అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/మౌనంలోని మాటలు-9

వికీసోర్స్ నుండి
ధారావాహిక

మౌనంలోని మాటలు

9

సంచారి రావోళ్ళు నాగప్ప ఆత్మకథ

కన్నడ మూలం:

తెలుగు అనువాదం:

డా.ఆర్.వి.బి.కుమార్

రంగనాథ రామచంద్రరావు

9059779289

కూతురు పుట్టుక

నేను రెండవ పెళ్ళి చేసుకున్నాను. పెళ్ళి చేసుకున్న సంవత్సరానికి సరిగ్గా కూతురు పుట్టింది. మా సముదాయానికి చెందిన ఆడపిల్లలు సామాన్యంగా గర్భవతులు అవుతే డాక్టర్ దగ్గరకు వెళ్లటం అరుదు. వాళ్ళు తమకు తెలిసిన నాటుమందులు తయారు చేసుకుంటారు. అయితే నా రెండవ భార్య గర్భవతి అయినప్పుడు నా కన్నా ఎక్కువగా సంతోషపడింది నా మొదటి భార్య. ఆమె డాక్టర్ దగ్గరకి నా రెండవ భార్యను తీసుకుని పొమ్మని పోరు పెట్టింది. మొదటి భార్య పోరుపెట్టడంతో గర్భవతి అయిన రెండవ భార్యను డాక్టర్ దగ్గరకి పిల్చుకుని పోయాను. డాక్టర్ అంటే ఊరికేనా? ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బు పీక్కోవటమే కదా!

కాన్పు రోజు దగ్గర పడినపుడు గంగావతికి పిల్చుకునిపోయాను. డాక్టర్ అడ్మిట్ చేసుకున్నాడు. అడ్మిట్ చేసుకున్న రెండు రోజులకు తల్లి కడుపు కోసి బిడ్డను బయటికి తీయాలన్నాడు. నాకు ప్రాణాలే పోయినట్టయ్యాయి. ఆపరేషన్ అంటే నాకేమో భయం! మేము ఎంతైనా బిచ్చం అడగటానికి చెయ్యి కోసుకుని రక్తంకార్చి బిచ్చం అడిగేవాళ్ళం. చెయ్యి కోసుకోవటం మాకు సాధారణమైన విషయం. కోసుకున్న చేతికి ఇంటికి వచ్చిన తరువాత గుంటగలగరాకు రసం పిండుకుని, వాటి ఆకులు కట్టుకుంటే రక్తం నిలిచిపోయి నెమ్మదిగా గాయం మానిపోయేది. మరుసటి రోజు బిచ్చం అడిగే సమయానికి మరో చోట చెయ్యి కోసుకునేవాళ్ళం. అయితే కడుపు కోయటం మాకు కొత్త. ఏ పిల్లలు వద్దు. ఇంటికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం.

ఆ సమయంలో నాలో ధైర్యం నింపింది నా మొదటి భార్య. "ఏమీ కాదు ఊరుకో, డాక్టర్ ఉన్నాడు! ఆయనే అంతా చూసుకుంటాడు" అని చెప్పింది.

మనస్సుకు కొంచెం నెమ్మది కలిగింది.

అందులో ఆపరేషన్ అంటే ఊరికేనా? మాలాంటి పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు సమకూర్చుకోవాలి? భయం వేసింది. చివరికి నా పెళ్ళికి దండన కట్టడానికి డబ్బు ఇచ్చిన ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళి వడ్డీకి డబ్బు ఇప్పించుకుని వచ్చాను. ఆపరేషన్ జరిగింది. కూతురు పుట్టింది. భార్య ఆరోగ్యవంతురాలైంది.

కూతురు పుట్టి నా పురుషత్వాన్ని రుజువు చేసింది!

నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు!!!

టీ తాగిన కథ

మొన్న 2013లో మునిసిపల్ ఎలక్షన్‌లో జరిగిన సంఘటన ఇది!

ఆరోజు పొద్దున్నే ఓటు వేయడం కోసం వరుసలో నిలబడ్డాను. ఎవడో ఒకడు టీ ఇచ్చే కుర్రవాడు అటుగా వచ్చాడు. లోపల రాసు కోవడానికి కూర్చున్న వాళ్ళకంతా టీ ఇచ్చాడు. వరుసలో నేను నిలబడివున్నాను. ఎందుకో టీ పిల్లవాడు నాకూ టీ ఇచ్చాడు. అతను నాకు టీ ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు. ఓటు వేయడానికి నా వంతు కోసం నిలబడిన నాకు అప్పటికే తలనొప్పెడుతూ ఉంది. టీ ఇస్తుండగా ఎందుకు? ఏమిటి అని అడగకుండా టీ తీసుకుని తాగసాగాను.

అదే సమయంలో ఎవరో సబ్ ఇన్‌స్పెక్టర్ వచ్చాడు.

అతని పేరు ఆనందో ఏమో? నాకు తెలియదు.

