అమ్మనుడి/సంపుటి 5/మే 2019/భారతి లిపి : ఐఐటి మద్రాసు వారి విచిత్ర ప్రయత్నం

వికీసోర్స్ నుండి


లిపి

రహ్మానుద్దీన్‌ షేక్‌ 94930 35658

భారతి లిపి : ఐఐటి మద్రాసు వారి విచిత్ర ప్రయత్నం

ఐఐటి మద్రాసులోని శ్రీనివాస చక్రవర్తి అనే వ్యక్తి ఒకే దేశం,ఒకే లిపి అన్న నినాదంతో భారతి అనే లిపిని కనిపెట్టాడు. భారతదేశ భాషలన్నింటికీ ఏకీకృత లిపిని అందివ్వడం వీరి లక్ష్యం. లిపి అనేది భాషకు వెన్నుదన్ను. లిపిలో భాష భావన ఇమిడి ఉంటుంది. ఆ భూభాగపు లక్షణాలు లిపిలో ప్రతిబింబిస్తాయి. తెలుగు లిపి వందల ఏళ్ళుగా మెరుగుపడుతూ ప్రస్తుత స్థితికి చేరింది. మనిషి చేసే శబ్దాలు భాష అయితే, ఆ భాషకు అక్షర రూపం లిపి. తెలుగు లిపికి ఉన్న విశిష్టత, మిగతా భారతీయ భాషలతో పోల్చుకుంటే మన వాడకంలో ఉన్న అన్ని శబ్దాలకు అక్షరాలు కలిగి ఉండటం. వాటిని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించడం లేదు, అది వేరే విషయం.

తిరుమల రామచంద్రాచార్య మన లిపి పుట్టు పూర్వోత్తరాలు పుస్తకంలో తెలుగు లిపి పరిణామక్రమాన్ని ముఖ్యంగా చర్చిస్తూ మానవభాషల లిపుల ఆవిర్భావాన్ని గురించి చర్చిస్తారు. లిపుల వైవిధ్యం భాషల, సంస్కృతుల వైవిధ్యానికి ప్రతీక. ఏకీకృత లిపి అనేది బయట నుండి తెచ్చిన ఒక పరాయి సాంస్కృతిక చిహ్నాన్ని ప్రాంతీయ లిపులపై రుద్దడం. ఇది అనవసరం, పైగా దీనివలన జరిగే మేలు కన్నా చేటు ఎక్కువ.

ఇక ఈ ఐఐటి మద్రాసులో రూపొందిన లిపిని గమనిస్తే ఇది కేవలం అచ్చు లేదా కంప్యూటర్‌ ప్రధానంగా రూపొందిందే. తప్ప, చేతివ్రాతలో ఈ లిపి అక్షరాలను మలచటం కష్టం. ఒక అక్షరం, ఇంకొక అక్షరానికి ఉన్న తేడాను చేతివ్రాత తగ్గిస్తుంది, ఆ తగ్గింపు రెండు అక్షరాలను దాదాపు ఒకటే విధంగా చూపిస్తే, అనర్థాలు వస్తాయి. అలాంటి సమస్య ఈ లిపిలో దాదాపు అన్ని గుణింతాలలో కనిపిస్తోంది. లిపిని కనిపెట్టాక, ఆ లిపి వాడుకను పరిశీలించాలి. అందుకు కాస్త కాలం పడుతుంది. అంత సమయం వెచ్చించకుండా, ప్రభుత్వ నిధులను ఖర్చు పెట్టి, ఒక అర్ధం పర్థం లేని లిపిని తయారు చేసి, అక్కడితో ఆగకుండా ఆ లిపిలో భాష పనిముట్లని ఖర్చు చేసి, వాటి ఘనకార్యంగా ప్రకటించుకోవడం గమనించాలి. ఇక్కడొక కథ చెప్పుకుందాం, పూర్వం చీకటి రాజ్యంలో తికమక రాజు ఉండేవాడట. అంతకు ముందు రాజ్యం చేస్తున్న రాజు, అతని సైన్యంతో యుద్దానికి వెళ్ళి, అందరు విజ్ఞులను పోగొట్టుకొని వారందరిని యుద్ధంలో చంపుకున్నాడట.

