యేది కవిత్వం - 1
711
పద్యమంతా వకటేప్రాసతో చెపితే మఱీగొప్పగా వుంటుందని దీన్నిబట్టేవొకపద్యం చెప్పి వున్నారు.
సీ. పాటీరభూభృ ద్వనాటీమరుద్వధూ
వీటీసుగంధమ్ము లాటిలాటి
లాటీవరాటీమరాటీకుచా౽లిప్త
పాటీరవాసనల్ మీటిమీటి
మీటీకృతోద్విరు ద్వాటీదళత్పుష్ప
కోటీపరాగంబు జూటిజూటి
జూటీభవత్కురుట్కోటీ సమాశ్లిష్ట
ధాటీవిహారంబు జాటిజాటి
గీతంకూడా యిదేధాటీలో నడిపించారు. కాని దానిలో వొకచరణంమఱిచారు. త్రిపాదిగానే వుంది. దీనిలో అంత్యనియమం లేదు గాని ముక్తపదగ్రస్తం వొకటి అధికంగా పడింది. సర్వతఃప్రాసముచ్చట సరేసరి. అర్థం వుందో? లేదో? అని సంశయించ వలసిందే! ఆయన సిద్ధాంతకౌముది సమగ్రంగా స్వహస్త లిఖితంగా వ్రాసుకొని గురుముఖతః అధ్యయనం చేసినట్టివారేకాని పుంవద్భావం వగయిరాలు యమకపుష్టికోసం వదులుకొన్నట్టు తోస్తుంది. గీతిలో వకచరణం మఱిచిపోవడంకూడా యమకబాధచేతనే. యమకాదులలో కొంత కక్కురితికి లాక్షణికులు అభ్యనుజ్ఞనైతే యిచ్చి వున్నారుగాని ఆ అభ్యనుజ్ఞ యీలాటివిషయంలో కాదు; రసపుష్టి వుండకపోవడానికి పూర్తిగా అంగీకరించారు.
“ప్రాయశో యమకే చిత్రే రసపుష్టి ర్నదృశ్యతే" ఆలాటి అభ్యనుజ్ఞ వున్నప్పటికీ వసుచరిత్ర పద్యంలో కొంత రసపుష్టికూడా వుంది. తరవాత కవులరచనలో రసపుష్టి బొత్తిగా లేదు. కాళిదాసు "ద్వైపాయన ప్రభృతి శాపాయుధత్రిదివ సోపాన ధూళిచరణా” అంటూ కాళికను స్తవంచేశాఁడు. తరవాత యెందఱో కవులు ఆయీ అశ్వధాటీవృత్తాన్నే యెత్తుకొని కొన్నిస్తవాలు నడిపించారు. ఆసొగసురాలేదు. యెందుకు రాలేదంటారా? యెందుకో రాలేదు. పరిశీలించుకోండి మీకే తెలుస్తుంది. (మేముకూడా బాల్యంలో కొంత దీని కోసం పాటుపడ్డాము "శ్లో. నాళీకజాద్యదితిజాళీ” వగైరాలు చూ.) అందుచేతనేకదా?
శ్లో. కవయః కాళిదాసాద్యాః కవయో వయ
మష్యమీ పర్వతే పరమాణౌచ పదార్థత్వం వ్యవస్థితమ్.
అన్నాఁడు వొక మహాకవి. ప్రకృతమనుసరామః మొట్టమొదట చూపిన, "లలనాజనాపాంగ" పద్యం పుట్టి యిప్పటికి మూఁడు నాలుగు శతాబ్దాలుగడిచి