రాగానే టీ తాగుతున్న నన్ను చూసి, "ఏనా కొడుకు టీ ఇచ్చాడ్రా లమ్డికే" అని తిట్టాడు.

నాకు చాలా అవమానంగా అనిపించింది. నేను అడగకపోయినా ఆ కుర్రవాడే టీ ఇచ్చాడు. నేను తాగాను ఇందులో నా తప్పేముంది?

నేను ఆ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉన్నంత ఎత్తు ఉన్నాను. ఒకవేళ అలా ఉండడం కారణమా?

లేదా నేను చదువుకోకపోవటం కారణమా?

ఇప్పటికీ నాకు అర్థం కాలేదు.

ఆ మనిషి నన్ను తిట్టడానికి కారణం ఏమైవుండొచ్చని ఎంత ఆలోచించినా ఇప్పటికీ కారణం తెలియలేదు.

చదువులేని వాళ్ళకు మానం-మర్యాద ఉండవా?

అదీ అర్థం కాలేదు!

సంచారి శవసంస్కారం
గతంలో మా నాన్న నా భార్య అమ్మమ్మను

భుజం మీద మోసుకుని పోయి శవసంస్కారం చేసిన కథ చెప్పాను.

అలాంటిదే మరొక ఘటన మొన్ననే జరిగింది. దాన్ని చెబుతాను. వినండి.

నాకు ఇప్పుడు ఒక ఏడాది వయస్సున్న చిన్న కూతురుంది. నాకొక అంగడి కూడా ఉంది. అందులో మా జనాలకు అవసరమైన కాయగూరలు, పచారీ సమాన్లు, బీడీలు, ఆకులు, వక్కలు, టీ మొదలైనవి అమ్ముతాం. మా వీధిలో మాలాంటి సంచారులు హెయిర్ పిన్నులు, పిల్లల ఆటవస్తువులైన పీపీ, బెలూన్, ఈలలు మొదలైనవాటిని అమ్మటానికి వస్తారు. ఈ విధంగా పీ పీ, పిన్నులు మొదలైనవి అమ్మటానికి ఈ మధ్యన కడుపుతో ఉన్న ఒక స్త్రీ వచ్చేది. ఒక్కొక్కసారి ఆమెతోపాటు ఆమె భర్త కూడా వచ్చేవాడు. ఇలా వచ్చినపుడు మా అంగడిలోనే ఇద్దరూకూర్చుని టీ తాగి, నా కూతురుకు పీపీ ఇచ్చి అమ్మాయిని కాస్సేపు ముద్దుచేసి వెళ్ళేవారు. మేము సంచారులం అన్నది వాళ్ళకూ తెలుసు. వాళ్ళు కంప్లికి వచ్చి ఎక్కడ ఉంటున్నారో అనే విషయాలను నేను విచారించలేదు.

మొన్న శుక్రవారం అంటే 17-5-2003న మా ఊర్లో సోమప్ప జాతర ఉంది.

ఆరోజు మధ్యాహ్నం నేను అంగడికి కావలసిన సామాన్లు తీసుకుని రావటానికి అయిదు వందల రూపాయలు జేబులో పెట్టుకుని బజారుకు వచ్చాను. అదే సమయానికి ఆ గర్భిణి స్త్రీ భర్త బజారులో కనిపించాడు. నన్ను చూడగానే -

"దండాలు అన్నా" అన్నాడు.

"దండాలు, ఏమిటి సమాచారం? వ్యాపారానికి పోలేదా?" అని అడిగాను.

"లేదన్నా, నా ఆడది సచ్చిపోయిందన్నా. ఏం చేయాలో తెలియటం లేదు. సంస్కారం చేయడానికి లేదు. ఏమీ అర్థం కావటం లేదన్నా" అన్నాడు దీనంగా.

"ఎక్కడ ఉన్నారు?"

"సోమప్ప గుడి దగ్గర" అన్నాడు.

సోమప్ప గుడి కోనేరు పక్కన చాలా మంది చిన్నదాసరులు, శికారివాళ్ళు మొదలైన సంచారులే నివసిస్తున్నారు.

"అన్నా, పీనుగుని తొందరగా తీసుకునిపొండి. ఇప్పుడు తేరును లాగుతారు. పీనుగుని పక్కన పెట్టుకుని తేరును లాగడానికి కుదరదని గుడి కమిటీవాళ్ళు తొందర పెడుతుండారు. నా దగ్గర డబ్బులు లేవు. ఆడది బాలింత కావటంవల్ల పూడ్చకూడదంట. దహనం చేయాల్నంట. కట్టెలమండి దగ్గరకి వెళితే కట్టెలకు నాలుగువేలు అడుగుతుండారు. ఇలాంటి సమయంలో నువ్వు దేవుడు కనిపించినట్టు కనిపించినావన్నా. ఏదైనా సహాయం చెయ్" అని అడిగాడు.

"రా, బండి వెనుక కూర్చో" అన్నాను.

