అతిబాల్యవివాహము

వికీసోర్స్ నుండి

అతిబాల్యవివాహము


ఓవిద్వన్మహాజనులారా!

ఈసమాజముయొక్క అగ్రాసనాధిపతిగారు కొన్నిదినముల క్రిందట నన్నొకయుపన్యాసము చదువు మని యడిగినప్పుడు నాశక్తిని వక్తవ్యాంశముయొక్క గౌరవమును లేశమాత్రమును విచారింపక సాహసము చేసి బాల్యవిహమునుగూర్చి యుపన్యసించుట కొప్పుకొన్నాఁడను. కాని యీదినమున నేను కలము చేతఁబట్టుకొనివ్రాయ నారంభింపఁగానే, నాకంటె సమర్థతరులకు విడిచిపెట్టెవలసిన కార్యభారమును,నేను పైని వేసికొన్న హేతువుచేతగాఁబోలును కలము సాగక నాచేయి నడఁక మొదలు పెట్టెను.నాకంటె విద్యయందును బుద్థియందును అధికులయిన యీసామాజికులలో మఱియెవ్వరయిన సమర్థు లీబాల్యవివాహమును గూర్చి వ్రాసినచో మిక్కిలి రసవంతముగాను జనరంజకముగాను ఉండునని నేనెఱిఁగినవాఁడ నయ్యును, రోటిలో తల దూర్చినతరువాత రోకటిపోటునకు వెఱవఁదగ దన్నసామెతను స్మరించుకొని నాకు తోఁచినది వ్రాయ తెగించుచున్నాను. కాఁబట్టి నేనిప్పుడు చెప్పఁబోవుదానిలో మీ రెఱుఁగని క్రొత్తసంగతులుగాని క్రొత్తయుక్తులుగానియుండునని యాశపెట్టుకొనఁ బోకుడు. లోకములోననుభవింపఁదగిన సమస్త సుఖములలోను వివాహబంధమువల ననేభార్య, భర్త,తండ్రి, బిడ్డ,అక్క,చెల్లెలు,అన్న,తమ్ముడు,మొదలయిన సమస్త బంధుత్వములునుకలుగుననియు, ఈవివాహబంధము వలననే బిడ్డలు మృగప్రాయులుగాక తగినసంరక్షణమును విద్యాబుద్థులను పొంది వెలయుదు రనియు,ఈవివాహబంధమువలనే స్త్రీ పురుషులు యావజ్జీవమును స్నేహపాశాబద్థులయి యుండి యిరువురు నొక్క దేహముగా పరిగణింపఁబడుచుందు రనియు,ఈవివాహబంధము వలననే పురుషుల యావశ్యకములను స్త్రీలును స్త్రీల యావశ్యకములను పురుషులును తీర్చి పరస్పరసుఖాభివృద్థి పొందురు రనియు,మీరందఱు నెఱిఁగియున్న విషయమే గనుక వివాహముయొక్క ప్రాశస్త్యమును గుఱించియు నేనిక్కడ చెప్పవలసిన యావశ్యకము లేదు. అమరణమును వధూవరులకుఁ గలుగ వలసిన సుఖములకుఁగాని వధూవరులయెగ్యతా యెగ్యతలే ప్రధానములై నవనియు, సంసారసుఖము దంపతులయొక్క పరస్పరాలురాగము ననుసరించియే యుండు ననియు,మీకు విశదపడినయంశమే గనుక వివాహకాలమునకుముందే వధూవరులు వివాహబంధమువలనఁడమకు ముందు కలుగఁబోయెడు సంసారభారము యొక్క గౌరవమును తాము ముందెల్లకాలమును కలిసి మెలసి యుండ వలసినవారిగుణాగుణములను తెలిసికో తగినంతప్రాజ్ఞత గలవారుగా నుండవలసిన దన్నయంశమునుసహితము నేను వివరింపపవలసిన యావశ్యకము లేదు.అయినను వివాహము లెవ్వరి సుఖసంతోషాదులనిమిత్త ముద్దేశింపఁబడినవో,వానియందలి లోపమువలన నెవ్వరు కలకాలమును దుఃఖ మనుభవింపవలసినవా రగుదురో,తమచిరకాల సుఖజీవనమున కనుకూలప్రతికూలములుగా నుండుసాధకబాధకముల నాలోచించుకొనుట కెవ్వ రర్హులో, వారియంగీకారమును పరస్ప రేచ్ఛనులేశ మాత్రమును గణింపక మనదేశమునందు కొన్ని వర్ణములవారు వివాహములయం దాస్వాతంత్ర్యము నంతను తామే యక్రమముగా వహించి యాచారబలము చేతను మఱికొన్ని కారణములచేతను యుక్తాయుక్తవిచారమును జేఁయజాలక నిర్దోషు లయినబిడ్డలకు మితిమీఱిన కష్టములను తెచ్చి పెట్టుచుండుట చూడ నెంతయుశోచనీయముగానున్నది. సంసారసుఖకల్పవృక్షమును మూలచ్ఛేదము చేయుటకై వేరుపురుగువలెనున్న యీ బాల్యవివాహమును రూపుమాపినంగాని మన దేశమునందలి కుటుంబములలో వివాహమువలని సంపూర్ణఫలమెన్నటికిని కలుగనేరదు. ఈ బాల్య వివాహము మనదేశమునం దంతకంతకు ప్రబలుచుండుట కనేక కారణము లగుపడుచున్నవి. కొందఱు తాము బ్రతికియుండఁగానే తమ బిడ్డలకు వివాహము చేసి ముద్దులను ముచ్చటలను వేడుకలను చూడవలెనను నుద్దేశముతో పసిబిడ్డలకు వివాహములు చేయుదురు; మఱికొందఱు బిడ్డలయొక్క పెండ్లిండ్లను తామెప్పుడు చూతుమా యని తొందరపడుచుండెడు వృద్ధులయిన జనకుల యొక్కయు బంధువుల యొక్కయు నిర్బంధముచేత చేయుదురు; కొందఱగవుతగవుల నిమిత్తమును కట్నములు కానుకలు మొదలైన వాని నిమిత్తమును పోరుపెట్టెడు మూఢురాండ్రయిన భార్యలయొక్క ప్రోత్సాహముచేత చేయుదురు; కొందఱు దంభమునకయి యతి వ్యయము చేసి దక్షిణల చేతను బ్రాహ్మణ సంతర్పణముల చేతను ప్రతిష్ట పొందవలె నన్నకోరికతో చేయుదురు; కొందఱు వివాహములో వివాహము చేసిన సొమ్ము కలిసి వచ్చునని చేయుదురు; మరుకొందఱిప్పటియాచారమునుబట్టి తమ బిడ్డల కెంత శీఘ్రముగా వివాహము చేసిన లోకులు తమ్మంత మంచివారనుకొందురని పేరున కాశపడి చేయుదురు; కోడండ్రమీఁద నధికారము చేయవచ్చు నన్న యభిలాషతో నుండెడియిల్లాండ్రయొక్క యభిమతములు తీర్చుట కయి చేయుదురు; కొందఱు మంచి సంబంధముల కాశపడి చేయుదురు; కొందఱు వేగిరము వివాహములు కాక పోయినపక్షమున తమబిడ్డలు చెడిపోదురను సచ్చింతతోనే చేయుదురు; ఇంకను కొందఱు బాల్యవివాహములు చేయకుండుట శాస్త్రవిరుద్ధమన్న భ్రమచేత చేయుదురు. ఈ తెగలవారు గాక స్వప్రయోజనపరులై మానుషధర్మమును విడిచి దయాశూన్యులై రొక్కమును పుచ్చుకొనియో, అల్లుడు చచ్చి నచో వానిసొ త్తంతయు తమకే వచ్చుననియో, అల్లునియింటఁ జేరి తామందఱును సుఖజీవనము చేయవచ్చుననియో, తాముకన్న నోరెఱుఁగని శిశువులను అప్రయోజకులకును వికలాంగులకును వృద్ధులకును వివాహ వ్యాజమున బలియిత్తురు.