అబలా సచ్చరిత్ర రత్నమాల/పద్మావతి

వికీసోర్స్ నుండి

పద్మావతి

     సా భార్యా యా శుచిర్దక్షా సా భార్యా యా పతివ్రతా
     సా భార్యా యా పతిప్రీతా సా భార్యా సత్యవాదినీ.*

పద్మావతి జగన్నాధ నివాసస్థుడగు అగ్నిహోత్రుడను విప్రుని కూతురు. జయదేవుడను మహాకవి భార్య. ఈమె పాతివ్రత్యమునందు మిగుల ప్రసిద్ధిగాంచెను. పద్మావతి మిగుల సౌందర్యవతియు, గుణవతియు నైనందున నామె జనకుడామెకు దగినవరుని విచారించి వివాహముచేయ నిశ్చయించెను. అంత గొన్ని దినంబులకు జగన్నాధమునకు బిల్వాయను గ్రామములో నుండిన నారాయణభట్టను బ్రాహ్మణుని కుమారుడగు జయదేవుడు సకల సద్గుణపరిపూర్ణుడనియు దగిన వరుడనియు దెలిసి నందున బీదవాడని శంకింపక యా యగ్నిహోత్రి పద్మావతి నాతనికిచ్చి వివాహము చేసెను. వివాహానంతర మా దంపతులు మిగుల నైక్యముగలిగి కాపురము చేయుచుండిరి. పద్మావతి తమకు గలదానిలోనే కాపురము మిగుల చక్కగా గడపుచుండెను. ఆమె పూర్వకాలపు పతివ్రతలకథలు చదివియు వినియు దాను వారివలెనే ప్రవర్తించుటకు నెల్లప్పుడు యత్నించుచుండెను. కాన పరమభక్తుడగు జయదేవునకు సంసార మసారమని తోచక మిగుల సారముగా గానుపించు


  • పవిత్రురాలును చాతుర్యవతియునై పతివ్రతయయి భర్త్రనుగ్రహము వడసి సత్యము పలుకునట్టిదియే సద్భార్య యనదగు. చుండెను. జయదేవుడు పీయూషవర్షుడగు కవియని ప్రసిద్ధి గాంచెను. ఆయన సాహిత్యసంగీత విద్యలయం దసమాన పాండిత్యము గలవాడై ప్రసన్న రాఘవ మనునాటకమును గీత గోవిందమను సంగీతగ్రంథమును రచియించెను.

ఇట్లా దంపతులు సుఖముగా నుండి గొన్నిదినంబుల కొకయూరి సాహుకారు జయదేవుని మిగుల వేడుకొని సమీపమునందున్న తనగ్రామమునకు గొనిపోయెను. జయదేవుడచట గొన్నిదినంబులుండి యాగ్రామమునం దంతటను ననేకులను భక్తులనుగా జేసెను. తదనంతరమాయన స్వగ్రామమునకు బ్రయాణమగుట గని యాషాహుకా రాయనకు దెలుపక గుప్తముగా నాబండియడుగున కొంతద్రవ్యము నునిచియింటి కేగిన వెనుక పద్మావతిగారి కిమ్మని తనబంటగు బండితోలు వానితో జెప్పెను.

ఇట్లు బయలుదేరి జయదేవులు కొంతదూర మరిగిన పిదప నతనిబండిలో ధనమున్నసంగతి యరణ్యవాసులగు దొంగలకు దెలిసి వా రాబండిని నాపి సకలధనమును దోచుకొని జయదేవుని వదలి దమకు నతడు రాజభటులచే నపాయము చేయించునని తలచి, కాలు సేతులు కట్టి జయదేవులను నొక పాడునూతిలో బారవేసిరి. అందుపై గొంతసేపటికి క్రౌంచ దేశాధీశ్వరు డచటికి వేటాడవచ్చి జయదేవునిగని తన నగరమునకు గొనిపోయెను. అచట రాజవైద్యులచే ననేకౌషధోపాయములు చేయించగా జయదేవుల కాలు సేతుల గాయములు మానెను. జయదేవుల యసారపాండిత్యమును, నిర్మల దైవభక్తియు, నప్రతిమ సాధువృత్తిగని క్రౌంచరా జాతనిని గురువుగా భావించి సేవింపుచుండెను.