నా సైకిల్‌మోటార్ ఎక్కి కూర్చున్నాడు.‌

నేరుగా సోమప్పగుడి దగ్గరికి పోయాం . తేరుగది ఇంటి వెనుక భాగంలో గుడిసె వేసుకున్నారు. గుడిసెలో శవాన్ని పడుకోబెట్టారు. అందులో ఉన్నవాళ్ళంతా బయట ఉన్నారు. ఆ కుటుంబంలో కేవలం భార్యాభర్తలు, భర్త అన్న ఉన్నారట. ఇప్పుడు ఆ స్త్రీ మగబిడ్డను కని చనిపోయింది.

మొన్న ఆమె చావటానికి నాలుగు రోజుల ముందు ఆ స్త్రీకి నొప్పులు మొదలయ్యాయట. మరోదారి కనిపించక ఆస్పత్రికి పిల్చుకునిపోతే డాక్టర్ బళ్ళారిలోని పెద్దాసుపత్రికి పిల్చుకుని పొమ్మని చెప్పారట. అయితే వారి దగ్గర డబ్బు లేనందువల్ల - 'దేవుడు పెట్టినట్టు కానీ' అని తిరిగి గుడిసెకు పిల్చుకుని వచ్చారట. ఇంట్లోనే కాన్పు జరిగి మగబిడ్డను కన్నదట. కాన్పులో చాలా రక్తం పొయిందట. ఇదీ జరిగిన మూడు రోజుల వరకూ బాగానే ఉందట. నాలుగవ రోజున సుమారు పన్నెండు గంటలకు బాలింతరాలు భర్త అన్న దగ్గరకి వచ్చి బీడి అడిగిందట. ఆమె అంతకు ముందు ఎప్పుడూ బీడీ తాగలేదట. ఆమె బీడీ అడగటంతో ఒక బీడీ ఇచ్చాడట. అతని దగ్గరే అగ్గిపెట్టె ఇప్పించుకుని బీడి వెలిగించి కాల్చిందట. అది పూర్తవుతుండగా మరొక బీడి ఇప్పించుకుని తాగిందట. ఇలా మూడు బీడీలి కాల్చిన ఆమె మూడవ బీడీ తాగిన తరువాత "నేను ఇంగ పోతాను మావా" అని అందట. ఎందుకిలా అన్నదో అర్థం కాలేదట. నిల్చున్నపాటున నేల మీద పడి ప్రాణాలు వొదిలిందట.

నేను వెళ్ళి చూసే సమయానికి గుడిసె ముందు కొంత మంది జనం నిలబడి ఉన్నారు. అందులో కొందరు ఆడపిల్లలు శవసంస్కారం కోసం చందా ఎత్తుతున్నారు. అదంతా చూసి అంగడి కోసం సామాన్లు తీసుకుని రావటానికి తెచ్చిన అయిదువందలు ఆమె భర్తకు ఇచ్చేశాను.

"ఈ దుడ్లు చాలదన్నా! ఎట్లా చెయ్యాలి?" అన్నాడు.

ఆ వ్యక్తిని బండి వెనుక కూర్చోబెట్టుకుని మా వీధికి వెళ్ళి చందా అడిగాను. ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర పరిస్థితి వివరించి చందా అడిగాను. హక్కిపిక్కి కాంత్‌ను అడిగితే అయిదువందల రూపాయల విలువైన కట్టెలు సామిల్లులో ఇప్పించాడు. మరో రెండు సా మిల్లులకు వెళ్ళి పరిస్థితి వివరిస్తే వాళ్ళు కూడా కట్టెలు ఇచ్చారు. మా ఇంట్లో అయిదు లీటర్ల కిరసనాయిల్‌ ఉంది. తెచ్చి వారికి ఇచ్చాను. మొత్తం చందా సొమ్ము అయిదువేల రూపాయలు పోగయ్యాయి. మొత్తం సొమ్ము వాళ్ళకే ఇచ్చాను.

అన్ని సమకూరాయి. అయితే శవం మోయటానికి ఒక్కరూ రాలేదు.

చివరికి అక్కడ ఉన్నది నేను, ఆ స్రీ భర్త, అతడి అన్న, అంతే !

ఏం చేయాలో తోచలేదు. నా బండిలోనే వెళ్ళి ఒక పూలదండ తెచ్చి శవానికి వేశాం. ఊరి నుంచి ఊరికి తీసుకునిపోవటానికి ఒక పాత ఆటో వారి దగ్గర ఉంది. ఆటోలో శవాన్ని వేసుకుని ముగ్గురం శ్శశానికి వెళ్ళాం. మేమే కట్టెలు పేర్చి శవాన్ని దాన్ని మీద పడుకోబెట్టి నిప్పుపెట్టాం. శవం కాలిన తరువాత ఇంటివైపు వచ్చాం.

ఆ సంఘటన నాకు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుంది.

మా సంచారుల నుమారు 300 కుటుంబాలు కంప్లిలో ప్రస్తుతం నివాస మున్నాయి.

