అంటువ్యాధులు/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

అంటు వ్యాధులు.

మొదటి ప్రకరణము

అంటువ్యాధు లెవ్వి?

మశూచకము, కలరా, చలిజ్వరము, కుష్ఠరోగము (కుష్ఠువ్యాధి), సుఖరోగములు మొదలగు వ్యాధులు ఒకరి నుండి మరియొకరికి అంటుకొనునని సామాన్యముగా మన మందరము వినుచుండు విషయమే. కాని స్ఫోటకము, కలరా మొదలగునవి కొన్ని అనేకమంది కొక్కసారి మిక్కిలి వేగముతో వచ్చి ఒకరినుండి మరియొకరి కంటు తమ స్వభావమును ఎల్లరకును వెలిబుచ్చును. మరి కొన్ని వ్యాధులు ఇంత కంటే తక్కువ తీవ్రమైనవై తమ చుట్టునుండు వారలనెల్ల నంటుకొనక కొందరిని మాత్రమే, కొన్ని సందర్భములలో మాత్రమే అంటుకొనును. ఇంటిలో నొకనికి కుష్ఠరోగముగాని, క్షయవ్యాధి గాని ఉన్నయెడల, ఆవ్యాధి ఆ యింటిలో నందరకు వచ్చుటలేదు. ఏ కారణములచేత నీ వ్యాధులు కొందరను విడిచివేసి యితరులను పీడించునో ముందు తెలిసికొన గలరు. ఇట్లందరకు అంటకపోవుటచేత వాని కంటుకొను స్వభావమున్నదో లేదోయని కొందరు సందేహపడుదురు. ఇదిగాక కలరా మొదలగు కొన్ని వ్యాధులు ఇతరుల కంటిన తరువాత కొన్ని నిమిషములలోనే తమ లక్షణములను సూచించును. క్షయ మొదలగు మరికొన్ని వ్యాధులంటిన తరువాత వాని లక్షణములు బయలుపడుటకు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరములు పట్టును. ఈ కారణమును బట్టికూడ నీవ్యాధులు అంటువ్యాధులని ప్రజలు తెలిసికొనుట కంతగావీలు లేదు.

అంటువ్యాధుల కన్నిటికిని కొన్ని సామాన్య లక్షణములు అనగా పోలికలు గలవు. వీనిని బట్టి యేవి అంటువ్యాధులో యేవికావో శోధకులు గ్రహింపగలరు. అంటువ్యాధులను వ్యాపింపజేయు విత్తనములు చెట్ల విత్తనముల బోలియుండును. సెనగమొక్కలు గింజనుండి మరునాటికే మొలచును. తాటి మొక్కలు చాల దినములకుగాని బయటపడవు. ఇట్లే అంటువ్యాధుల విత్తనములు మన శరీరములో ప్రవేశించిన తరువాత వాని జాతిభేదములనుబట్టి ఆ యా వ్యాధులు బయట పడుటకు వేరువేరు కాలములు పట్టును. అంటువ్యాధుల కన్నిటికి ఒక్కొక వ్యాధిని వ్యాపింపచేయుటకు ఒక్కొక జాతి విత్తనము కలదు. వృక్షములలో వేపచెట్టు, మఱ్ఱిచెట్టు రావిచెట్టు, చింతచెట్టు, మొదలగు చెట్లకు ఒక్కొక చెట్టునకు ఒక్కొక జాతి విత్తనములు పుట్టి అవి పోయి వేరొకచోట మొలచి ఆయాజాతి చెట్లను ఎట్లు వృద్ధిచేయునో, అట్లే అంటువ్యాధులును తమ తమ విత్తనముల మూలమున వ్యాప్తిని జెందును. ఒక వ్యాధిని కలుగజేయు విత్తనము ఒక రోగి నుండి పుట్టి, అది క్రింద వివరింపబోవు నేదో యొక విధమూన మరియొక మానవుని శరీరములో జేరి తిరిగి అక్కడ పెరుగుచు అదేవ్యాధిని కలుగ జేయును. అనగా కలరా రోగినుండి పుట్టిన విత్తనములు మరియొక మానవునికి శరీరములోజేరి కలరావ్యాధినే కలిగించును. ఇట్లే మశూచకపువిత్తనము లెప్పుడును మశూచకమునే కలిగించును కాని మరియొక వ్యాధిని కలిగింప నేరవు. మామిడిటెంకను పాతిపెట్టిన చింతచెట్టు మొలచునా?

