అమ్మనుడి/సంపుటి 5/మే 2019/పరులపాలనలో తెలుగువారి దుస్థితిని తెలియజెప్పిన జంపన

వికీసోర్స్ నుండి

పరుల పాలన

ఎస్‌.ఆర్‌. పృధ్వి 99892 23245

పరులపాలనలో తెలుగువారి దుస్థితిని తెలియజెప్పిన 'జంపన '

వ్యాపార నెపంతో భారత భూ భాగాన్ని హస్తగతం చేనుకుని, రెండు శతాబ్ధాల పాటు రాజ్యాధికారాన్ని అనుభవించిన ఆనందంలో ఆంగ్లేయులు ; భాషా సంస్కృతులు విచ్చిన్నమై, సంపద దోపిడీ చేయబడి, మాన ప్రాణాల భయంలో భారతీయులు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది. జాతి స్వేచ్చకోసం కలంతో పోరాడిన చిలకమర్తి వేదుల, గరిమెళ్ళ వంటి కవులలో 'జంపన' ఒకరు. తెలుగు పౌరుషాన్ని అక్షరబద్దం చేసి, కవిత్వంగా మలిచి, ఆ జ్వాలాక్షరాలను ఆంగ్లేయులపై వదిలారు అదే 'ఆంధ్రజ్వాల ' కవిత్వం.

తెలుగు నేలను “వేద సుధలను పితికిన ప్రేమభూమి” అన్నారు కవి. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రతి మనిషిలోను, ముఖ్యంగా కవులు, దేశాన్ని కన్న తల్లితో సమంగా భావించేవారు. పుట్టి, పెరిగిన ఊరుని ఎంతగానో అభిమానించే వారు. పుట్టిన మట్టిలో తనువు చాలించడం గొప్ప భాగ్యంగా భావించేవారు.

ఇప్పటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అందరం స్వతంత్రులమే. ధన కాంక్ష అధికార కాంక్ష దేశాన్ని రాష్ట్రాలను పాలించాలన్న తపన తప్ప, మరొకటి కనిపించదు. ఎవడి గోల వాడిది ; ఎవడి తాపత్రయం వాడిది. నేను, నాది అనే అహం తప్ప ఏకోశానా మనము అనే ధ్యాస కనిపించదు. జంపన తెలుగు నేలను, తెలుగు భాషను ప్రేమించిన కవి.

“నేను తెలుగువాడను - తల్లి నేల కొరకు
రాల్ఫు కన్నీళ్ళే రత్నాల రాసులగును ;
నేను తెలుగు వీరుడ - తల్లి నేల కొరకు
కార్చు రుధిరమ్మె స్వాతంత్ర్య సుధల నొసగు” అంటారు.

నేను తెలుగు వాడను ; ఈ నేల నా తల్లి అని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలుగు మాటలో సత్యము వెలుగుతుందంటారు. తెలుగు పాటలో ధర్మము చెలగుతుందంటారు. తెలుగువారి ఆటల్లో ధైర్యం కలుగుతుందంటారు.

“కనుల జలజల భాప్పముల్‌ కార్చుచున్న

తల్లి వదనమ్ము కనలేము ; తాళలేము” అని మాతృదేశముపై అమితమైన భక్తి ప్రపత్తులను ప్రకటించారు. అంతే కాదు ; ఆ నాటి వైభవం, తెలుగు పౌరుషం గురించి యిలా అన్నారు.

తెలుగు ప్రతాపుని కొలువులో జయభేరి
పలుకదా దిగ్వ్యాప్తి సలుప నేడు?
రాజ రాడ్విభుని కొల్వుంగ రా రేలనో
నన్నయాది కవులానంద గరిమ?
కృష్ణరాయలు స్మరియించు తెలుగు భూమి
తలచదా స్వేచ్భా పథమ్మొకింత?
బాల చంద్రుని భుజాస్ఫాల నమ్మున రేగు
పౌరుషనహ్ని ఏ వసుధ దాగే?

ఈ విధంగా ప్రాచ్య ఆంధ్ర పౌరుసాగ్ని లోంచి వెలువడిన జ్వాలలు ఏ విధంగా నున్నవో ప్రస్తావించారు.

