అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/రుద్రమదేవి

వికీసోర్స్ నుండి

రుద్రమదేవి.

ఈసతీరత్న మాంధ్రదేశమునందలి యోరుగంటిరాజ్యమును మిక్కిలి చక్కఁగా నేలిన శూరవనిత. ఈమె కాకతీయగణపతిరాజుభార్య. దేవగిరిరాజు కూఁతురు. రుద్రమదేవి తనభర్త మరణానంతరము క్రీ. శ. 1257 వ సంవత్సరము నుండి 1295 వ సంవత్సరమువఱకును ముప్పదియెనిమిది సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు దాన శాసనములవలనను, చరిత్రకారులు వ్రాసినదానివలనను స్పష్టముగాఁ దెలియుచున్నది. సోమదేవరాజీయమునందును రుద్రమదేవి ముప్పది యెనిమిదిసంవత్సరములు రాజ్యపాలనము చేసిన ట్లీక్రిందిపద్యమునఁ జెప్పఁబడినది.

                 గీ. ఆ యనకు నప్పగించి యయ్యమ్మ యట్లు
                     బుధజనంబులుఁ బ్రజలును బొగడ నవని
                     ముప్పదియు నెన్మిదేఁడులు మోద మొదవ
                     నేలి కైలాసశిఖరి నేఁగుటయును.

కాకతీయగణపతి మరణానంతర మాతనిభార్య యగు రుద్రమదేవి దు:ఖసముద్రమున మునిఁగి యుండెను. అప్పుడు మంత్రియయిన శివదేవయ్యగారి హితవచనముల వలన నామె దు:ఖమును మఱచి రాజ్యమునకు వారసు లెవ్వరును లేకయుండినను కూఁతురగు ఉమ్మక్కకుఁ గలుగుసంతానమే సింహా సనము నెక్క నర్హులని కొంత మనస్సమాధానము చేసికొని రాజుయొక్క ఖడ్గమునుముద్రికను సింహాసనమునం దుంచి శివదేవయ్య సాహాయ్యమున రుద్రమదేవి రాజ్యము చేయసాగెను. ఆమె రాజ్యము బహు యోగ్యముగాఁజేసెనని చెప్పుదురు. అప్పు డామె యోరుగంటి చుట్టును మూడునాలుగు ప్రాకారములు గలకోటను శత్రువుల కభేద్య మగునటులఁ గట్టి దానికిఁ దగినచోటుల సైన్యముల నుంచెను. అందువలన నారాజ్యమును గెలుచుట బహుదుస్తరమని పెర రాజులు వెఱచుచుండిరి. ఇదిగాక రుద్రమదేవి చేయు న్యాయపరిపాలనము వలన జనులామెరాజ్యమే శాశ్వతముగా నుండఁ గోరుచుండిరి.

ఈమె తనరాజధానిలో ననేకములైన చెఱువులు త్రవ్వించియు, సత్రములు కట్టించియు జనోపయోగ్యము లయిన యనేక కార్యములను చేసెను. బీదవిప్రులకు బంగారపు కొమ్ములు గలగోవుల ననేకములు దానమిచ్చెను.. అనేక దేవస్థానములు కట్టించి వానికన్నిఁటికిని వృత్తుల నేర్పఱచెను.

ఒకసారి రుద్రమదేవి యుమ్మక్క సహిత యయి మొగిలిచెర్లకుఁ బోయి యచట వీరాశక్తినిఁ బూజించుచు నైదు దివసంబు లచట వసియించెను. అప్పు డామె పైకి హరిహరదేవుఁడును, మురారియుఁ దిరుగఁబడఁగా వారి నపుడు సామంబునం దనలోనం జేర్చుకొనియె. తదనంతరము రుద్రమదేవి యోరుగంటికోటలోనికి వచ్చి హరిహరుఁడును మురారియును జేయుకపటము నెఱిఁగి యామెసైన్యము నంపి వారిని గెలిచి వారి నందఱిని హతము గావించెను. తదనంతర మామె కొన్నిదినములు సుఖముగా రాజ్యముచేసినపిదప దేవగిరి రాజు దళములతోడవచ్చి యోరుగంటికి ముట్టడివేసెను. దానిఁ గని రుద్రమదేవి యెంతమాత్రము జంకక పరమేశ్వరునిఁ దలఁచి మహారౌద్రముతో పగవారిని ప్రతిఘటించిపోరాడి వారిబలంబుల హీనంబులు గావించె. అంత వారునుముట్టడినివిడిచి నలుగడలం బలాయితులు కాఁగా రుద్రమదేవి వారిని పోనియ్యక దేవగిరివఱకును దఱిమెను. వారును రుద్రమదేవి శౌర్యంబున కత్యంతాశ్చర్యముఁ బొంది కోటిద్రవ్య మామెకిచ్చి శరణాగతులయి తమదేశమున కరిగిరి. అంత రుద్రమదేవివిజయవాద్యములు మ్రోయ తననగరునకుఁ జను దెంచి సైనికులకుఁ దగిన బహుమతుల నొసఁగెను.

పిమ్మట నామెకూఁతురగు ఉమ్మక్కకు గర్భచిహ్నము లగుపడెను. వానిం గని రుద్రమదేవి యపరిమితానంద భరితయై పుంసవనము మొదలగు సంస్కారముల నొనరించి వినోదములతోఁ గాలముగడుపుచుండెను. ఇట్లుండఁగా ఉమ్మక్కకు పదినెలల నిండినపిదప శా. శ. 1166 న సంవత్సరమగు నందనసంవత్సర చైత్రశుద్ధ గురువారము నాఁ డుదయమున నొకపుత్రుఁ డుదయించెను. రుద్రమదేవి యా బాలకునిని స్నానముచేయించి సింహాసనమునందుఁ బరుండఁబెట్టి పౌరులను, సామంతులను రాఁబిలిచి వారందఱికిని మీప్రభు వితఁడని తెలిపెను. వారును మిగుల సంతసించిరి. తదనంతరమామె పుత్రోత్సవమునం దనేక దానధర్మములు చేసెను. బాలకునకు నామకరణ దివసంబున శివదేవయ్య పూజ్యురాలగు రుద్రమదేవిపేరు బాలకున కిడఁదలఁచి ప్రతాపరుద్రుఁడని నామకర ణముచేసెను. తదనంతర మాబాలకుఁడు దినదిన ప్రవర్థమానుఁడై శివదేవయ్యవలన సకలవిద్యల నభ్యసింపుచుండెను. ఈయన వెనుక ఉమ్మక్కకు మఱియొకపుత్రుఁడు కలిగెను. అతనికి అన్నమదేవుఁడని పేరిడిరి.

రుద్రమదేవునికి గర్భాష్టకంబున నుపనయ నంబుచేసి విద్యలన్నియు నేర్పి రాజ్య మాతని కిమ్మని శివదేవయ్య కొప్పగించి క్రీ. శ. 1295 వ సంవత్సరంబున రుద్రమదేవి దివి కరిగెను. ఈమె మనయాంధ్రదేశంబునకు శొరోరత్నమని చెప్పుట కెంతమాత్రమును సందియములేదు. స్త్రీలలో నిట్టివా రుందురని ప్రత్యక్షప్రమాణమువలన నెఱిఁగియు మనవారు స్త్రీలను హీనముగాఁ జూచుట మిగుల శోచనీయము.