132
కాశీమజిలీకథలు - మూడవభాగము
తండ్రి యెప్పుడేని నుంచుకొనియెనేమో అరసెదగాక అని మొదటి యుత్సాహ ముడుగ అతండు నాయొద్దకువచ్చెను. అట్టిసమయంబున నేను మాసినచీర గట్టుకొని అలంకారములు దీసిపారవైచి కన్నుల నీరుగారుచుండ నొకమూల గూర్చుండి యుంటిని.
అట్లతండు గదిలోనికివచ్చి మంచముదాపున నిలువంబడి నన్ను జూచి కాంతా! నీవెవ్వతెవు అట్లు శోకించెదవేల? విటుల జూచి వేశ్యలు పరితపింతురే నీయందు వేశ్యాధర్మ మింతయేని గనంబడకున్నదేమి? యథార్థము చెప్పుమని అడిగిన నేనతని అడుగులకు యిట్లంటి.
దేవా! రాజనగా బ్రజలకెల్ల తండ్రివంటివాడు. నీవు నాకు దండ్రివగుదువు. నీవు నన్ను మన్నింతువంటివేని నావృత్తాంతమంతయుం జెప్పెదనని దైన్యముగా వేడుకొనుటయు అతండు మేను ఝల్లుమన దల్లీ! నీవు వెఱవకుము. నిన్ను మాతగా భావించెద నీవృత్తాంతము చెప్పుమనియె.
అప్పుడు నాకు బాలు చేపువచ్చి మేను గఱుపుచెంద నా వృత్తాంతమంతయు నామూలచూడముగా వక్కాణించితిని.
అప్పుడతండు శిరఃకంపము చేయుచు గోవత్ససంవాదము నా కెఱింగించి తల్లీ నీవు వగవకుము. నీకు నేను నిజముగా బుత్రుండనే. ఈరుక్మవతి కపటము జేసి నేను బుట్టినతోడనే నన్ను దీసికొనిపోయి యూరిబయటనున్న నూతిలో బారవేసి నీతో అట్లు చెప్పియుండవచ్చును.
ఈ పట్టణపురాజు ధర్మకేతుడనువాడు ఒకనాడు విహారార్థమై అరిగి దాహము కొరకు నొకనూతిదగ్గరకు బోయెను. అందులో శిశురోదనము వినబడినదట తొంగి చూడగా నే నందుంటి. నాపైకి నెండతాకకుండ నొకసర్పము పడగ విప్పి నీడబట్టుచుండెను. దానికి వెరగుపడుచు సంతానవిహీనుడైన యారాజు తన పరిచారకులచేత నన్నుదీయించి రూపవిశేషమును మెచ్చుచు దనకు సర్పరూపుడై భగవంతుడే వీని దయచేసెనని సంతసించుచు మిగుల వైభవముతో బుత్రోత్సవము గావించి నాకు నాగదత్తుడని పేరుపెట్టి మిక్కిలి గారాబముగా గన్నవానివోలె బెంచుకొనియెను.
మొన్ననే నాకు బట్టాభిషేకముజేసి అతండు తపోవనమునకు బోయెను. ఈ వృత్తాంతము మైనమట్టుకు ప్రస్తావముగా నాకతం డెఱింగించెను. వయఃపరిమాణము లెక్కింప నీవు చెప్పినది అదియు నొక్కటియే యైనది. అదియునుంగాక గోవత్ససంవాదము దీనికి అనుకూలించియేయున్నది. ఈనిక్కువము ముందు వీరిచేతనే చెప్పించెద మనమింక కోటలోనికి బోవుదము రమ్ము మాతండ్రినిగూడ వెదకి రప్పించెదనని చెప్పి అప్పుడే నన్నిచ్చటికి దీసికొనివచ్చెను.
మఱునాడు రుక్మవతి యింటనున్న దాదులఁ గొందఱిని రప్పించి అడిగిన వాండ్రు రహస్యముగా జరిగినకథ అంతయు జెప్పిరి. నాటంగోలె నేనిందు మీరాక