ఏ కారణము చేత జరిగెడు బాల్య వివాహముల కైనను పురోహితులును యారకులును తోడుపడ సర్వ విధముల బాల్య వివాహములను ప్రోత్సాహపఱుతురు. ఇటువంటి కార్యములచేతనే ధనము సంపాదించి పొట్ట పోసికోవలసిన స్వప్రయోజనపరులు ప్రోత్సాహము చేయక మఱియేమి చేయుదురు? ఎవరి ప్రోత్సాహముచేత చేసినను, ఏ యుద్దేశముతో చేసినను, ఏ కారణముచేతఁ జేసినను, స్వభావవిరుద్ధ మనఁజను బాల్యవివాహము వలనఁ గలిగెడి దుర్వారము లైన దుష్ఫలములు కలుగక మానవు అతిబాల్య వివాహమువలన సంభవించుచున్న యనర్థములలోఁ గొన్నిటినిమాత్ర మిందు వివరించెదరు. బాలారిష్టములును స్ఫోటకము మొదలగు సాంక్రామిక రోగములును వానివలన కలిగెడు మరణములను బాల్యదశయందే విస్తారముగా నుండునన్న సంగతి యెల్లవారికిని తెలిసినదే. అందుచేత ౧౮౮౦ వ సంవత్సరమునందు మనదేశమునందు చేసిన జనపరిగణనమును బట్టి చూడఁగా తొమ్మిది సంవత్సరములను లోపలి వయస్సుగలిగి వివాహమన్న నేమో యెఱుఁగనిదశలోనున్న బాలురలో భార్యలను పోగొట్టుకొన్నవారు లెక్క తెలిసినంతవఱకు ౨౪౭౭౩ గురు క్నఁబడుచున్నారు. వీరి వివాహ సమయములయందు వ్యయపఱచిన ధనమంతయు వ్యర్థమగుటతప్ప, ఈ బాలురుగాని వారి బంధువులుగాని యేమిలాభము ననుభవించిన వారయినారు? బాలికలగతి బాలురదానికంటెను సహస్రగుణములు దుఖ:బహుళ మయినదిగా నున్నది. పురుషులు మరల వివాహము చేసికొన నైన నర్హులుగా నుందురు గాని నిరపరాధిను లయిన పసిబా లికల కామాత్రపు పుణయమయినను లేక క్రూరమయు చిరకాలాగ తమయిన యొకదురాచారప్రాబల్యముచేత నోరెఱుఁగని దశలో తల్లిదండ్రులువేడుకకొఱకువివాహమని పేరుపెట్టి యొకతంతునడసినదోషమునుబట్టి యావజ్జీవమును ప్రపంచసుఖములకు దూరురాం డ్రైమరణమునకంటెను తీవ్రవేదనాకరమయిన దుస్సహవైధవ్యవాధననుభవింప నిర్బంధింపఁబడుచున్నారు. అప్పటి జనపరిగణమును బట్టి యిట్టి దుస్స్థితిపాలయి యున్న పసిబాలికలు మనదేశమునందెందఱున్నారో యాలోచింపుఁడు. ఆ సంవత్సరమున తొమ్మిది యేండ్లకు లోఁబడిన వయస్సు గలవారయు భర్తలని చెప్పఁబడిన పురుషులను పోఁగొట్టుకున్న దురదృష్టతను వహించిన దయనీయ లయిన బాలిక లు౭౮౯౭౬గు రుండిరి. ధనము వ్యయము చేసి యా పసిబాలిక లకు వృధాగా తఱుగని దు:ఖమును గొని తెచ్చిపెట్టుకొనుటకుఁ గాక వీరి వివాహము వలన నెవరి కేవిధమయిన లాభము కలిగినది? ఈ చెప్పినవారుగాక యా సంవత్సరమున పదునాలుగు సంవత్సరముల ప్రాయమునకు లోపుగా నున్న ౨,౧౭,౩౮౮గురు బాలికలుకూడ విధవలయి యుండిరి. ఈ మూడులక్షల బాలికలును తలిదండ్రులచేతను సంరక్షకులచేతను బాల్యవివాహ మను పెనుభూతమునకు నిష్కారణ ముగా బలి పెట్టబడి కలకాలమును దు:ఖపరంపర పాలు చేయఁబడిన వారేకదా? మన దేశమునందలి వైధవ్యదు:ఖమున కంతకును బాల్య వివాహమే ప్రధానకారణము కాకపోయినను ఇన్ని లక్షలబాలికల వైధవ్యమున కయినను కారణమయినందుకు లేశమాత్రమును సందేహము లేదు. ఇఁక వైధవ్యమును పొందక తిన్నగా నున్నవారిగతి విచారింపుఁడు. వివాహమునాటికి చక్కగానున్న పురుషులుగాని స్త్రీలుగాని పలువురు స్ఫోటకము మొదలయినవ్యాధులచేత కన్నును కాలును చెడియు, వికలాంగు లయియు, దుర్బలశరీరు లయియు, సంసారసుఖమునకు పనికిరాక యొండొరులకు దు:ఖహేతువు లగు చున్నారు. కొన్ని సమయములయందు యోగ్యు లయిన పురుషుల కయోగ్యురాండ్రు భార్యలగుట లభించియు, గుణవంతురాండ్రయిన స్త్రీలకు గుణహీనులు భర్తలగుట లభించియు, పరస్పరాంగీకారము లేక పోవుటచేత మనసు కలియకయు, భర్తకంటె ముందుగా భార్యయెదిగి కాపురమునకు వచ్చియు, దంపతులలో నొకరు విద్యావంతులయిన నొకరు మూర్ఖశిరోమణులుగా నుండఁదటస్థించియు, బహు దంపతు లేకగృహమున వసించుచుండియు సుఖ మన్నమాట యెఱుఁగనివా రగుచున్నారు. పెద్దపెరిగినతరువాతఁగాని సుగుణములో దుర్గుణములో తిన్నగా స్థిరపడవు గనుక చిన్నతనములో వివాహము నాటికి మంచి వారనుకొన్నవారే కొందఱు తరువాత చెడ్డవారయి మరికొన్ని దాంపత్యములు దు:ఖదాయకము లగుచున్నవి. బాల్య వివాహ ప్రభావముచేత జనకులన్నపేరు చెఱుప నవతరించిన మనుష్యరూపముననున్న ఘోరరాక్షసులు ధనాశాపాశబద్ధులై తమ ముద్దుబాలికలను వృద్ధవిగ్రహములకును వారికంటెను అధములయిన రోగిష్టులు మొదలయినవారికిని విక్రయించుచుండుటవలన ఆముద్దాండ్రీడేరి కాపురమునకు వచ్చునప్పటికి పతులు స్వర్గయాత్ర కున్ముఖులై యుండియు జీవచ్ఛవమువలె నుండియు యువతులు పలువురు దు:ఖములపాలు కావలసిననవా రగుచున్నారు. ఇంతేగాక మనదేశములో నున్నయనేకవర్ణ భేదములచేతను వానిలోని మితిమీఱిన శాఖోపశాఖల చేతను తల్లిదండ్రులు వేఱుగతి లేక రంభవంటికొమార్తెనైనను కొన్ని సమయములయందు వికలాంగున కయినను దరిద్రున కయునను ఇచ్చి వివాహము చేయవలసినవా రగుటచేత కొందఱుకన్నియలు సుఖ మెఱఁగనివా రగుచున్నారు.