ఇచట పద్మావతి భర్తకొరకు ననేకస్థలముల వెదకించియు వెదకియు జాడగానక మిగుల దు:ఖముతో బుట్టినింటనే యుండి భర్తజాడ లరయుచుండెను. ఇట్లు కొన్నిదినములు గడిచినవెనుక క్రౌంచాధీశ్వరుడు జయదేవుల వార్త దెలిపి పద్మావతిని దోడుకొని వచ్చుటకయి తనపరివారమును బంపెను. వారు చెప్పినవార్త విని పద్మావతి మిగుల సంతోషముతో భర్తకడకేగెను.

పద్మావతి గురుభార్య యగుటవలనను మిగుల పతివ్రతయని ప్రసిద్ధిగాంచుటవలనను రాజపత్ని మిగులశ్రద్ధతో నామె వలన ననేకనీతులు వినుచుండెను. ఇట్లొకనాడు పద్మావతి పాతివ్రత్యమునుగూర్చి యుపన్యసింపుచుండగా నచటికి నొక సేవకుడు వచ్చి రాజపత్ని సమీపబంధువుడెవడో యొకడు లోకాంతరగతు డాయెననియు, ఆయన వియోగము సహింప లేక యాతని భార్య సహగమనము చేయబోవు చున్నదనియు దెలిపెను. ఆసంగతి విని యచటి స్త్రీలందరు మిగుల నాశ్చర్యపడజొచ్చిరి. కాని పద్మావతికి నాసంగతియొక విశేషముగా దోచకపోవుటవలన నామెముఖమునం దాశ్చర్యభావ మించుకయు గానుపించదయ్యె. అందుకు రాజపత్ని పద్మావతిని "అమ్మా! ఆ మహాపతివ్రత సకల సుఖములను విడిచి భర్తతో సహగమనము చేయునన్నవార్తవిని మీ కాశ్చర్యము కలుగ లేదా? దయచేసి మీమనోగతము నెరిగింపు"డని వేడుకొనెను. అందుకు పద్మావతి రాజపత్నితో నిట్లనియె "భర్తప్రాణములు పోయినవెంటనే ప్రేమగల పత్నియొక్క ప్రాణములు బొందినుండి వెడలును. ఇదియె నిజమైన ప్రేమయొక్క లక్షణము. అట్లు వెంటనే బొందిని విడువక తరువాత ప్రాణత్యాగము చేయుట యాత్మఘాతయెగాని పత్నీధర్మముగాదు."

పద్మావతియొక్క శుద్ధాంత:కరణమునుండి వెడలిన యీవాక్యములు ప్రభుపత్ని చెవులకు ములుకులవలె దోచగా నామె పద్మావతి తాను నిజమయిన పతివ్రతను అని వెల్లడించుటకై యీడంబములు పలికెనని యెంచి పద్మావతి నామె పరీక్షించి భంగపరచ వలయునని నిశ్చయించెను.

అందుపై గొన్నిరోజులయిన పిదప రాజుతో జయదేవు లరణ్యమున కరుగుట సంభవించెను. అప్పుడు రాజపత్ని తన మంత్రినిం బిలిచి తన కుట్ర యభిప్రాయ మాతనికి దెలిపి, తదనుసారముగా కార్యము నిర్వహింప నాతనిని నియమించెను. అట్లు కుతంత్రము పన్ని యా రాజకాంత యా రోజునగూడ దన నియమప్రకారము పద్మావతి గృహమునకరిగి యామెతో బ్రసంగించుచుండెను! అంతలో దూతిక యొకత యతి దీనవదనయై వచ్చి, కారడవిలో నాకస్మికముగా జయదేవుడు పులి నోటబడి ప్రాణములను విడిచెనని గద్గదస్వరముతో జెప్పెను! ఆ పిడుగువంటివార్త చెవిసోకినతోడనే పద్మావతి నిశ్చేష్టితయై కొంతవడి దేహము తెలియకుండి, మరల దేహస్మారకము గలిగి దు:ఖాతిరేకము పట్టజాలక పతినామము నుచ్చరించి మరణ తుల్యమగు మూర్ఛ నొందెను. కాని యచ్చటి వారందరును నామె మృతిజెందెనని యనుకొనిరి.