అయితే ఒక వ్యక్తి కూడా శవానికి భజం ఇవ్వడానికి రాలేదు.

మేము సంచారులం. కొంచెం మారినామని అనుకున్నాను.

ఈ ఘటన జరిగిన తరువాత మేము ఇంకా మా తండ్రి కాలంలో ఉన్న స్థితిలోనే ఇప్పటికీ ఉన్నామని నాకు అనిపించింది.

మా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో చెప్పండి?

యముడిని గెలిచినవారు :

కూతురు పుట్టినపుడే పిల్లలు కాకుండా ఆపరేషన్‌ చేయించాలని అనుకున్నాను.

అయితే పెద్దభార్య ఇంటికి ఒక్క మగబిడ్డయినా ఉండాలని గొడవ పెట్టింది. ఆమె కోరిక ఎందుకు కాదనాలని ఆపరేషన్‌ చేయించలేదు. మొదటి కూతురు పుట్టిన మూడేళ్ళకు నా రెండవ భార్య మళ్ళీ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్ళి వచ్చేవాళ్ళు. ఎనిమిది నెలలు నిండుతుండగా ఆ ఆస్పత్రిలోని డాక్టర్‌ మా దగ్గర లేడీ డాక్టర్‌ లేదు. అనుకూలమైన మరో మంచి డాక్టర్‌ దగ్గరికి పిలుచుకునిపోయి స్మానింగ్‌ చేయించు అన్నారు. వారి మాట ప్రకారం గంగావతిలోని డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోయాం.

డాక్టర్‌ స్కానింగ్‌ చేసి “కవల పిల్లలు” అన్నారు.

ఒక వైపు సంతోషం, ఒక వైపు దుఃఖం.

ఏమి చేయాల్రా దేవుడా అని అనుకుంటుండగా డాక్టర్‌ “ముందు మీరు అడ్మిట్‌ అవ్వండి. రోజులు నిండే వరకు నిర్లక్ష్యం చేస్తే తల్లి ప్రాణాలకు ప్రమాదం. తొందరగా ఆపరేషన్‌ చేద్దాం. దేవుడు అంతా మంచే చేస్తాడు” అని చెప్పారు.

రోజులు నిండటానికి ముందే బిడ్డ బయటికి వస్తే ఎలా అనే చింత పెద్ద భార్యకి. డాక్టర్‌ ఏమీ కాదని, ధైర్యంగా ఉండమనీ చెప్పిన తరువాత ఆపరేషన్‌ చేయడానికి అంగీకరించాం. డాక్టర్‌ ఆపరేషన్‌ చేసి బిడ్డలను బయటికి తీశారు. ఇద్దరూ మగపిల్లలు. నా భార్యల సంబరానికి హద్దే లేకుండా పోయింది. అయితే ఎంత బరువు ఉండాలో పిల్లలు అంత బరువు లేరు. చిన్నబిడ్డ అయితే ఒక కేజి నూటాయాబై గ్రాములు ఉన్నాడేమో, ఇలాంటి పిల్లలు బతకడం కష్టమని మనసుకు అనిపించింది. ఈరనాగమ్మ మీద భారం వేసి మౌనంగా కూర్చున్నాను. డాక్టర్‌ పిలిచి “పిల్లలు ఇంకా కోలుకోవాలి. పిల్లల డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోండి' అని చెప్పారు. నా దగ్గరేమో డబ్బులు లేవు. వడ్డీకి అప్పు తీసుకుని రావాలన్నా వెంటనే డబ్బు ఎవరు ఇస్తారు? నా పెద్దభార్య తన దగ్గర ఉన్న బంగారమంతా ఇచ్చేసింది. దాన్ని అమ్మాను. కొంచెం డబ్బు దొరికింది. మిత్రుడు హక్కిపిక్కి శికారి రాము తాను ఇతరుల దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి పెట్టుకున్న పదివేల రూపాయలు నాకు ఇచ్చేశాడు. ఇలా ఎవరెవరి నుంచో డబ్బు సమకూర్చుకుని పిల్లలకు, భార్యకు, ఆస్పత్రి ఖర్చులకు వెచ్చించాను. పిల్లలు కాస్త దూదితో వేస్తున్న పాలకు నోరు చప్పరించసాగారు. డాక్టర్లు ఇంకా ఆస్పత్రిలోనే ఉండాలన్నారు. అయితే నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఇంకా ఆస్పత్రిలోనే ఉంటే ఖర్చులకు డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడి మీద భారం వేసి భార్యాపిల్లల్ని ఇంటికి తీసుకుని వచ్చాం.

పిల్లలకు పాలు తాగడానికి రావడం లేదు. అప్పుడే పుట్టిన కుక్క పిల్లల్లా ఉన్నారు. ఇంటివాళ్ళంతా రాత్రీపగలూ ఒకరి తరువాత ఒకరు కాపలా కాసి పిల్లలను చూసుకున్నాం. అయినా చిన్న కొడుకు బతుకుతాడన్న నమ్మకం లేకపోయింది. అయితే చివరికి ఆ బిడ్డలు చనుపాలు తాగగలిగారు. కొంచెం ధైర్యం వచ్చింది.

