అబద్ధాల వేట - నిజాల బాట/సెక్యులర్ జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు

వికీసోర్స్ నుండి
సెక్యులర్ జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు

ఆంధ్రలో పుట్టి పెరిగినా ఆంజనేయులు కేవలం ఇంగ్లీషులోనే రాసి పెద్ద జర్నలిస్టుగా ఖ్యాతి చెందారు. గోపాలశాస్త్రి ఆయన్ను డాంజనేయులు అని పిలవగా డి.ఎ.అని పాఠకలోకానికి పరిచితులు. ఆయన ఏది రాసినా,చెప్పినా స్పష్టంగా, మృదువుగా, మర్యాదగా వుండేది.

కోటంరాజు రామారావు నడిపిన "ఇండియన్ రిపబ్లిక్" లో తొలుత జర్నలిజానికి అక్షరాభ్యాసం చేసిన ఆంజనేయులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఎలవర్రులో పుట్టారు. (1924 జనవరి 10) స్కూలు చదువు అంతా కింగ్ జార్జి పాఠశాల తురుమెళ్ళలో జరిగింది. ఆనాడు జిల్లాలోనే అది ప్రతిష్టాత్మకమైన స్కూలు. దక్షిణామూర్తి అనే క్రమశిక్షణ సైనికుడుగా హెడ్మాస్టర్ ఆధ్వర్యాన పేరొందిన ఆంజనేయులు విద్య ముగించారు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎం.ఎ. చదివి, లా కోర్సు పూర్తిచేశారు. తొలుత నుండే జర్నలిస్టు జీవితాన్ని ఎంపిక చేసుకున్న ఆంజనేయులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో సబ్ ఎడిటర్ గా, మద్రాసులో ఆరంభించారు.ఇది 1948 నాటి మాట. 5 ఏళ్ళ తరువాత అక్కడే "హిందూ" పత్రికకు మారారు.

మరో 5 ఏళ్ళపాటు హిందూ సబ్ ఎడిటర్ గా సాగిన ఆంజనేయులు, ప్రభుత్వ ఉద్యోగంలో జర్నలిస్టుగా అడుగుపెట్టారు. 1959లో మద్రాసులో 'వాణి' ఆకాశవాణి పత్రిక ఎడిటర్ గా మరో రకమైన జర్నలిజం ప్రారంభించారు. అప్పటికే ఆంజనేయులు వివాహం చేసుకున్నారు. ఆయన భార్య ఆదిలక్ష్మి తెలుగు, తమిళ భాషాచార్యులు. ఆమె రష్యాలోని లెనిన్ గ్రాడ్ (సెయింట్ పీటర్స్ బర్గ్) వెళ్ళి 1958 నుండి 1962 వరకూ వున్నారు. అదే కాలంలో ఆంజనేయులు రష్యా, యూరప్ దేశాలు పర్యటించారు. తన అనుభవాలను 'విండో టు ది వెస్ట్' అని పుస్తకంగా ప్రచురించారు. ఉత్తమ ట్రావలాగ్ గా ఆ రచన మెప్పు పొందింది.

1962లో శాంతిశ్రీని కన్న ఆదిలక్ష్మి, ప్రసవించిన 15 రోజులకే లెనిన్ గ్రాడ్ లో చనిపోగా, సోవియట్ ప్రభుత్వం 16 మాసాలపాటు బిడ్డను పెంచి, ఇండియాలో తండ్రికి అప్పగించారు. 18 సంవత్సరాల అనంతరం శాంతిశ్రీ సోవియట్ పౌరసత్వం వదులుకోగా, రష్యా ప్రభుత్వం ఆమె పేరిట వుంచిన భరణం అందజేసింది. ఇప్పుడు పూనా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ గా వున్న శాంతిశ్రీ తండ్రికి సహాయపడుతూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగరీత్యా ఆంజనేయులు ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసులో వుంటూ సమాచారశాఖలో జర్నలిస్టుగా వృత్తిధర్మం నిర్వర్తించారు. ఉద్యోగంలో వున్నా వివిధ పత్రికలకు రాస్తూ ఆంజనేయులు మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుమించి,చక్కని రచనలు ప్రచురించారు. ఆయన రాసిన పత్రికలు క్వెష్ట్, ఇండియన్ రివ్యూ,థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే పేర్కొనదగినవి.