ఆమె పాతివ్రత్యమును బరీక్షింపవలెనని యీ తంత్రమును బన్నిన రాణిగారు పద్మావతి మరణమును గని యేమి చేయుటకు దోచక దు:ఖింపసాగెను. అదివర కామెకీకార్యము నందు దోడుపడినవా రిపు డామెనే నిందింపసాగిరి. ఇట్లు రాణిగారు సపరివారముగా శోకింపుచుండు నంతలో రాజుగారును జయదేవుడును పురమునకు వచ్చిరి. వా రిల్లుజొచ్చి పద్మావతి గతించుట విని యామెకు సమీపించిరి. అంత జయదేవులు భార్యను గని తనదు:ఖము నాపజాలక కొంతవరకు దు:ఖించిన పిదప ధైర్యము నవలంబించి, తన సంగీతము పద్మావతికి మిగుల ప్రియమగుట యెరిగినవాడు గావున నామె ముందు రసవంతమయిన సంగీతము పాడ నిశ్చయించి తన వీణె దెప్పించి తాను రచించిన గీతగోవిందమును మిగుల మనోహరముగ బాడ జొచ్చెను. ఇట్లు సంగీతమున కుపక్రమించిన కొంతసేపటికి బద్మావతి మొగముపై గొంచెము తెలివి గానుపించెను. ఇరువదియైదవ అష్టపది ముగియగానే పద్మావతి తెలివొంది కనులు విప్పి తనముందు గూర్చున్న జయదేవుని గాంచెను. అంతనామె మిగుల నానందముతో భర్తకు నమస్కరించి యానందబాష్పములతో నతని పదములను గడిగెను.

ఈ యనర్థమున కంతకు దన పత్నియే కారకురాలని క్రౌంచరాజు మిగుల కోపించి యామెను విసర్జింపదలచెను. కాని దయామయురాలగు పద్మావతి రాజును సమాధాన పరచి భార్యాభర్త లెడబాయకుండ జేసెను. తదనంతరము పద్మావతీ జయదేవులు కాశీక్షేత్రమున కరిగి, యచటి పురుషులకు భక్తియు స్త్రీలకు పాతివ్రత్యమును ఉపదేశింపుచు తమ ప్రవర్తనవలన వారికి దారి జూపుచుండిరి. కొంతకాల మచట నుండి స్వగ్రామమునకు బోయి యచ్చటనే కొన్నిరోజులకు వారు కాలధర్మము నొందిరి.

పద్మావతీదేవి రాజుభార్య కుపదేశించిన యుపన్యాస మొకటి యాంధ్రమహాభక్త విజయమునందు గానుపించుచున్నది; గాని మహారాష్ట్ర భక్తవిజయమునందు లేదు. ఆంధ్రభక్తవిజయ కారుడీ యుపన్యాసము నెచ్చటినుండి సంగ్రహించెనో తెలియదు. అయినను నా యుపన్యాసము స్త్రీలకు బాతివ్రత్యంబు గరపుటకు నత్యంతోపయుక్తముగా నుండుట వలన దాని నిట బొందుపరచుచున్నాను.