తెల్లవాడి పాలనలో మనవి బానిస (బ్రతుకులైనాయి. అని ఎందరో ఆ బాధలు అనుభవించిన స్వాతంత్య్ర సమర యోధుల జీవితాలు చెప్పాయి. అవి చూచిన కవులు కలాలు విదిలించారు. ఆనాటి బానిస పరస్థితుల గురించి జంపన గారు కూడా వ్రాసారు.

“దేశ కళలపై నివ్చులు పోసినాడు
దేశ కవితల హృదయమ్ము కోసినాడు
పరుల యెొంగిలి కూటికై కరము చాచి,
బానిసత్వము విడలేక బ్రతికి నాడు”

ఆనాడు దేశ సాహితీ, సాంస్కృతిక, కళా రంగాలు నాశనమై, మనుషులు ఆంగ్లేయులకు బాసినలుగా బ్రతకడం, వాళ్ళు వేసే ఎంగిలి మెతుకుల కోనం ముగం వాచి ఎదురు చూడడం వంటి దురదృష్టకరమైన దృశ్యాలు- కవి కంటబడ్డాయి. దేశ సంస్కృతిని దెబ్బతీయడమంటే యిదే కదా -

“మాతృభాషలో మాటాడమరచి తలచు
ఆంగ్లభాషనే సభ నుపన్యాసమిచ్చు
దేశ భక్తులు నీ యింట తిరుగుచుండ
తిరిపమెత్తుట కింకేమి కొరత తల్లి!”

అంటు ఆనాటి దౌర్భాగ్య స్థితి గురించి వాపోతారు కవి.

“తెలుగు స్వభాష యనుచు / నుతించి, పఠించిన వాడు / దుఃఖ భాజనుడయి / కూడు గుడ్డలు / ప్రశాంతియు / పొందలేక / తా వెనుకటి శౌర్య సంపద - / కవి ప్రవరాళి ప్రతిజ్ఞ తెల్పుచును / కనులను ప్రాణముల్‌ నిలువగా / పఠియింపడె దాస్య గీతముల్‌?”

తెలుగు నా భాష యని సగర్వముగా చెప్పుకున్నవాడు కూడు, గుడ్డ, శాంతి, సౌఖ్యములు దూరమై దుఃఖ సాగరంలో కొట్టుకు పోవడం కవి దర్శించాడు. కళ్ళల్లో ప్రాణాలను నిలుపుకుని దాస్య గీతాలు ఆలపించడం దురదృష్టకరం.

జంపన కవిత్వంలో 'బలిపీఠం ' అనే కవితా ఖండిక ఒకటి కనిపిస్తుంది. ఆంగ్ల విద్యనభ్యసించి జీవితాన్ని నైవేద్యంగా పెట్టారు అంటారు.

“ఆంధ్రభాషామ తల్లి హృదయంతరమున
అడుగులను మోపి, ఠీవిగా నడచి నీవె
ఆంగ్ల విద్యాలయమ్ముల కరిగి - నీదు
జీవితమ్మె నైవేద్యమ్ము చేసినావు”

అనాటి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన కవి. ఎంత చక్కటి పద్యమిది. ఈయన రచనలో భావగాంభీర్యం నిండుగా కనిపిస్తుంది. పద సౌశీల్యమూ కనిపిస్తుంది. చివరిగా -

“బ్రతుకగనెంచ 'ఆంధ్రు” డని
పల్కబోకుమ ; పల్కినంత, నీ
యతనము బుగ్గి పాలయి, ప్రయాసమె
నిల్చును మృత్యుదేవి యై ;
సతతము దుఃఖ భోక్తవయి.
శాంతి నెరుంగక, వెర్రివాడవై
వితరణ శీలురన్‌ గనగ వేడియ
కంఠము రుద్ధ మొందంగా”