ఇట్టి వేమియులేక సుఖ మనుభవింపుచున్నా రనుకొనుచున్న బహుదంపతుల యవస్థను చూడుడు. ఒక్కమనదేశమునందు తప్ప సమస్తదేశములయందును పురుషులు తాము స్వతంత్రముగా భార్యా పుత్రులనుపోషింప శక్తివచ్చిన తరువాతనే వివాహము చేసికొందురు. మనదేశమునందట్టుగాక తల్లిదండ్రులుపసిబిడ్డలకే వారయనుమతివిచారింపక భార్యల నంటకట్టుటచేత మనబాలురు కౌమార దశయందలి స్వతంత్రవర్తనమును సంతోషమును చవిచూడనివారయి సదా నిరుత్సాహులగుచున్నారు. కాఁబట్టియేయొకహోణపండితుఁ డొకపాఠశాలయం దుపన్యసించుచు అన్ని దేశముల వారికిని కౌమారదశ యుండఁగా మనపెద్దలు మన బాలుర కొకదశ నపహరించి జనసామాన్యమునకు భగవంతుఁ డనుగ్రహించియున్న యత్యంతప్రయోజనకర మయిన కౌమారదశానిక్షేపము తక్కువ చేసి యున్నారని వచించియున్నాఁడు. అందుకుసందేహము లేదు. ఈకౌమారదశయందే పురుషులు తమప్రవర్తనమును స్థిరపరుచుకొని, సుగుణసంపదను గడించి, విద్యాబుద్ధులయందు ప్రబలి ధైర్యసాహసాదులను నేర్చుకొని, స్వతంత్రవృత్తి నలవరుచుకొని, తరువాతి లౌకిక యాత్ర కనుకూలమయిన సాధనసామగ్రినెల్లను సంపాదించుకోవలసినది. దు:ఖముల నెఱుఁగక నిర్విచారముగా నుండవలసిన యటువంటి సుఖకాలములోనే యాఁబోతునకుగుదెకఱ్ఱ కట్టినట్టు మనవారు బాలురకు సంసారము నంటకట్టి తల యెత్తుకొనకుండఁ జేయుటవలన మనవారుత్సాహమును ధైర్యసాహసాదులను లేనివారయి పూనికతో స్వతంత్రించి యేసత్కారమును జేయుటకును పనికిమాలినవా రగుచున్నారు. అందుచేతనే మనబాలురు సాధారణముగా వివాహము లేక పాఠశాలలో చదువుకొన్నంనతవఱకును దేశోపకారము నిమిత్తము పాటుపడవలెననియు, సంఘదురాచారమును మాన్పవలె ననియుఁ స్త్రీలయొక్కయు నీచకులమువారియొక్కయు స్థితిని బాగుచేయవలెననియు, తలఁచి మిక్కిలి యుత్సా హముతో సమాజము లేర్పరచి ప్రసంగములు చేసి ధైర్యముతో దురాచారములను దూషింపఁ గలిగియు, వివాహమై భార్యకాపురములకు వచ్చిన రెండుమూడు సంవత్సరములలోపలనే తమ పూర్వావస్థ నంతను మఱచిపోయి తొంటియుత్సాహముచెడి దీనముఖములు గలవారయి, దేశాభిమాన మన్నమాటను స్మరణకు తెచ్చుకొనక, తొంటి ప్రసంగములను సమాజములను విడిచిపెట్టి, ధైర్యసాహసములను స్వాతంత్ర్యమును కోలుపోయి, ఎవ్వరియడుగులకు మడుగు లొత్తియైనను ఎన్ని యిచ్చకము లాడియైనను నెలకు పదియేనురూపాయలపని సంపాదించి లంచములు పుచ్చుకొనియో కల్లలాడియో తమ భార్యాపుత్రులను పోషించుటయే పరముర్థమని సిద్ధాంతము నేర్పఱుచుకొని, లోకము నిమిత్తము పాటుపడఁదలఁచినవారిని జూచి పరిహసించుచు వారిని నిరుత్సాహపఱిచి, తాము లోకములకు నిష్ప్రయోజకు లగుచున్నారు. పురుషులగతి యిట్లుండఁగా వారి భార్యల కింకొకదురవస్థకూడ ప్రాప్తించుచున్నది. ఆచిన్నది మగనికొలువు మాత్రమేకాక అత్తగారికొలువుకూడ చేయవలసియుండును. సాధారణముగా మగఁడింటఁ గూరుచుండి సుఖభోజనము చేయుచుండు పరాధీనుడుగా నుండుటచేతను, తన్నుమాత్రమేకాక తనభర్తను కూడ పోషింపవలసినవా రత్తమామలే యగుటచేతను, అత్తమామలకుఁ బూర్ణముగా కోపమువచ్చిన పక్షమున ఇంట నిలుచుటయే పొసఁగనేరదు గనుకను, బాలభార్య మగనికంటె అత్తమామలకే యెక్కువలోఁబడి వారికే యాజ్ఞానువర్తినిగా నుండవలసిన దగుచున్నది. ఈ హేతువునుబట్టి బాలభార్యలు పలువురు మగలమనసుల కెడయై యావజ్జీవమును సుఖ మెఱుఁగనివా రగుచున్నారు. అదిగాక అత్తలకు కొందఱకు కారణమున్నను లేకపోయినను కూడ కోడండ్రను బాధించునప్పటికంటం నధిక సంతోషము మఱియెప్పుడును కలుగదు. అత్తగా రెంతమూర్ఖురా లయిన, ఈబాధ యంతయధికముగా నుండును. కొడు కేమైననుసరే కోడలిత్రాడు కోటిపల్లెరేవున త్రెంచినఁ జాలునని సంతోషించు అత్తలును మనదేశములో పలువురున్నారు. ఈ బాధలనుబట్టియే "అత్తపోఁగొట్టిన దడుడోటికుండ, కోడలుపోఁగొట్టి నది క్రొత్తకుండ" యనుసామెతయు, ఇటువంటివే మఱికొన్నిసామెతలును వెలసియున్నవి.

