710
యేది కవిత్వం - 1
అని ప్రశ్నించుకుని వ్రాయవలసివస్తే చాలామందికి కంటగించుకోవలసివస్తుంది. అంతతో సరిపోక 'త్రిదోషహరం తిప్పతీcగ' మాదిరిగా వుంది యీ నిర్ణయమనికూడా నూటికి తొంబదితొమ్మండుగురు పరిహాసం చేయడంకూడా తటస్థమవుతుంది. అట్లని యథార్థాన్ని మఱుగుపరచడం యుక్తంగా వుండదుకదా? కనుక కొంచెంగా దాన్ని గూర్చి వ్రాస్తాను.
సీ. లలనాజనాపాంగ వలనావసదనంగ
తులనాభి కాభంగ దోఃప్రసంగము.
ఆ యీ పద్యం వసుచరిత్రలో వసంతఋతువర్ణనలో వుంది. ఇది చాలా శ్రవణానందంగా కనపడడంచేత యిది కవిత్వమని గాని, యిదే కవిత్వమనిగాని చెప్పి ఆనందించేవారు కవులలో పలువురువున్నారు. నిజానికి బాగా పరిశీలిస్తే "రమణీయార్థ ప్రతిపాదక శబ్దఃకావ్యమ్" అనే పండితరాయల కావ్యత్వపరిష్కారానికి యిది వుదాహరణం కావడంలో సంశయింపవలసిన్నీ వుండదు. యే విధమైన అర్థమున్నూ లేని మృదంగాది శబ్దములే శ్రవణానందాన్ని కలిగిస్తూ వుండగా యేదో కొంత అర్థం కలిగి వున్న పైపద్యంయెందుకు శ్రవణానందజనకం కాకపోతుంది? కనక యిదే కవిత్వం అని చెప్పకపోయినా 'యిదికవిత్వం' అనేనా చెప్పడాని కభ్యంతరం వుండదు గాని కవిత్వ తత్త్వవేత్తలుమాత్రం 'యిదిన్నీ కవిత్వమే' అన్నంతవఱకు వొప్పుకుంటే వొప్పుకుంటారేమో గాని, అంతకంటె అధికగౌరవాన్ని దీనికి యివ్వరు. వారిదృష్టిలో యిది 'అధమకవిత్వం' లోకివస్తుంది. దీనిలో ద్విప్రాసచమత్కారమలా వుండఁగా ప్రతీచరణంలోను నాలుగు అంత్యప్రాసలు వున్నాయి. యీపద్యం పుట్టినతరవాత దీన్ని వరవడిగాఁ బెట్టుకొని పలువురు కవులు పలుపద్యాలు వ్రాసివున్నారు. కాని వాట్లలో దీనిలోవున్న యావత్తు శబ్దాలంకార వైచిత్ర్యమున్నూ వచ్చినట్లు లేదు. వొకటి వుదాహరించి చూపుదునా?
“ఏలాలతాజాల డోలాసమాలోల బాలామణీ గాన భాసురములు"
యిలాటివి అక్కడక్కడ చాలా వున్నాయి. యిది తారాశశాంక విజయంలోనిది. యిందులో అంత్యప్రాసా సర్వతోముఖంగా రాలేదు, ద్విప్రాసా రాలేదు. మాముత్తాతగారు