తెలుగు పత్రికలకు ఇంగ్లీషులో రాసి పంపగా, అనువదించి వేసుకునేవారు. స్వతంత్ర టైమ్స్, డక్కన్ హెరాల్డ్, న్యూస్ టుడే, ఇండియన్ బుక్ క్రానికల్ పత్రికలు కూడా ఆంజనేయులు వ్యాసాలు ప్రచురించాయి. భవాన్స్ జర్నల్ లో ఎన్నో విలువైన వ్యాసాలు ఆంజనేయులు రాశారు. వృత్తిచేస్తూనే అనేక సెమినార్లకు, చక్కని వ్యాసాలు రాయడం ఆంజనేయుల జర్నలిస్ట్ కృషిలో భాగం అయింది. దీనిఫలితంగా జీవితచరిత్ర, కళ గురించేగాక, నెహ్రూ, రాధాకృష్ణన్, అంబేద్కర్, నిరాద్ చౌదరి మొదలైనవారిపై లోతైన పరిశీలనా వ్యాసాలు రాశారు. తెలుగు సాహిత్యాన్ని, రచయితల్ని తెలుగేతరులకు అందించడం ఆయన విశిష్టత. ఇందులో భాగంగా గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ రాయగా, కలకత్తా రైటర్స్ వర్క్ షాప్ వారు వెలువరించారు.

వృత్తిరీత్యానూ, వ్యక్తి దృష్ట్యా ఆంజనేయులుగారికి ఎందరో సన్నిహితులయ్యారు. వారిలో నార్ల వెంకటేశ్వరరావు, సంజీవదేవ్, బి.ఎస్.ఆర్.కృష్ణ, కె.శ్రీనివాస అయ్యంగార్, వామనరావు, పట్టాభిరాం, ఎ.ఆర్.బాజీ, భావరాజు నరసింహారావు ప్రభృతులెందరో వున్నారు. నార్ల వెంకటేశ్వరరావు తన ఇంగ్లీషు రచనల్ని ముందుగా ఆంజనేయులు పరిశీలించిన తరువాత ప్రచురించేవారు.

సాహిత్య అకాడమీ ప్రచురించిన కట్టమంచి రామలింగారెడ్డి, కేంద్ర ప్రచురణ సంస్థ వెలువరించిన కందుకూరి వీరేశలింగం పేర్కొనదగిన ఆంజనేయులు రచనలు.

విశ్వనాథ సత్యనారాయణ, గోపీచంద్, బైరాగి, పాలగుమ్మి పద్మరాజు, శ్రీశ్రీ, సి. నారాయణరెడ్ది, దాశరధి, దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారిని తెలుగేతరులకు చక్కగా మదించి పరిచయం జేయడం ఆంజనేయులు కృషిలో భాగమే. ఆయన రెండో భార్య హేమలత హిందీ విద్వాంసురాలు. ఆమె కూడా ఆంజనేయులుగారి రచనల్లో,సమాచార సేకరణలో తోడ్పడుతుండేది. ఆంజనేయులు గారికి పుస్తకాల సేకరణ మంచి అభ్యాసం. ఆయన 1999లో చనిపోయిన తరువాత శాంతిశ్రీ, ఆ గ్రంథాలయాన్ని పూనాకు తరలించారు.

ద్వివేదుల విశాలాక్షి రచన "గ్రహణం విడిచింది" ఇంగ్లీషులోకి అనువదించారు.

ఆంజనేయులు రిటైర్ అయిన తరువాత మద్రాసులో స్థిరపడి,హిందూలో బిట్వీన్ యు అండ్ మి అనే శీర్షిక 10 సంవత్సరాలు (1981-91) నిర్వహించారు. సున్నిత హాస్యం,విమర్శ ఆయన రచనల్లో కనిపించేది. ఆంజనేయులు సెక్యులర్ జీవితం గడిపారు. కుమార్తె వివాహం రిజిస్టర్ చేయించి,కన్యాదాన పద్ధతి నిరసించారు. సంగీతం, సంస్కృతం, సాహిత్యం అంటే ప్రత్యేకాభిమానం.

మద్రాసు ప్రెస్ క్లబ్ లో 30 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. సాహిత్య విమర్శ, సాంఘిక సంస్కరణలపై కూడా రచనలు చేశారు. చిట్టచివరగా ఖాసాసుబ్బారావు జీవితచరిత్ర రాశారు. అది ఇంకా వెలుగు చూడాల్సివుంది. వీరబ్రహ్మేంద్రను సెక్యులర్ రుషిగా అభివర్ణించి రచన చేశారు కూడా. ఆంజనేయులుగారితో చర్చించడం చక్కని అనుభవం. అలాంటి అనుభవం నేనెప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను.

- వార్త, 4 నవంబరు,2001