ఈ సుఖమంతయు నిట్లుండఁగా నీ బాలదంపతులకు లభించెడి యితరావస్థలను చిత్తగింపుఁడు. కాలము రాకమునుపె గర్భాదానమగుటచే కలిగిన సంతానము సాధారణముగా దుర్బలమయి పురిటిలో పోవువారును తరువాత కొంతకాల మాదంపతులకును బంధువులకును శ్రమ యిచ్చి పోవువారును అయి యుందురు; అంతటి భాగ్యమును వహింపక చిరకాలము కష్టముల ననుభవించుచు బ్రతుక నోచుకున్న బిడ్డలు చిడుము మొదలయిన వ్యాధులచేత చిక్కి దుర్బలమయన శుష్కదేహములు గలవారయి పెద్దవారయినప్పుడుసహిత మా బిడ్డలకు పుట్టినబిడ్డలు తాము తమకాలములో పురాణములయందు వర్ణింపఁ బడిన యంగుష్ఠమాత్రశరీరులను పుట్టింపఁ బ్రయత్నించుచున్నవారివలె నుందురు. ఆడుకోవలసినయవస్థలోనే బాలికలకు బిడ్డలు పుట్టుటచేత కూడ తల్లులు తిన్నగా పిల్లలను పెంచుటకు చేతఁగాక వారినిపాడుచేయుచున్నారు. బిడ్డలమాట యటుండఁగా బిడ్డలను గన్నతల్లులు తండ్రులు సహితము కొంతకాలములోనే శరీరపటుత్వము చెడిపడుచుతనములోనే ముసలివారయి యల్పాయుష్కు లగుచుందురు. రజస్వల యయినంతమాత్రముచేత కన్య సంభోగార్హురాలు గాదనియు, సమస్తావయవపరిపూర్తి యగుటకు మఱికొన్నిసంవత్సరములు జరగవలె ననియి, ఈలోపల వధువరులను కలిపినయెడల వారిదేహములు చెడి రోగాశ్రయము లగుటయేకాక వారికి పుట్టినబిడ్డలును చెడుదు రనియు వైద్యశాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విధముగా బాల్యవివాహమువలన సుఖము కలుగకపోవుటయేగాక వివాహము లేనియెడల దృఢకాయులయి చిరకాలము జీవింపఁదగిన దంపతులయాయువుకూడ సన్నమగుచున్నది. మఱియు బాల్యవివాహమువలన బాలికయొక్క చదువుమాత్రమే కాక బాలయొర్తయొక్క చదువుకూడ చెడిపోవుచున్నది. సంసారదు:ఖములు లేక స్వేచ్ఛగా బ్రతుకవలసిన బాల్యదశలోనే సంసారము వచ్చి మీఁద పడుటచేత చదువుతోఁచక, ఇంటనొక మూల తల్లిదండ్రులును మఱియొకమూల నాలుబిడ్డలును ద్రవ్యార్జనము కుటుంబభరణము చేయుమని నిత్యమును పోరుచుండఁగానుద్యోగము నిమిత్తమయి యీబాలుఁడు కృషిచేయవలసినవాఁడుకాక యెటుండఁ గలఁడు? మన మెఱిఁగినవారిలోనే యెందఱు బాలురు మిక్కిలి తెలివిగలవారయ్యును గొప్పపరీక్షలం గృతార్థులయి యున్నత స్థితికి రాఁదగిన బుద్ధిసంపద గలవారయ్యును సంసారభారము మీఁద పడుటచేత నడుమ చదువు విడిచిపెట్టి భావిమహాఫలములను చెడగొట్టుకోవలసినవా రగుచున్నారు కారు? ఎందఱు బాలురు తమ చిన్న భార్యనింట నొంటిగా విడిచి రా వలనుపడక యత్యల్ప దూరములోనున్న శాస్త్ర పాఠశాలలకు సహితము పోయి చదువుకో లేక చదువునం దెంత యాసక్తిగలవారయినను కార్యము లేక చిన్న పనులతోనే తృప్తి పొందవలసినవా రగుచున్నారు కారు? ఒక్క విద్యాభివృద్ధిమాత్రమే కాక సమస్తాభివృద్ధులకును బాల్యవివాహము ప్రతిబంధకముగా నున్నది. వివాహమైనతోడనే తరుచుగా బాలికలను పాఠశాలలనుండి మాన్పించుచున్నారు. ఇదిగాక యీ బాల్యవివాహమువలన చిన్నతనములోనే సంతానము గలిగి వారు పోషేంపలేనియవస్థలోనే కుటుంబములు పెరుగుచుండుటచేతను వారి వివాహముల నిమిత్తమయి కులాచారానుసారముగా విశేషవితమును వ్యయము చేయవలసి వచ్చుటచేతను మనదేశములో బహుకుటుంబములు పేదఱికముపాలయి సిమ్మట ఋణములపాలయి చిరకష్ణముల పాలు కావలసిన వగుచున్నవి.కొన్నిచోట్ల వివాహములనిమిత్తము చేసినయప్పులచేత పురుషులు తమకంతకు మునుపు జీవనాధారములుగా నున్న మాన్యములను పోఁగొట్టుకొన్నవారయి భార్య లింటికి కాపురమునకు వచ్చునప్పటికి తిండికి లేక తిరిపె మెత్తుకోవలసినస్థితిని పొందు చున్నారు.మఱికొన్ని చోట్లవారి వివాహములనిమిత్తమయి చేసిన ఋణములను వారి ముమ్మనుమలును వారి సంతతివారునుకూడ తీర్చుకోవలసినవా రగుచున్నారు. పనికిమాలిన బాల్యవివాహములకయి వారి దుర్వ్యయము చేయుటకంటె,ఆధనములో కొంతభాగము పెట్టి బాలురకు విద్య చెప్పించినపక్షమున వా రెంతసుఖపడుదురు? మన వారు బహ్వనర్థములకు మూలమయినయీబాల్యవివాహమును మానిపించి యేల తమబిడ్డల సుఖాభివృద్ధి చేయ బ్రయత్నింపరాదు? ముసలివాండ్ర వేడుకకొఱకు కడుపున పుట్టినబిడ్డలను పాడుచేయుట మానుష ధర్మమగునా? తమ కంతవేడుక చూడవలెనన్న మనసున్నపక్షమున బొమ్మలపెండ్లిండ్లు చేయించి సుఖ మనుభవింపరాదా? అంతటితో తృప్తి కలుగక పోయినయెడల నిజముగా బిడ్డలనే పల్లకులలోపెట్టి యూరేగించి సంతోషమనుభవింపరాదా? "ఎలుకకు ప్రాణసంకటము పిల్లికి చెల్లాటము" నన్నట్లు ముసలివాండ్రయెుక్కయు మూర్ఖుల యెుక్కయు వినోదముకొఱకు పసిబాలికల యెుక్కయు బాలురయెుక్కయు సుఖము చెడఁగొట్టుట క్రూరకృత్యము కాదా? తల్లి యెుక్క యగవుతపులనిమిత్తమును వేడుకలనిమిత్తమును బిడ్డలకు వివాహము చేయుటయయు,వానివలన కలిగెడుకీడుల నా బిడ్డ లనుభవింపవలె ననుటయు నెంత కానిపని?

