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంకోసం గళమెత్తిన మొదటి తెలుగువాడని, దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమకారుడు గాజుల లక్ష్మీనరసు చెట్టి అని చెప్పారు. ఈ రెండు గ్రంథాలను రచించిన రచయితలకు ధన్యవాదాలు తెలిపారు.

రచయిత కొంపల్లి సుందర్‌ మాట్లాడుతూ- ఎవరూ ఊహించని స్థాయిలో ఒక ఊహా ప్రపంచ నాయకుడు వాస్తవ ప్రపంచంలోని పరిశోధన విషయాలను గురించి, చలన చిత్ర స్థాయిలోని జనంలోకి తీసుకురావడం చరిత్రలో ఇంతవరకు జరగలేదన్నారు. ఆ ఘనత పవన్‌కళ్యాణ్‌ గారికే సొంతం అన్నారు. తెలుగులో ఈ పుస్తకం వెలువడటానికి పవన్‌కళ్యాణ్‌ చేసిన కృషికి సర్వదా బుణపడి ఉంటానన్నారు. చరిత్రకు సంబంధించిన పరిశోధనలు చేసే పరిశోధకులకు పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన చారిత్రక గౌరవం అని తెలిపారు.