స్వాతంత్య్రానికి వూర్వం తెల్ల దొరల పాలనలో దేశంతో పాటు, ప్రజలు, భాష ఏ విధంగా దోపిడీకి గురయిందో, బానిసత్వాన్ని అనుభవించిందో ఈ చిరు కావ్యంలో ప్రస్తావించారు కవి. బ్రిటిష్‌ వారి పరిపాలనను, ఆలోచనలను వ్యతిరేకించిన కవులు ఆ తరంలో అనేకమంది కనిపిస్తారు. జంపనగారు కూడా ఆదారిలో నడిచి, వారి ఆలోచనలను నిర్మొహమాటంగా కావ్య రూపంలో పెట్టడం జరిగింది. అటువంటి నిస్వార్థ కవులను మననం చేసుకోవలసిన అవసరం ఉంది.


(29 వ పుట తరువాయి)

జనానికి కావలసిన శిక్షణ ఇచ్చి, అధికారుల ముక్కు నేలకు రాసి అమలుచేయించాలి. సంఘాలు పోటీ పడాలి. చట్టం అమలుకాకపోతే నష్ట పోయేది ప్రజలే. “తిరిగే కాలు, తిట్టే నోరు” అన్నట్లు ఈ మేధావులకు నేర్చుకునే కుదురు, విషయపరిజ్ఞానం శూన్యం. ఈ ధోరణి వల్లే శంకరన్‌ ప్రారంభించిన ఏజెన్సీ ప్రాంతాల భూమిసర్వే, అడవి హక్కుల మార్గ దర్శకాలు, గిరిజన ప్రాంతాలలో పంచాయత్‌ రాజ్‌ గ్రామసభల ఏర్పాటు నిరుపయోగంగా మారాయి. సంఘాలు మేధావులు రచయితలు ఖండన పర్వాన్ని రక్తి కట్టిస్తున్నారు.జనం కూడా పత్రికలో తమప్రకటన చూసుకుని మురిసిపోతున్నారు. 'నేల విడిచి చేసే సాముగరిడిలకన్న నేలను అంటిపెట్టుకుని నీటిలో చేపల లాగా మెలగగల మెలకువతో నిర్వహించుకుని నిభాయించుకోగల సాములకే ఎక్కువ విలువ, మన్నన'(ఏ. బి.కె. ప్రసాద్‌ 'మహత్తర శ్రీకాకుళ పోరాటం” ముందుమాట 2006) అంటూ గత ఉద్యమాలను చూసిన వారి హితవును చెవినపెట్టాలి. నూతన ప్రజాస్వామిక విప్లవం, పీడిత జన విముక్తి, రాజ్యాధికారం, సాహిత్యం - సామాజిక స్పృహ శాస్త్ర విజ్ఞానాల ఆధునికీకరణ అంటూ “ఎవరికి తెలియని ఏవో పాటలు పాడే” బుద్ధిజీవులు తమపాత్రను నిర్వచించుకో వలసిన అవసరం వచ్చింది.

వలస

పిచ్చికా! నువ్యున్నట్టా లేనట్టా జాడలేని నిన్ను లేవనే అనుకొంటున్నది లోకం. అయినా నువ్వున్నావన్న నమ్మిక గుండె చెట్టు కొమ్మ మీద కిచకిచలాడుతుంది ఇప్పటికీ ఏ మూలో చూరు తొర్రలో ఓ చిట్టి గూడు చిట్ట చివరి ఆశతో నిరీక్షిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతోంది మా గోడకు బిగించిన అద్దం నీ కోసం దిగులు పడింది ఎక్కడికెళ్లిపోయావు పిచ్చుకా! జాలిలేని జనం గాజు కళ్లలో నీ కోసం చుక్క కన్నీరు కరువైందన్న నిజం తెలుసుకున్న తర్వాత దయలేని హృదయాల నీడలో తరంగ దైర్ధాల టవర్లకే తప్ప నీ కోసం చిటికెడు ఆశయం లేదన్న నిజం తెలిశాక మా పిల్లలు యిప్పటికీ నిన్ను పుస్తకాల్లోనే చూసుకొంటున్నారు.

గుర్రాల రమణయ్య

9963 921943

శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు మానసిక వికాసానికి తల్లి భాష గుండెలోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేది అమ్మనుడిలోనే.