ఈ బాల్యవివాహములు మనదేశములో చిరకాలమునుండియు న్నను, ఇప్పుడంతకంతకు ప్రబల మగుచున్నవి. నాచిన్నతనములో ఏడెనిమిది సంవత్సరములకు లోపు వయస్సుగలబాలికలకు వివాహము చేయుట ఎక్కడనో యరుదుగానుండుచు వచ్చెను. ఇప్పుడు పాలువిడువని బాలికలకుసహితము వివాహములు చేయుట సర్వసామాన్యమగుచున్నది. ఈదురాచార మెుక్క పామరులలో మాత్రమే కాక చదువుకొన్నవారిలో కూడ వ్యాపించున్నది.ఇక్కడ విద్యాశాలయందు సర్వకలశాల పరీక్షకు చదువుకొనుచు బహుధైర్యముతో బాల్యవివాహము లనర్థదాయకములని వాదించుచువచ్చిననా మిత్రుఁడే యెుకఁడు తనవంతు వచ్చినప్పుడు కొమార్తె కు నాలుగుసంవత్సరముల యీడు వచ్చులోపలనే వివాహము చేయఁగా చూచి యున్నాను. చదువుకొన్న వారికిని చదువుకొననివారికిని మాటలయందు తప్ప కార్యములయం దంతగా భెేద మగపడుచుండ లేదు. ఈనడుమను చెన్నపురమునందు జరిగన మహాసభలో సర్వకలాాపరీక్షలం దేఱి పట్టపరీక్ష నిచ్చి మెప్పించినంత మహా విద్యావంతులు కూడా తమ కొమార్తెలకు పదిసంవత్సరములకు లోపల వివాహము చేయకుండటకు బద్ధుల మయ్యెదమని వాగ్దానము చేయలేకపోయిరి. వారందుకు కనఁబఱిచిన హేతుబలమును కొంచెము చిత్తగింపుఁడు. ఈకొమార్తె లను గన్నతండ్రులు తామే తల్లిదండ్రులచాటు బిడ్డలఁట!స్వాతంత్ర్యము లేనివారట: ఆహా! లోకములో నింతకంటె బానిసతనమేమున్నది? వివాహ విషయమయిన సాధక బాధకముల నాలోచించుకొను స్వాతంత్ర్యము వివాహసంబంధము వలని సుఖదు:ఖములను యావజ్జీవమును అనుభవింప వలసిన వధూవరులకును లేక, వారి తల్లిదండ్రులకును లేక, అంతలపొంతలవారికా యుండవలసినది? పట్టపరీక్షలము గ్రుతార్థులైనవారు తాము స్వతంత్రముగా పొట్టపోసికోలే మను భయముచేతనా తా మయుక్తమని యెరిగినదియు తాము ప్రేమించెడివారికి నష్ట కరమయినదియు నైన యకార్యమును చేయవలసినది! తమ కడుపున పుట్టినవారి సౌఖ్యాభివృద్ధితో చేరిన యీ విషయమునందే స్వాతంత్ర్యము లేకపొయినయెడల మరియేవిషయము నందు గలుగును? కారణము లేని విషయములలో న్యాయము కాని పట్టుపట్టి కాటికి కాళ్ళుచాచుకొని యున్న వృద్ధు లయిన జననీజనకుల మనస్సును నొప్పింపలేనంత దయార్ద్ర హృదయముగలవారు, కలకాలము సుఖముగా బ్రతుకవలె నని కొండంత యాశ పెట్టుకొని దయనీయలయి తమకడుపునపుట్టిన ముక్కుపచ్చలారని ముద్దుకూతులను వేగరపడి స్వయంకృతాపరాధమువలన యావజ్జీవమును దు:ఖములపాలు చేయగలరా? ఈ రీతి సాకుల్ను విడిచిపెట్టి మనలోని చదువుకొన్నవారు తాము మంచి కార్యమని దృఢముగా నమ్మిన దానిని పామరులకు భయపడక నిశ్శంకముగా నెప్పుడు చేయనారంభింతురో, అప్పుడే మనదేశము బాగుపడ నారంభించునుగాని క్రియ లేని శూన్యవచనములచృత నెప్పుడును బాగుపడదు. "చదువవేసిన నున్న మతియుచెడిన" దన్నట్టు మనదేశమున చదువు హెచ్చుటతోనే బాల్యవివాహములును హెచ్చుచున్నవి. పూర్వకాలమునందు బ్రాహ్మణులు కానివారు కన్నులు తెరవని పసికూనలకు వివాహము చేయుచుండుట సాధారణముగా లేదు. ఈ కాలమున మూడేండ్లకు ముండమోసిన బాలికలు గూడ శూద్రులలో కనబడుచున్నారు. ఇప్పుడు నష్టకరములని యెంచి బ్రహ్మణులు తమ యాచారములును కొంచెమయినను విచారింపక శూద్రులు మొదలైనవారు కొందరు బ్రాహ్మణు లాచరించినట్టు తా మాచరించినచో తమకు గౌరవము వచ్చునని యెంచుకొని యనాలోచితముగా బ్రాహ్మణుల దురాచార ములను కొన్నిటి నవలంబించుచున్నారు. ఆందుచేత పూర్వకాలమునందు బ్రాహ్మణ వైశ్యజాతులలో మాత్రమే యున్న బాల్యవివాహము లిప్పుడు సర్వవర్ణ సామాన్యములయి శూద్రులలొ కూడ వెలయు చున్నవి. శూద్రులు చేయనారంభించిన పనినే తామును చేయుచున్నచో తమకు గౌరవాధిక్యము లేదనుకొని యాలోచనలేని బ్రాహ్మణోత్తములు తా మేలాగున నయినను వారిని మించవలెనని యొకరు ప్రయత్నించుచుండుటచేత కడపట నందరును చెడుచున్నారు. అందుచేత నీ వివాహములు క్రమక్రమముగా వివేకులకు బరిహాసపాత్రములయి, పెండ్లిపీటమీద పెండ్లి కొడుకు తల్లిని గానక యేడుచుటయు, పెండ్లికూతురు పాలకై యేడుచుటయు, వారి యేడుపుడుపుటకయి కొన్ని సమయములందు బెత్తము చేత బట్టుకొని యయ్యవారును మరికొన్ని సమయములందు పప్పు బెల్లములును కావలసివచ్చుటయు, భార్య యెవ్వరో తెలియక పిల్ల నొడిలో బెట్టుకొని చన్ను గుడుపుచున్న తల్లి మెడకే పెండ్లికొడుకు మంగళసూత్రధారణము చేయుటయు, పోరుపెట్టిన