"అమ్మా! లోకములో సతులకు ముఖ్యముగా గావలసిన ధర్మ మొక్కటిగలదు. పతికంటె వేరు దైవముగాని, పతికంటె వేరు గతిగాని, పతికంటె వేరు చుట్టముగాని, పతికంటె వేరు సంపదగాని, పతిసేవకంటె నుత్కృష్టమగు పూజగాని, పతి యనుమతి ననుసరించుటకంటె పరమసాధనముగాని లేదనియు, పాతివ్రత్యమున కెప్పుడును భంగమురాకుండ కాపాడు కొనుచుండుటే బ్రహ్మజ్ఞానమనియు, పతినామము ననవరతము సంస్మరించుటే బ్రహ్మధ్యానమనియు, పతి నెడబాయకుండుటే బ్రహ్మానందమనియు, పతి మృతినొందిన తోడనే ప్రాణములు విడుచుటె మోక్షమనియు నిశ్చయించుకొని వర్తించుచున్న సతికి సర్వశుభములును సులభముగా సిద్ధించును. పాతివ్రత్యమునకన్న నుత్తమమయిన వ్రతము మరేదియును లేదు. లోకమునంగల జప తపో నియమాదు లేవియు బాతివ్రత్యమునకు సమానములు కావు. పాతివ్రత్యమును బాడుచేసికొనక మిగుల జాగ్రత్తతో గాపాడుకొన్న గుణవతి భాగీరథీ యనబడును. పాతివ్రత్యముగల వనితకు పరమపద మరచేతిలోనిదని పెద్దలు పలుకుదురు. పాతివ్రత్యమును రక్షించుకొన్న వనితలకు నే లోపములును రావు. పాతివ్రత్యమునకు భంగము కలిగించు కొన్నచో బహువిధములయిన బాధ లనుభవింపవలసివచ్చును. ప్రాణమునకంటె పదిమడుగు లెక్కుడుగా బాతివ్రత్యమునందు బ్రీతికలిగి కాపాడుకోవలసినది. భూషణముల కెల్ల భూషణము పాతివ్రత్యమే సుమీ! పాతివ్రత్యమునకంటె బడతులకు బాలింప వలసిన పదార్థ మొక్కటిలేదు. పాతివ్రత్యమును బాడు చేసికొనిన పాపాత్మూరా లొకవేళ సత్కర్మములను జేసినను అవి దుష్కర్మములక్రింద మారి తుదకు దు:ఖమును కలిగించును గాని లేశమయినను సుఖమును గలిగింపవు. పతివ్రతలయొక్క ప్రభావముచేతనే భూతలమంతయు నంతరమున నిలిచియున్నదనియు, పతివ్రతల విషయమున బ్రహ్మాది దేవతలు సహితము భయపడుచుందురనియు పెద్దలు పలుకుదురు. పూర్వము మృతి నొందిన తనపతిని సావిత్రిదేవి మరల బ్రతికించుకొన్నది కాదా? తన చిత్తశుద్ధిని దెలుపుటకై సీతాదేవి యగ్నిలో దుమికినది గాదా? తనకు హాని చేయవచ్చిన కిరాతుని దమయంతీదేవి భస్మముచేసినది గాదా? తన మాంగల్యము నితరులకు దెలియ నీయక చంద్రమతిదేవి రక్షించుకొన్నది గాదా? రేణుకాదేవి యిసుకతో గుండనుజేసి జలమును దెచ్చినది గాదా? బృంద తన భర్తవలె ననువర్తింపవచ్చిన విష్ణుమూర్తియొక్క మాయను దెలిసికొన్నది గాదా? అనసూయాదేవి నారదులిచ్చిన యినుప సెనగలను బొరుగులగునట్టు వేచినది కాదా? ఆమెయే బ్రహ్మ విష్ణుమ హేశ్వరులను తనకు బిడ్డలనుగా జేసికొన్నది కాదా? అరుంధతీదేవి యిసుకను నిమిషములో వండినది కాదా? లక్ష్మీదేవి పరమశివుని బట్టుకొన్న బ్రహ్మహత్యను వదలగొట్టినది కాదా? పార్వతీదేవి పరమేశ్వరుని యర్థాంగమును సంపాదించుకొన్నది గాదా? ఇటువంటి మహత్వమంతయు వారికి బాతివ్రత్యము వలననే గదా కలిగినది. చూడుము; అరుంధతీదేవి తక్కువ జాతిలో బుట్టినదయ్యును