పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు: ఎవరినిగూర్చి దుఃఖింప నావశ్యకతలేదో, వారినిగూర్చి దుఃఖించుచున్నావు. తెలిసిన వారివలె మాట్లాడుచున్నావు. చచ్చినవారికోసమును, ఉన్న వారికోసమును తెలిసినవారు దుఃఖపడరు. 2-11


నత్వేవాహం జాతు నాసం న త్వంనేమే జనాధిపాః
నచైవ న భవిష్యామస్స ర్వే వయ మతఃపరమ్.


ఇంతకు ముందు నే నెన్నడును లేకుండుటలేదు. నీవును నిక్కడనున్న రాజులునెవ్వరును నట్లే. ఇకమీద నొకనాడును మనము లేకుండ బోవుటయు నుండదు. 2-12


దేహినో౽ స్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాన్తరప్రాప్తిర్ధీర స్తత్ర నముహ్యతి.


ఆత్మ కీదేహమున నెట్లు బాల్యము, యౌవనము, ముసలితనమును గలుగుచున్నవో, అట్లే వేరొక శరీరమును జన్మమును ఏర్పడును. కావున, దీనికి ధీరుడువిచారింపనేల? 2-13


అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్
వినాశ మవ్యయ స్యాస్య న కశ్చిత్కర్తు మర్హతి.


ఈలోకములోనున్న యెల్లప్రాణుల శరీరములందును వ్యాపించి యున్న వస్తువు నాశనము కానిదని తెలిసికొనుము. దీనిని నాశనముచేయుట యెవ్వరికిని సాధ్యముకాదు. 2-17