పెండ్లికొడుకుచేత పుస్తె కట్టించుటకు చేత గాక పురోహితుడే పెండ్లికొమార్తెకు తాళిబొట్టు కట్టి వివాహతంత్రము నడుపుటయు, దటస్థించుచున్నది. మూడము లనియు, చెప్పి యనుగ్రహించెడి జ్యోతిష్కులముహూర్తములు కూడ బాల్యవివాహములను త్వరపెట్టుచున్నవి. ఈజ్యోతిషముచేత జనులు మోహపడి జాతకపత్రిక బాగుండ దను హేతువుచేత కులములో దొరక తగిన వారిలో కూడ మంచిమంచి వరులను నిరాకరించి యథములను స్వీకరించుచున్నారు. ఇందుచేత కూడ బహుదాంపత్యములు సుఖదాయకములు కాకున్నవి. ఈ ముహూర్తములవలన జ్యౌతిషమునే వృత్తిగా నేర్పరచుకొన్న వారి కుటుంబపోషణము జరుగుచుండుట తప్ప నాకు వేరుప్రయోజన మగుపడుచుండలేదు. తక్కిన యే సుభకార్యముల కెట్లు చేసినను వివాహకార్యమునందు మాత్రము వరుని జాతకపత్రమును పరిశీలింపించికొననివారును మంచి మూహూర్తమును పెట్టించుకొననివారును సాధారణముగా నుండరు. అట్లయినను ముహూర్తమును పెట్టించుకొనని హూణులు మొదలయినవారిలో కన్న సుముఃహూర్తముల కయి కాలమును ధనమును వెచ్చ పెట్టెడు హిందువులలోనె విధవ లధికముగా నున్నారు. జ్యౌతిషమువలన ప్రయొజనలేశమయినను కలిగిన యెడల శుభలగ్నములయందు వివాహితలయిన వారిలో నిన్న లక్షలమంది బాలవిధవ లెందుచెత కావలయునా యని నాకు సందేహము కలుగుచున్నది. ఇట్టి సందేహమే మనవారి కందరికిని కలిగెడుపక్షమున, ముహూర్తమృత్యుదేవతనోటినుండి విధవలు కాకుండ ప్రతి సంవత్సరమును లక్షలకొలది పసిబాలికలను కాపాడవచ్చునని నాకు తోచుచున్నది. అది యట్లుండ నిండు.

మనవా రిప్పుడు సామాన్యముగా బ్రాహ్మణ వర్ణమునకు, హిందూశాస్త్రములు బాల్యవివాహములు విధించు చున్నవనియు, శాస్త్రవిధానము దుర్లంగ్యమనియు భావించుచున్నారు. అట్టి వారికి సఛ్శయనివారణము కలుగుటకయి నాకు దెలిసినంతవరకు వివాహ విషయమున గల శాస్త్రమును కూడ సంగ్రహముగా వివరింతుచున్నాను. వేదమంత్రములును మంత్రవినియోజకవాక్యము లయిన కల్పసూత్రములును సంబంధించి యున్నంతవరకును, బాల్య వివాహముల కనుజ్న యెక్కడను లేదు సరిగదా, వ్యక్తురాలయిన కన్యకే వివాహము చేయవలసినట్టుకూడ కనబడుచున్నది.

వివాహమంత్రములొని "సోమ:ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: తృతీయో అగ్నిష్టే స్తురీయస్తే మనుష్యజా: సోమోదద ద్గంధర్వాయ గంధ్ర్వో దద దగ్నయే : రయించ పుత్రాం శ్చాదాద్గ్ని ర్మహ్యమధో ఇమాం " అను ౠగ్వేద వచన్మునుబట్టికన్నియను మొదట సోముడు వరించుననియి, తరువాత గంధర్వుడు వరించుననియు, అటుపిమ్మట నగ్ని వరించుననియు, ఆ పయిని మనుష్య్డు వరించుననియు, కన్నియను సోమాదులొకరి తరువాత నొకరికియ్యగా కడపట మనుష్యునకు వచ్చుననియు, శాస్త్రమర్యాద యున్నది. కన్నియను పురుషుడు వివాహమాడుటకు ముందు సోమాది దేవతలు వరించవలసిన పక్షమున, అసోమాదులు వరించెడికాలమేది, అటుతరువాత మనుష్యుడు పొందవలసిన కాలమేది, అని తెలిసికోవలసియుండును. దీనికాధారముగా సంవర్తస్మృతియందు 'శ్లో||రోమదర్సన సంప్రాప్తే సోమో భుక్తేధ కన్యకా| రజోదృష్ట్వాతుగంధర్వ కుచౌదృష్ట్వాతుసానక||" అని యధోరోమదర్శన కాలమందు పాపకుడును వరింతురనియు, అటుపిమ్మట ననగాకన్నియయుక్తవయస్సు వచ్చి రజస్వలమయి కుచపరిపూర్తి యయిన పిమ్మట నేపురుషుడు వివాహమాడవలయుననియు, ప్రమాణవచనము కనబడుచున్నది. దీనిని బట్టి చూడగా నీడేరనివార్ని వివాహ మాడకూడదనియేకదా స్పష్టమగుచున్నది. రోమదర్శనాది కాలములయందు సోమాదులు వరింతు రనగా వారా కాలములయందు వరుసగా శరీర శుచిత్వమును, వాక్చాతుర్యమును, పరిశుద్ధతను కలుగజేయుదురని తాత్పర్యమే కాని వారు నిజముగా వరింతురనియే యర్థముకాదు. అందుచేతనే యాజ్నవల్క్యస్మృతియందు "శ్లో|| సోమశ్శౌచం దదౌ స్త్రీణాం గంధ్ర్వశ్చ శుభాంగిరం | పొవకస్సర్వమేధ్యత్వం మేధ్యావైయోషితో హ్యత:|" అని స్త్రీలకు సోముడు శౌచమునిచ్చుననియు, గంధర్వుడు మంచి పలుకులనిచ్చుననియు, పావకుడు సర్వపరిశుద్ధతలనిచ్చు ననియు కంఠోక్తిగా జెప్పబడియున్నది. ఈ శ్లోకములొని కడపటి చరణమునకు వ్యాఖ్యానము చేయుచు విజ్నానేశ్వయోగి "స్త్రియప్సర్వత్ర స్పర్శనాలింగనాదిషు శుద్ధా:" అని వ్రాసియున్నాడు. కాబట్టి స్త్రీలు వివాహకాలమునకు సంపూర్ణావయవములు కలవారయి యీడేరి