తన పాతివ్రత్యముచేత సప్తర్షిమండలమున వసిష్ఠులవారి దండను నిండుకాంతితో వెలయుచు లోకమునకు కన్నులపండువు చేయుచున్నది. ఒక్క పర్యాయము మునిపత్నులమీది మోహముచేత మిక్కిలి యార్తిజెందిన తనభర్తయగు అగ్ని హోత్రునియొక్క యిష్టాపూర్తి చేయునిమిత్తమయి స్వాహాదేవి తన మాహాత్మ్యమువలన ఆర్గురు ఋషి పత్నులరూపము దాల్చియు, పరమ పవిత్రురాలన్న హేతువు చేత నరుంధతీదేవి రూపము మాత్రము ధరించుటకు శంకించినది గాదా? సత్కులప్రసూతయు, సకల సంపన్నయు నయిన అహల్యాదేవి మనోవైకల్యముచేత పాతివ్రత్యమును పాడుచేసు కొన్నందుననే గదా పాషాణమయి పడియుండి చిరకాలము దు:ఖ మనుభవించినది? ఇప్పుడును వివాహసమయములయందు సన్నికల్లు మిషమున నహల్యను కన్యచేత ద్రొక్కించుటయు, నరుంధతీదేవి నగుపరచి భక్తిపూర్వకముగా మ్రొక్కించుటయు వాడుకగానున్నది కాదా? చక్కగా బాతివ్రత్యము నొక్కటిని గాపాడుకొన్నచో బహు విధములయిన యుపవాసాది వ్రతములతో బ్రయోజనము లేదు. పాతివ్రత్యరక్షణ మొక్కటే పడతులకు పరమోత్కృష్ట వ్రతమని ధర్మశాస్త్రములు విధించుచున్నవి. దేవతాచార్యుని భార్యయైన తారాదేవి బుద్దిమాంద్యముచేత చంద్రునితో వ్యభిచరించినందున గదా శాశ్వతమైన నింద ననుభవించుచున్నది? చేడియలతో గూడి జలక్రీడసలుపు చున్న చిత్రరథుని జూచి భ్రమసినందునగదా రేణుకాదేవి తన పాతివ్రత్యమును భంగము చేసికొని యిసుకతో గుండనుచేయలేక తుదకు రట్టుపడి పరశురామునిచేత ఖండింపబడినది? ద్రౌపదీదేవిని కర్ణునియందు గన్నిడినందునగదా తపోధనున కుపయోగపడు ఫలమును వృక్షమున కెక్కింపలేక సిగ్గుపడినది? కాబట్టి యత్నపూర్వకముగా పాతివ్రత్యమును రక్షించుకోవలసినది స్త్రీలకు ముఖ్యకర్తవ్యము. మృతులయినవారిని మరల బ్రతికింపవలెనన్నను, హరిహరబ్రహ్మలను రక్షించవలెనన్నను, భుతముల నెల్ల దలక్రిందులుగా జేయవలెనన్నను పతివ్రతల కొక లక్ష్యముగాదు. పాతివ్రత్యము బ్రహ్మనిష్ఠతో సమానమని పెద్దలు పలుకుదురు. సర్వోత్కృష్టమగు బ్రహ్మనిష్ఠ పురుషులకు జిత్తశుద్ధినిగలిగించి, పూజ్యమగు మోక్షసామ్రాజ్యము ననుగ్రహించునట్టే పాతివ్రత్యము సతులకు పరమపదము నొనగూర్చును. ఏకపత్నీవ్రతులగువారికి నన్యస్త్రీ సహవాసమెట్లు విసర్జనీయమో, ఆ ప్రకారమే పతివ్రతలకు సహితము పరపురుషసాంగత్యము సర్వదా వర్జనీయము. ఏకాంతమున నేకాసనమునందు కొమారునితోనైనను గూర్చుండుట కులభామినికి యుక్తముగాదు. ధనికుడయినను, నిర్ధనుడయినను, రూపవంతుడయినను, రూపహీనుడయినను, వివేకియయినను, అవివేకియయినను, రోగియయినను, నిరోగియయినను, మరి యెట్టివాడయినను చేపట్టిన పెనిమిటి విషయమున లేశమయిన పొరపొచ్చెములులేక మిక్కిలి మచ్చిక గలిగి యనువర్తింపవలసినది భార్యకు ముఖ్యధర్మము. భర్త తన కేమిచ్చినను మిక్కిలి సంతోషపడవలెను గాని చాలదని యెప్పుడును దు:ఖపడ గూడదు. పతి