ఇలా మూడునాలుగు నెలలు గడిచేలోగా పెద్దకొడుకును మరొక సమస్య ఇబ్బంది పెట్టసాగింది. బిడ్డ ఏడిస్తే చాలు గజ్జెల్లో బెలూన్‌లా ఉబ్బినట్టు కనిపించేది. అలా ఉబ్బుతుండగా బిడ్డ స్పృహ తప్పిపోవటంతో ఏడ్పు ఆగిపోయేది. బిడ్డ చనిపోయినట్టులేదు. బతికినట్టు లేదు. కొడుకు పరిస్థితి చూడటానికి నాకు చేతనయ్యేది కాదు. డాక్టర్‌ దగ్గరికి పిల్చుకునిపోతే బళ్ళారిలోని పెద్దాసుపత్రికి పిల్చుకునిపోండని సలహా ఇచ్చారు. అది మరింత కష్టమైన పననీ డాక్టర్‌కు చెబితే హొసపేటలోని పిల్లల డాక్టర్‌ దగ్గరికైనా వెళ్ళండని అన్నారు. డబ్బులు సమకూర్చుకుని హొసపేటలోని పిల్లల డాక్టర్‌ దగ్గరికి పిల్చుకుని వెళ్ళాం. డాక్టర్‌ చూశాడు. ఏమీ అడగలేదు. వెంటనే ఆపరేషన్‌ చేసి కాలిబుడగను తీసేశారు. అటు తరువాత మూడురోజులు తమ ఆస్పత్రిలో పెట్టుకుని డబ్బులు ఇప్పించుకుని పంపేశాడు.

ఇప్పుడిప్పుడు పిల్లలు సరైన తూకానికి వస్తున్నారు. పిల్లలకు పేర్లు పెట్టాలని భార్యలు చెప్పారు. సరే అన్నాను. మా వీధిలో ఆటో బాడుగకు నడిపే కుర్రవాడు ఉన్నాడు. ఒక శుక్రవారం అతడి ఆటోలో పిల్లలిద్దర్ని తీసుకుని దేవులాపుర మారెమ్మ గుడికి పోయాను. మారెమ్మ ఒడిలో పిల్లలిద్దరిని వేసి, 'తల్లీ, నా బిడ్డల్ని నువ్వే కాపాడాలమ్మా, నీ పేర్లే పిల్లలకు పెడ్తాను” అని చెప్పి "పెద్ద మారెప్పు, 'సణ్ణ మారెప్ప' అని పేర్లు పిలిచాను.

నా పెద్దభార్య యముడిని గెలిచిన పిల్లలు అనేది.

అయితే ఈ మధ్యన నా పెద్దకొడుకు చనిపోయాడు.

చిన్నవాడు బాగున్నాడు !

కాలు విరగటం :

సిరుగుప్ప తాలుకా తెక్కలకోటలో మా వాళ్ళవి సుమారు ముప్పయి, నలభై ఇళ్ళున్నాయి. వీటిలో కేవలం 23 కుటుంబాలకు మాత్రమే 'ఆశ్రయ ఇండ్లు' దొరికాయి. మిగిలినవారికి ఇండ్లే ఇవ్వలేదు. దాని విషయమై నేను తెక్కలకోట వెళ్ళాను. ఆ రోజు నా వెంబడి నా భార్య తమ్ముడు హులుగప్పన్నను పిల్చుకుని పోయాను. నా సైకిల్‌ మోటర్‌ మీద ఇద్దరం వెళ్ళాం. మునిసిపాలిటి వాళ్ళను కలిసి, మాట్లాడి, మామ ఇంటికి వెళ్ళి భోజనం చేసి, తిరిగి కంప్లికి తిరిగి రావాలి. తెక్కలకోట దాటి వస్తుంటే చెరువుగట్టు మీద నా సైకిల్‌ మోటర్‌ ముందు టైరు పంక్చర్‌ ఆయ్యింది. పంక్చర్‌ వేయించుకోవడానికి ముందు ట్యూబ్‌ నెక్‌ను లోపలికి తోస్తూ మునివేళ్ళ మీద కూర్చున్నాను. నా అల్లుడు ఉచ్చపోయడానికి పక్కకు వెళ్ళాడు. అది ఏ మాయలో వచ్చాడో ఏం కథో ఒక కుర్రవాడు చాలా వేగంతో సైకిల్‌ మోటర్‌ నడుపుకుంటూ వచ్చాడు. ఇదేదో సౌండు వస్తుందని అనుకునేంతలో సైకిల్‌మోటర్‌ను నా కాలికి తగిలిస్తూ బారెడు దూరం ముందుకుపోయి సైకిల్‌ మోటర్‌ను తన ఒంటిమీద వేసుకుని పడి పోయాడు.