వాక్ప్రౌఢిమకలవారయి యుండవలెనని యేర్పడుచున్నది. శ్రుతిస్మ తులయందీప్రకారముగా నుండగా బాల్య వివాహములను వ్యాపింప జేసిన వారు జ్యోతిర్నిబంధమను గ్రంథములొని దని "శ్లో||షడబ్దమధ్యేనోద్వాహ్యా క్న్యా వర్ష ద్వయన్యత | సోమోభుజ్తే తత స్తద్వద్గంధర్వశ్చ తధానల:||"అని స్త్రీ కారేండ్లలోపల వివాహము చేయ గూడదనియు, సోమగంధర్వసావకులు రెండేసి సంవత్సరములనుభవింతురనియు వ్రాసి, సోమాదు లనుభవించుకాల మారేండ్లలోనే పోవుననియు నేడవయేడు మొదలుకొనియే కన్నియ వివాహయోగ్యురాలనియు బోధపడునట్లు చేసియున్నారు. కాని సోమాదులు కన్నియను పసితనములోనే వరించి శౌచాదుల నిత్తురనుట యుక్తికిని శాస్త్రమునకును కూడ విరుద్ధము. గంధర్వుని నుద్వాహము చేయునప్పుడు వివాహములో పఠించెడు ఋగ్వేదమంత్రముతోనే "ఉదీర్ష్వాతోంవిశ్వావసో నమసేదా మహేత్వా | అన్యామిచ్చ ప్రభర్వ్యగ్ ంసంజాయాంపత్యాసృజ | ఉదీర్ష్వాత: పతివతీహ్యేషా విస్వావసుం నమ: సా గర్బి రీట్టే| అన్యామిచ్చ పితృషదం వ్వక్తాగ్ ం పతే గాగో జనుషాతస్యవిద్ధి" అని గంధర్వుడయిన విశ్వావసుడు వివాహిత యయిన యా స్త్రీని విడిచిపెట్టి వ్యక్తురాలు కాని పిత్రుగ్రుహముననున్న యవివాహితకన్య యొద్దకు పోవ ప్రార్థింపబడుచున్నాడు. ఇట్టి బలవత్తరమయిన శ్రుతి ప్రమాణముండగా నిర్ణయ సింధ్వునం దుదాహరింపబడిన పయి వచనమునుబట్టి కన్నియకు నాలవయేటనే స్తనోద్గమము కలుగుననికాని, యేడవయేటనే వివాహము చేయవలెనని కాని, వివేకులెవ్వరయిన చెప్పసాహసింపగలరా? అంతేకాక వివాహములో నాలవదినమున వధూవరులకు జరిగెడి సంభాషణములో "అపశ్యం త్వా మనసా చేకితావఒ తవసోజాతం తపసో విభుతం : ఇహప్రజా మిహరయిగ్ శరాణ: ప్రజయాస్వప్రజయాపుత్రకామ" అని వరుని గూర్చి వధువు 'నీవు యోగ్యుడ వనియు తపసుచేత పుట్టి తపస్సు చేత వర్ధిల్లితివనియు నేను మనస్సు చేత తెలిసికొంటిని గనుక, నాయందు పుత్రకాముడ వయి యున్న నీవిక సంతోషపూర్వకముగా సంతానము పొందుమనియు "అవశ్యం త్వా మనసాదీధ్యానాగ్ ం స్వాయాం తనూగ్ ం ఋత్వియేనాధమానాం | ఉపమాముచ్వా యవతిర్బభూయా: ప్రజయాత్వ ప్రజయాపుత్రకామే" అని వధువును గూర్చి వరుడు 'నీవీసమయమునందు నాధునితో కూడవలెనని యపేక్షించుచున్నట్టు నా మనస్సు చేత కనిపెట్టితిని గనుక, యువతివయి పుత్రకామురాలవయి యున్న నీవు నన్ను పొంది సంతానము కనుము ' అనియు, మంత్రము చేత చెప్పుదురు. ఇటువంటి సంభాషణము సంభోగము మాట యటుండగా వివాహమనగా నేమో యెరుగని బాలునకును బాలికకును జరిగెడిదని మతిమంతుడెవ్వడయిన చెప్పగలుగునా? వివాహ దినముల లోనే వరుడు వధువును గూర్చి "గ్రుహం గచ్చ గ్రుహపత్నీ యధాసోవశినీ త్వం వివిధ మావా దాసి" అను రుగ్వేదమంత్రముచేత 'నీవు గ్రుహమునకు వచ్చి గ్రుహయజమానురాల వయి యింటికి వచ్చిన వారి నాదరించి గ్రుహక్రుత్యములను నిర్వహింపుమని " పలుకుటయు, వధువును గూర్చి బ్రాహ్మణులు "ఇహంప్రియం ప్రజయాతే సంరుధ్యతాస్మిన్ గ్రుహేగార్హపత్యా యజాగ్రుహి| ఏనాపత్యాతన్యగ్ సంస్రుజస్వాధాజ వ్రీవిదధమావదాధ:" అను ఋగ్వేదవచనముచేత 'ఇప్పుడు ప్రియపడి నీ వీ గ్రుహమునందు సంతానమును పొంది గ్రుహ యజమానత్వము నందు జాగరూకురాల వయి, నీశరీరమును నీపతి శరీరముతో చేర్చి మీరు ముసలివా రగువరకును గృహమును పరామర్శింపుము ' అనిపలుకుటయు, బాల్య వివాహమున కిసుమంతయయినను పొసగి యుండునా? ఆపస్తంబ, ఆశ్వలాయనాది సూత్రము లన్నియు వధూవరులు మూడుదినము లధశ్శయ్యనుండి బ్రహ్మచర్యము చేయవలెననియు నాలవ దినము రాత్రి గర్భాదానము జరగవలెననియు విధించుచున్నట్టును, గర్భాధానముతోగాని వివాహపూర్తి కానట్టును శాస్త్రజ్నానము కలవారి కందరికిని తెలియునుగదా? ఇప్పుడు జరుగుచున్న శాస్త్ర విరుద్ధ మయిన బాల్య వివాహములలొ వివాహమున కావశ్యకమయిన గర్భాధానమును జరపకపోయినను మన పురోహితులు నాలవనాటిరాత్రి గర్భాధాన మంత్రముల నేకరువు పెట్టుచుండుట నందరు నెరుగుదురుగదా? ప్రాచీనము లయిన మన ధర్మశాస్త్రము లన్నియు యుక్తవయస్సు వచ్చిన స్త్రీలకే వివాహమును విధించు చున్నవి. అందుచేతనే మన ధర్మశాస్త్రకర్తలు వివాహయోగ్యకన్యాప్రాశస్త్యమును చెప్పునప్పుడు "శ్లో||క్న్యాక్షతయోని: స్యాత్కులీనా పిత్రుమాత్రుత: | బ్రహ్మాదిషు వివాహేషు