ఈవ్యాఖ్యవ్రాయుచు నడుమ విశ్రాంతికై 'అధికమనో వ్యాపారము శక్యముకాని వేసవిదినములలో విష్ణుచిత్తీయ టీకారచనను కొంత నిలిపి, కాలయాపనకొఱకు మాళవికాగ్ని మిత్ర ఉత్తరరామచరిత్రములను అనువదించిరి. పిదప రత్నావళి విక్రమోర్వశీయముల నాంధ్రీకరించిరి. వ్యాఖ్యరచన కష్టమని తోచినప్పుడు మఱియేదేని చిన్నపుస్తకములను వ్రాయుటయో ఉపన్యాసముల నిచ్చుటయో చేయుచుండిరి. ఈకాలమున రచించినవే తిక్కనసోమయాజివిజయమును విమర్శవినోదమును.
ఆముక్తమాల్యద వ్యాఖ్యరచన తేది 24-6-1920 నాడు ప్రారంభించి తేది 28-10-20 నాటికి పూర్తిగావించిరి. కొన్నికొన్ని భాగములను ముద్రణవశమున వ్రాసికొనవచ్చును గదా యని వదలియుండిరి. నాలుగుపుటలు వచనమునకు వ్యాఖ్య తర్వాత మదరాసులో 1926 సం. మున వ్రాసినవిషయము నేనెఱుగుదును. నేను నిరంతరము తాతగారిచెంతనే యుండువాడను. ఆగదిలోనే నిద్రించువాడను. ఎప్పుడైనను నేను నిద్రమేల్కొని చూచునప్పుడు తాతగారు వ్రాయుచునే యుండువారు. రాత్రి పదుకొండు గంటలకు, అర్ధరాత్రి, రెండుగంటలయప్పుడు, తెల్లవాఱుజామున, నెప్పుడుచూచినను వ్రాయుచునేయుండిరి. వారెప్పుడు నిదురబోవువారో తెలియదు. 'అవిదితగత యామా రాత్రిరేవ వ్యరంసీత్.' తాతగారి నాటిచర్య నాకు ఇప్పుడు ఆశ్చర్యకరముగానున్నది. 'ఆముక్తమాల్య