అప్పట్లో నాకు ఎలాంటి నొప్పి కనిపించలేదు. ఆ కుర్రవాడు బతికాడా అని చూడటానికి నా అల్లుడు వెళ్ళాడు. వాడు వెళ్ళి బండి పైకెత్తి స్టాండు వేశాడు. కుర్రవాడు స్పృహ తప్పివున్నాడు. నా బండి బ్యాగులోంచి వాటర్‌ బాటిల్‌ తీసి కుర్రవాడి ముఖం మీద నీళ్ళు చిలకరించాను. కుర్రవాడు హడావుడిగా లేచి, “నేను యాక్సిడెంట్‌ చేయలేదు... నేను యాక్సిడెంట్‌ చేయలేదు” అని అరవసాగాడు.

ఇటు నా కాలిలో నెమ్మదిగా వాపు కనిపించింది. నాకు కళ్ళు మసకబారుతున్నట్టు అనిపించింది. అలాగే బండి స్టార్ట్‌చేసి పంక్చర్‌ షావుకు వచ్చాం. కుర్రవాడిని పిల్చుకుని నా అల్లుడు వచ్చాడు. పంక్చర్‌ షాపు చేరుకునేంతలో నాకు నడవటానికి సాధ్యం కానంత నొప్పి కనిపించసాగింది. నేను వద్దన్నా కుర్రవాడి నుంచి జనం అయిదువేలు ఇప్పించారు.

ఎలాగో కంప్లి చేరాను. కంప్లి చేరగానే నేరుగా ఎముకల డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాను.

దాక్టర్‌ ఎక్స్‌రే తీసి “కాలు విరిగింది కట్టు కట్టాలి” అన్నారు.

నా దగ్గరున్న డబ్బులో మూడున్నర వేలు డాక్టర్‌కు ఇచ్చాను.

కాలుకు కట్టు వేశారు. కట్టు వేయించుకుని ఇంటికి వచ్చాను. ఇద్దరు భార్యలూ కంగారు పడ్డారు. మా వీధి వాళ్ళంతా వచ్చి చూసి పోయారు. కొందరు ఈ విధంగా కట్టువేస్తే కాలు సరిగ్గా అతుక్కోదు, పుత్తూరు డాక్టర్‌ దగ్గర కట్టు వేయిస్తే మంచిదని చెప్పారు. ఆరోజు ఉదయమే గంగావతిలోని పుత్తూరు డాక్టర్‌ దగ్గరికి వెళ్ళాం. ఆ మహానుభావుడు కంప్లి డాక్టర్‌ వేసిన కట్టును తీసి కొత్త కట్టు వేశాడు. నాకు భరించరానంత హింస. అతను ఎనిమిది వేలు లాక్కున్నాడు. ఏదో విధంగా డబ్బు సమకూర్చి ఇచ్చాను.

ఇది జరిగిన రెండవ రోజున శికారి రాము, కుమార్‌సార్‌లు నన్ను పలకరించడానికి వచ్చారు. శికారి రాము తమ కళాతండకు సభ్యులకు పంచడానికి దాచిపెట్టిన పదివేల రూపాయలు నాకు ఇచ్చాడు. కుమార్‌ సార్‌ అయిదువేలు ఇచ్చారు. ఏదో విధంగా మూడు నెలలు వనవాసం అనుభవించాను. అయినా కాలు కుదురుకోలేదు. ఒక రోజు కుమార్‌సార్‌ తమ డాక్టర్‌ అల్లుడి దగ్గరికి పిల్చుకునిపోయారు. ఆయన ఎక్స్‌రే తీయించి నాకు వేరే మందులు, మాత్రలు ఇచ్చారు. అవి తీసుకున్న తరువాత కొంత కోలుకున్నాను. కుమార్‌సార్‌కు చాలా రోజుల తరువాత డబ్బు తిరిగి ఇచ్చాను. రామణ్ణకు ఇంకా పూర్తిగా డబ్బు తిరిగి ఇవ్వడానికి సాధ్యం కాలేదు. ఇంకా కొంత ఇవ్వాలి. వారి సహాయం ఎలా మరవగలను?

శునక పురాణం :

ధర్మరాజుకు, శునకానికీ బంధుత్వం ఏ విధమైందో; అదే విధంగా సంచారులకు, కుక్కలకూ విడదీయలేని బంధుత్వం ఉంది. మాకు పశువులు లేకున్నా జీవితం సాగిపోతుంది. అయితే కుక్కలు లేకుండా మా జీవితాలు సాగవు. భిక్షం పుట్టని కాలంలో మాకు పొట్టలు నింపేవి కుక్కలే ! ఎక్కడా భిక్ష దొరకనపుడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకు వెళతాం. చిన్నచిన్న జంతువులను తాము తిని కడుపు నింపుకుంటే నక్క కుందేలు, ఉడుము మొదలైన జంతువుల జాడలను పసిగట్టి వాటిని సులభంగా వేటాడటానికి మాకు సహాయం చేసేవి ఈ కుక్కలే?

