అష్టమాధ్యాయము
143
(అన్ని వర్ణములలోను గూడ పుత్రులులేనివాని ధనమును పొందుట కీ క్రిందివారు క్రమముగ నర్హులగుచున్నారు. భార్య, కుమార్తెలు, తల్లిదండ్రులు, సోదరులు, వారి కుమారులు, సగోత్రులు, బంధువులు, శిష్యులు, సహాధ్యాయులు. ఈ క్రమములో ముందు చెప్పబడినవారు లేనపుడు తర్వాతి వారికి దాయము పొందుట కర్హత గల్గుచున్నది.)
తండ్రి చనిపోయిన పిమ్మట నాతని ధనమును కుమారులు పంచుకొనునపుడు తల్లికి కూడ కుమారులతో బాటు భాగము వచ్చునని యాజ్ఞవల్క్యుడు చెప్పుచున్నాడు.
పితురూర్థ్వం విభజతాం మాతావ్యంశం సమం హరేత్
- (యాజ్ఞ 2-127)
ఒకడు తాను జీవించియుండగనే కుమాళ్లకు భాగములు పంచుచో వారితో సమముగ తన భార్యలకు కూడ భాగముల నీయవలెను. వారిదివరలో తనవలనగాని తన తండ్రివలనగాని ధనమును పొందియున్నచో నా భాగము నిపుడు తగ్గింపవలెను.
యదికుర్యాత్సమానం శాన్పత్న్యః కార్యాస్సమాంశకాః
నదత్తం స్త్రీధనం యాసాం భర్త్రానాశ్వశురేణవా
(యాజ్ఞ 2-113)
దాయభాగముగ వచ్చిన సొత్తుగాక యింకను ననేక విధములుగ స్త్రీకి ధనము వచ్చుటకు వీలున్నది. స్మృతికారుల చేత స్త్రీధనము మొత్త మాఱువిధములుగ విభజింపబడినది.