రాజ్యంలో కేవలం మూర్చులే మిగిలారట. ఆ రాజు ఆత్మహత్య చేసుకుని మూర్ఖుడైన తన దాయాదికి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి చనిపోయాడట. ఈ కొత్త తికమక రాజుకు రాజనీతిపై అస్సలు అవగాహన లేదు, అతని చుట్టూ చేరిన మూర్ధ శిఖామణులు కలిసిరాగా చిత్ర విచిత్ర చట్టాలు రాజ్యంలో అమలు చేసాడట. ఏ వస్తువైనా వర్తకంలో ఒకే ధరకు అమ్మాలి, ఏ నేరానికైనా ఒకే శిక్ష అమలు పరచాలి, రాజ్యమంతటా ప్రజలు ఒకే రంగు దుస్తులు వేసుకోవాలి, అందరూ ఒకే భాష మాట్లాడాలి, ఒకే దైవాన్ని పూజించాలి వగైరా. ఇక ఆ దేశ పరిస్థితి ఏమై ఉంటుంది? మిగిలిన తెలివి వాళ్ళంతా రాజ్యాన్ని మెల్లగా వదిలి వెళ్ళిపోతారు. రాజ్యానికి వచ్చిన ఒక తెలివైన గురువుగారు తమ ఇద్దరు శిష్యుల్లో ఒకడు మూర్ఖరాజు సభలో మరణశిక్ష పొందబోతుండగా, చొరబడి ఆ శిక్షను రాజుకు అమలయ్యేలా చేస్తాడు. ఆ కథ సుఖాంతమవుతుంది. కథ నుండి అర్ధమయినది ఏమిటంటే, వస్తువుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని తన ఆలోచనకు మించిందనుకున్న రాజు, అతని మంత్రులు అన్ని వస్తువులను ఒక కాడుకి కట్టేస్తే సమస్య పరిష్కారమయిందనుకున్నారు. అన్ని నేరాలు పరిశీలించే ఓపిక లేక, అన్ని నేరాలకు ఒకే శిక్ష అన్నారు.ఇది భారతెందు హరిశ్చంద్ర రాసిన 'అంధేర్‌ నగరి, చౌపట్‌ రాజా.

అలానే ఈ ఐఐటి మద్రాసు పెద్ద చేసిన పని ఏమిటంటే, న్భాషలు చాలా క్లిష్టమైనవి, వాటికి తగిన భాషా పనిముట్లు తయారు చేయడం అంతకన్నా కష్టమైన పని, దానికి బదులు నా ఆలోచనలకు,

నా బద్ధకానికి తగిన ఒక కొత్త లిపిని కనిపెట్టి ఆయా భాషల స్థాయిని నా లిపి స్థాయికి తెగ్గొట్టి నా లిపి మీద పని చేస్తున్నాయి గనుక ఈ పనిముట్లు విజయవంతం అయ్యాయి”. అనే భావనలో ఉన్నాడు. అని అనిపిస్తోంది.

భారతీయ భాషల పై జరగాల్సిన పరిశోధనలకు, పని చేయాల్సిన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వనంత వరకు ఇలాంటి నాణ్యతలేని పరిశోధనలే చలామణి అవుతాయి. భాషల పట్ల శ్రద్ధ ఉండి ఉంటే ప్రభుత్వాలు ఇలాంటి వృథా పనులలో డబ్బులు ఖర్చు చేయవు.

ఏవ్రిల్‌ 27న వచ్చిన హిందూ పత్రిక వార్తలో, సరికొత్త పురోగతిగా ఈ ఐఐటి మద్రాసు భారతి లివి జట్టు వారు తమ లిపిలో ఓసీఆర్‌ పని చేస్తుందన్నారు. తద్వారా తొమ్మిది భాషల్లో ఓసీఆర్‌ పని చేస్తోందని రాసుకున్నారు. అది భాషలను ఉద్ధరించే విధానంగా పలువురు ఈ వార్తను సోషల్‌ మీడియాల్లో పంచుకున్నారు.