పైని చెప్పబడిన అంటువ్యాధులను కలిగించు విత్తనములు మిక్కిలి సూక్ష్మమైన పరిమాణము గలవగుటచేత వానికి సూక్ష్మజీవులని పేరు. కావున సూక్ష్మజీవుల మూలమున గలుగు వ్యాధులన్నియు అంటువ్యాధులని గ్రహింపవలెను.

ఒక వ్యాధి అంటువ్యాధి యగునా కాదా అని తెలిసికొనుటకు ఈ క్రింది 5 సూత్రములను గమనింపవలెను.

౧. ఒక వ్యాధిని పుట్టించు సూక్ష్మజీవులు అదే వ్యాధి గల రోగులందరి శరీరములయందును కనబడవలెను.

౨. ఇట్లు కనిపెట్టబడిన సూక్ష్మజీవులను మనము ప్రత్యేకముగ తీసి సాధారణముగా సూక్ష్మజీవులు తిను ఆహారము వానికి పెట్టి పెంచినయెడల అవి తిరిగి పెరగవలెను.

౩. ఇట్లు పెంచిన సూక్ష్మజీవులను వేరుపరచి వానిని సౌఖ్యముగనున్న ఇతరమానవుల శరీరములో నెక్కించినప్పుడు ఆ సూక్ష్మజీవులు క్రొత్తవాని శరీరములో మొదటి రోగికుండిన రోగచిహ్నములనన్నింటిని కనుబరచవలెను. ౪. ఈ ప్రకారము వ్యాధినిపొందిన రోగియొక్క శరీరములో ఈ సూక్ష్మజీవులను తిరిగి మనము కనిపెట్టవలెను.

౫. ఈ సూక్ష్మజీవులు తిరిగి మరియొకనికి ఇదేవ్యాధిని కలిగింప శక్తిగలవై యుండవలయును.

ఈ శోధనలన్నియు మానవులపట్లచేయుట కొక్కొకచో హానికరము కావున సాధారణముగ ఒక వ్యాధి ఇతరులకు వ్యాపించునా లేదా అని తెలిసికొనవలసివచ్చినప్పుడు మానవునకు మిక్కిలి దగ్గర కుటుంబములోచేరినకోతుల కా వ్యాధుల నంటించి శోధనలుచేయుదురు. పైని చెప్పిన శోధనప్రకారము కలరా మొదలగు అంటువ్యాధు లన్ని నిదర్శనములకు నిలచినవి కాని, కుష్ఠవ్యాధి విషయములోమాత్ర మీ శోధనలు పూర్తికాలేదు. కుష్ఠవ్యాధిగల రోగి శరీరములో నొక తరహా సూక్ష్మజీవులుండునుగాని, ఇవి క్రొత్తవారల కంటించి నప్పుడు వారికి ఈ వ్యాధి తప్పక అంటునట్లు శోధనలవలన తేలలేదు. బహుశః కుష్ఠవ్యాధి సూక్ష్మజీవి ఒకని శరీరములో ప్రవేశించిన తరువాత వ్యాధి లక్షణములు బయలుపడు వరకు పట్టుకాలము అనగా అంతర్గతకాలము అనేక సంవత్సరములేగాక రెండు మూడు తరములు కూడ ఉండునేమో యని సందేహముగ నున్నది. ఇట్లే ఇంకను కొన్ని వ్యాధుల విషయములో మధ్య మధ్య కొన్నివిషయములు తెలియకపోవుటచేత నవి అంటువ్యాధులగునో కావో అను సందేహములున్నవి.