పరిణీతా యధావిధిం || సా ప్రశస్తా వరారోహా శుద్ధయోని: ప్రశస్యవే" అని బ్రాహ్మాది వివాహముల యందు కులీనురాలును పురుషసంభోగ మెరుగనిదియు ప్రశస్తురాలని వృద్ధగౌతముడును,"గృహస్థో వినీతక్రోధహర్షో గురుణానుజ్నాత: స్నాత్వా అసమానార్షా మస్పష్టమైథునాం యవీయసీం సదృశీం భార్యాం నిందేత" అని వరుడు గురువునాజ్న పొంది పురుష సంసర్గ మెరుగని తనకంటె చిన్నదానిని వివాహమాడవలయునని వసిష్టుడును, "శ్లో||అసపిండాచ యామాతు రసగోత్రాచ యా పితు||సాద్విజానాం ప్రశస్తా స్త్రీ దారక్ర్మణ్యమైథునీ" ద్విజాతులలొ మైథున మెరుగని స్త్రీ భార్యగా స్వీకరించుటకు ప్రశస్తురాలని మనువును, బ్రాహ్మ్యదివివాహములయందు పురుష సంభోగము లేని కన్నియలనే ప్రశస్తురాండ్రనుగాఁ జెప్పియున్నారు రజస్వలలు కానివారికే ద్విజాతులలో వివాహములు జరగవలెనని యీ ఋష్యాదు లుద్దేశించి యండినయెడల,వారుపయోగించిన అక్షతయోని,శుద్ధయోని,అస్పృష్టమైథునా,అను పదములన్నియు వ్యర్థములగును గదా ఇది యిటుండఁగా మనువు మెదలగువారు వ్యక్తురాండైృన స్త్రీలకు వివాహములు విధించియున్నారు."శ్లో త్రీణినవ్షాణ్యపేక్షేత కుమార్యృతుమతీసతీ ఊర్థంతుకాలాదేతస్మాద్విందేత సదృశంపతి అదీయమాన భర్తారమధిగచ్ఛేద్యది స్వయమ్ నైనఃకించిదవాస్నోతి నచయం సాధిగచ్ఛతి"అని కుమారి ఋతుమతి యైనతరువాత మూడు సంవత్సరములు వేచియుండి,తండ్రి వివాహము చేయనియెడల స్వయముగానే వరుని కోరుకోవచ్చు ననియ,ఆప్రకారముగా వరించిన స్త్రీగాని దాని భర్తగానియేవిధ మయిన పాపమును పొందరనియు,మనువు స్పష్టముగాఁ జెప్పియున్నాఁడు."త్రీణి వర్షాణ్యృతుమతీ కాంక్షేత పితృశాసనమ్ తతశ్చతుర్థేవర్షే విందేత సదృశం పతిమ్ ఋతుమతి యైనస్త్రీ మూడు సంవత్సరములు తండ్రి యాజ్ఞకయి వేచియుండి నాల్గువ సంవత్సరమున తగిన భర్తను కోరుకోవలసి నదని బోధాయమలు చెప్పియున్నారు .ఋతుత్రయ ముపాస్యైవ కన్యాకుర్యాత్స్వయంవరమ్ అని మూడుఋతువులైన తరువాత కన్య స్వయముగానే వరింపవచ్చునని విష్ణుస్మృతియందును జెప్పఁబడి యున్నది. ఇట్లు అందఱును ఋతుమతి యైన తరువాత వివాహము సంగీకరించుటయేకాక, మంచి వరుఁడు దొరకని పక్షమున నెంతికాలమయినను కన్యను వివాహము లేకయే యుంచవచ్చుననికూడ మన్వాదులు విధించి యున్నారు. "శ్లోః కామమామరణాత్తిష్ఠే ద్లృహేకన్యర్తుమత్యపి! సత్వేవైనాం ప్రయచ్ఛేత గుణహీనాయ కర్హిచిత్" అని కన్య ఋతుమతి యైనను మరణపర్యంతమును గృహముననే యుంచవలసినది కాని గుణహీనునకెన్నడును నియ్యఁగూడదని మనువును "దద్యాద్గుణవతే కన్యాంనగ్నికాం బ్రహ్మచరిణే ! అనినా గుజ్ణహీనాయా నోపరుంధ్యా ద్రజ స్వలామ్" అని కన్యను గుణవంతుడయిన బ్రహ్మచారి కియ్యవలసినదేకాని రజస్వలనైనను గుణహీనుని కియ్యకూడేదని బోధాయనులును, మఱికొందఱు ఋషులును చెప్పి యున్నారు. ఇట్టు చెప్పినను రజస్వలయైన కన్యను వివాహములేక చిరకాల మింట నుంచిన పక్షమున చోరరతియు దానిఫలములైన భ్రూణహత్యాదు లును సంభవింపవచ్చునని యెంచి కొందఱు ఋషులు రజస్వలయైన దానిని శీఘ్రముగా వివాహము చెయ్యనిపక్షమున పాపము వచ్చునని చెప్పియున్నారు. "శ్లో|| ప్రాప్తే ద్వాదశమే వర్షే య: కన్యాం నప్రయచ్చతి! మాసిమాసి రజస్వా: పితా పిబతి శోణితమ్" పండ్రెండవ సంవత్సరము వచ్చినతరువాత తండ్రి కన్యకు వివాహము చేయని పక్షమున, ప్రతిమాసమునందు నాచిన్నదాని ఋతురక్తమును పాపము చేసినట్లని యమస్మృతియందును, ఇత్యాదివచనములు కొన్ని మఱి కొన్ని చిల్లరిస్మృతులయందును గానబడుచున్నవి. మన్ వాదులు ధర్మ శార్యమునిత్తమయి కొన్ని సమయములయందు మాత్రము కొంచెము బాల్యవివాహముల కనుజ్ఞ యిచ్చి యున్నారు. "శ్లో||త్రిశద్వర్షోద్వహేత్కన్యాం హృద్యాం ద్వాదశివార్షికీమ్| ద్వ్యష్టవర్షోష్తవర్షోవా ధర్మే సీదతి సత్వరే||" ధర్మమునకు గావలసినప్పుడు ముప్పదిసంవత్సరములవాడు ఎనిమెదేండ్లదానిని వివాహ మాడవచ్చునని మనువు వ్రాసి యున్నాడు. ఇట్టిస్థలములలోతప్ప సాధారణముగా బాల్యవివాహ ములు చేయకూడదు. బాల్యవివాహములు పూర్వకాలమునందు లేవుగనుకనె యత్రిస్మృతియందు "శ్లో|| వివాహే వితతే యజ్ఞ పుట:Atibalya vivaham.pdf/23 పుట:Atibalya vivaham.pdf/24


This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.