అందువల్ల మాకూ కుక్కలకూ విడదీయలేని సంబంధం ఉంది.

ఒకసారి ప్రేమతో ఒక ఆడకుక్కను పెంచాను. చాలా చక్కగా, చురుగ్గా వేటాడేది. దానికి ఏదో రోగం తగిలింది. ఆ రోగంతో చాలా బాధపడేది. దాని కష్టాన్ని చూడలేక పోయేవాడిని. బాధతో విలవిల్లాడేది. ఆ కుక్కను ఎక్కడ చూపించాలో తెలియదు. మాకు తెలిసిన మందులు, మూలికలు మొదలైనవి వాడి సేవలు చేశాను. అయితే కుక్కకు నయం కాలేదు. ఎవరో ఒకరు పశువుల డాక్టర్‌కు చూపించమని సలహా ఇచ్చారు. కుక్కను డాక్టర్‌ దగ్గరికి తీసుకునిపోయాను. ఆయన దాన్ని చూసి దానికి ఏదో రోగం వచ్చిందని సూది మందు వేయాలని అన్నారు. సరే వేయండన్నాను. ఆయన సూది వేసి మందులు ఇచ్చారు. సూదివేసి మందులు ఇచ్చినందుకు మూడువేలు తీసుకున్నాడు. ఏం చేయగలను? అలాంటి వేటకుక్కను పోగొట్టుకోవడానికి మనసొప్పలేదు. డాక్టర్‌ అడిగినంత డబ్బు ఇచ్చాను.

అయినా కుక్క ఎక్కువ రోజులు బతక లేదు

కుక్కచనిపోయిన రోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు.

నా జీవితంలో ఎన్నో కుక్కలను పెంచాను.

అయితే అలాంటి కుక్క మళ్ళీ దొరక లేదు!

బాలింత రోగంతో కుక్క చనిపోవటం :

ఆ కుక్కచనిపోయిన తరువాత మరొక ఆడకుక్కను తెచ్చాను. వేటకు ఆ కుక్కనే వెంటబెట్టుకుని పోయేవాళ్ళం. మేము వేటకు వెళితే ఎనిమిది, పదిమంది కలిసి వెళ్ళేవాళ్ళం. వేటలో దొరికిన జంతు మాంసాన్ని తలాకింత అని భాగాలు వేసుకునేవాళ్ళం. అప్పుడు వలకు ఒక భాగం, కుక్కకూ ఒక భాగం అని పక్కకు తీసిపెడతాం. అటు తరువాత ఆ కుక్క ఒక సంవత్సరానికి ఎదకు వచ్చింది. ఊర కుక్కల పీడ ఎక్కువైంది. ఇది కూడు తినితిని బాగా బలిసింది. మగకుక్కలను వెదుక్కుంటూ తిరిగేది. ఇలా మగవాటి వెనుక తిరిగి గర్భం దాల్చింది. నాలుగు పిల్లలను ఈనింది.

అయితే అది పిల్లలను ఈనిన కొద్ది రోజులకే దాని వెనుక కాళ్ళల్లో వాపు వచ్చింది. ఇతరులకు చూపిస్తే అది బాలింత రోగం అన్నారు. ఎంత చాకిరి చేసినా కుక్క మాకు దక్కలేదు. తల్లి తల్లితోపాటు దాని పిల్లలు చనిపోయాయి.

మరొక కుక్కను కూడా సాకాను. అది కూడా ఆడకుక్కనే. అయితే ఆ కుక్క ఒక్క పిల్లను ఈనలేదు. దాని వెనుక భాగమంతా ఉబ్బి పోయివుంది. డాక్టర్‌కు చూపిస్తే దానికి కాన్సర్‌

అన్నారు. కాన్సర్‌కు ఏం చేయాలని అడిగితే సూదిమందు వేయాలన్నారు. అయితే అది ఎక్కువ రోజులు బతికే లక్షణాలు లేవని అన్నాడు. అది ఇప్పటిదాకా మా కోసం కష్టపడింది. దాన్ని అలాగే వదిలి వేయడానికి మనసొప్పలేదు. చనిపోయే వరకూ మాతోనే ఉండనీ అని దాని బాగోగులు చూసుకుంటూ వచ్చాం.

బెంగళూరు నుంచి జాతికుక్కను తీసుకుని రావటం :

ఒకసారి సంచారుల సమావేశానికి బెంగళూరుకు శికారి రాముతోపాటు వెళ్ళాను. అదేదో స్థలంలో మీటింగ్‌ పెట్టారు. ఆ స్థలం ఎక్కడో గుర్తులేదు. భాస్కరదాసు, బాల గురుమూర్తి, మేత్రి అందరూ మీటింగ్‌లో ఉన్నారు. వాళ్ళంతా ఏమేమో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కటీ అర్ధం కాలేదు. మధ్యాహ్నమైనా మీటింగ్‌ ముగియలేదు. నాకు విసుగు వస్తూ వుంది. ఏం చేయాల్రా నాయనా అని మీటింగ్‌ బయటికి వచ్చాను. అటు ఇటు తిరుగసాగాను. అయినా పొద్దుపోవడం లేదు. అలా తిరుగుతూ ఒక చోట నిలబడ్డాను.