తెచ్చియిచ్చిన వస్తువులను పదిలముగా దాచియుంచి మరల నాత డడిగినప్పుడు నిష్కపటముగా నిచ్చివేయవలయును. బలిభిక్ష మెప్పుడును దప్పక పెట్టుచుండవలెను. దేవ పితృపూజా కాలములయందు దన పతికి ననవరతము శుభములు గలుగునట్టుగా ప్రార్థింపవలెను. పతి యనుమతిలేక దేవతలనుగాని, పితరులనుగాని, యతిథులనుగాని పూజింపరాదు. పూజించినచో నది సద్గతి నొంద నేరదు. ఈ విషయమున పార్వతీదేవి చెప్పిన యితిహాసముచెప్పెదను - పూర్వమొక బ్రాహ్మణున కిద్దరు ముద్దియలు గలరు. వారిలో నొక్కతె తన పెనిమిటి యనుమతి ప్రకార మడకువ గలిగి నడచుకొనుచుండెను. మరియొక్కతె స్వతంత్రతను వహించి తన యిష్టప్రకారము పితృదేవతాతిథిపూజలను జేయుచుండెను. కొంతకాలమునకు పిమ్మట విధివశమున వారు మువ్వురును నొక్కపర్యాయమే మృతినొందిరి. అప్పుడు పతికి హితముగా నడుచుకొన్న సతి పతిపోయిన సుగతికి బోయెను. బతిసమ్మతికి విరోధముగా నడచుకొన్న రెండవపడతిని యముడు పోగూడదని యాటంక పరచినందున వెనుక నేనిలిచి కన్నుల నీరుపెట్టుకొని యేడువ మొదలుపెట్టెను. అది చూచి అతడు దయార్ద్రహృదయుడయి యామెను గనుగొని "పతికి సమ్మతిలేని ధర్మము సతి చేయ గూడదు. చేసినయెడల దుర్గతికి బాత్రమగును. ఇక మీద నయినను నీవు బుద్ధిదెచ్చుగొని పతికి హితములగు వానిని జేసినచో నాతనిగతి నొందగల"వని చెప్పగా నామె మరలిపోయెను. కాబట్టి పతికి సమ్మతముగా ననువర్తింపవలసినదే సతికి పరమధర్మము. అధర్మవర్తనగల వనితలు ఆసురులని, పైశాచులని రాక్షసులని చెప్పబడు మూడు తెగలవారికిని సాధారణముగా వ్యభిచారమునందనవరతమునిష్టము గలిగియుండును. వారిలో నాసురీవర్గమువారు సదా హృదయమునందు క్రౌర్యముంచుకొని యుండుట' ధనధాన్యములను నాశముచేయుట, భోగములయందు కేవలమనురాగము కలిగియుండుట, అసూయపడుట, మొదలగు దుర్గుణములుకలిగి వర్తింతురు. పైశాచికా వర్గమువారు మనసునందు క్రోధమును సాధించుట, పతిసుతులయందు ద్వేషముకలిగి యుండుట, గృహకృత్య వర్తనముల నేర్పు చాలకుండుట, కలహములయందిచ్చగలిగియుండుట మొదలగు దుర్గుణములు కలిగి నడుచుకొందురు. రాక్షసీవర్గమువారు లేశమయిన సహనము లేకుండుట, యెల్లప్పుడు కల్లలాడుట, విశేషముగా నిద్రపోవుట, సిగ్గులేక యుండుట మొదలగు దుర్గుణములు గలిగి నడుచుకొనుచుందురు. వీరందరు నిస్సంశయముగా బతివంశము వారిని నరకమునకు బంపి తామును నరకమునకు బోదురు. అట్టి దుష్ప్రవర్తనగల వనితలయినను తుదను తెలివితెచ్చుకొని పతిభక్తి గలిగి మిక్కిలి యనురక్తితో సత్కృత్యములుచేసి శాంతినివహించి వర్తించుచున్నచో మునుపుచేసిన పాపముల నుండి తొలగిపోయి పురుషునితోగూడ స్వర్గలోకమునకు బోవగలుగుదురు. అట్లు వర్తింపక పోయినను పతుల యవసానకాలమునం దయినను ఇతర చింతలేక యనుమరణము సేవచేసినపక్షమున వారికి పతి సహితముగా సద్గతి సిద్ధించును.


_______