అక్కడే ఒక పాత డొక్కు జీపు తన ఒక చక్రంలో గాలి పోగొట్టుకుని పడుకునివుంది. జీపు ప్రాణం పోగొట్టుకుందని అనుకుంటూ నిలబడ్డాను. అయితే ఆ ప్రాణం పోగొట్టుకున్న జీపులోంచి కుంయ్‌ కుంయ్‌మంటూ శబ్దం రాసాగింది. ఏమిటా అని చూస్తే నాలుగైదు కుక్కపిల్లలు. ఇంకా కళ్ళు సైతం తెరవలేదు. వాటి తల్లి ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ కుక్కలను చూస్తూ చాలాసేపు నిలబడ్డాను.

అంతలో ఎవరో ఒక సూటుబూటు వేసుకున్న వ్యక్తి వచ్చాడు. “ఏం చేస్తున్నావు?” అని అడిగాడు.

“కుక్కపిల్లలను చూస్తున్నాను” అన్నాను.

“కుక్కలంటే నీకు ఇష్టమా?” అని అన్నాడు.

నేను చిన్నపిల్లవాడిలా “అవునయ్యా” అన్నాను.

అప్పుడు ఆ మనిషి “నీకు ఎన్ని పిల్లలు కావాలో అన్ని తీసుకునిపో" అన్నాడు.

సిటి జనం కుక్కలను అమ్ముతారని తెలుసు. ఆ కారణంగా, “అయ్యా, నా దగ్గర డబ్బులు లేవు” అన్నాను.

ఆ మనిషి నవ్వి “డబ్బులు వద్దు, నీకు ఇష్టమైన కుక్కపిల్లల్ని తీసుకునివెళ్ళు” అన్నాడు.

నాకు కావాల్సింది అంతే. అక్కడే దగ్గర్లో ఉన్న మెడికల్‌ షాపుకు వెళ్ళి ఒక ఖాళీ అట్టపెట్టె తెచ్చాను. అక్కడక్కడ దానికి చిల్లులు వేసి ఒక ఆడకుక్కపిల్లను, ఒక మగకుక్క పిల్లను పెట్టెలో జాగ్రత్త పరిచాను. సాయంకాలం రాము వెంబడి నేరుగా ఊరికి వచ్చాను. “ఎందుకన్నా మన ఊళ్ళో కుక్క దొరకదా? ఇక్కడి నుంచి కుక్క పిల్లల్ని తీసుకుని పోతున్నావు?” అని రాము తమాషా చేశాడు. అవి పాలు తాగలేదు. చివరికి దూదితో పాలు పట్టాను. ఇప్పుడు బాగా ఎత్తుగా పెరిగి చురుగ్గా తయారయ్యాయి. వేటకు పోయినప్పుడంతా పిల్చుకునిపోయి వేటాడటం అలవాటు చేశాను.

ఆ రెండు కుక్కలకు ముసలప్ప, ముసలమ్మ అని పేరు పెట్టాను !

(ఇంకా వుంది)

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు

“మా ఇంటికి ఎదురుగా దక్షిణోత్తరంగా సాగిపోయే రాచబాటను ది గ్రాండ్‌ నార్తరన్‌ ట్రంక్‌ రోడ్‌ అనేవారు. మా ఇంటికి కుడివైపున (ఉత్తరం) ఉండే దివానుగార్ల బంగళాలలో మొదటిదానిలో రఘుపతి వేంకటరత్నం నాయుడు గారుండేవారు. ఆయన వీరేశలింగంగారితో పాటు, సంఘ సంస్కరణలోను, హరిజనోద్ధరణ కోసమూ పాటుపడిన ఆధునికాంధ్ర నిర్మాతలలో ఒకరు. బ్రహ్మసమాజానికీ, మహరాజా వారి కుమారులకూ, కుమార్తెలకూ గురువుగాను, కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాలుగాను, ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో కులపతిగానూ పనిచేసి, కృతకృత్యులై. నిరంతర దైవధ్యాన నిరతులై దీనజనోద్ధరణకు దీక్షాదక్షులై బ్రహ్మర్షి అనిపించుకున్న మహనీయుడు!

హేమచంద్ర సర్కారు వంటి రాష్ట్రేతర అతిథులు మహారాజావారి ఆహ్వానంపై పిఠాపురం వచ్చినపుడు, నాయుడుగారితో బస చేసి, మా ఇంటి ముందు నుంచి పోయే గుర్రపు సార్టులో కనపడేవారు.

- కీ.శే. బాలాంత్రపు రజనీకాంతారావు

5, ఆగస్టు 07, ఆదివారం 'ఆంధ్రప్రభ' - 'రజనీ భావతరంగాలు' నుండి