షష్ఠాంకము. 79
రంగ. - [ఱిచ్చవడియుండి] హాహాహాహా ! ఎపుడును నా యనుచరుండవుగా నుండువాఁడవు ; ఇప్పుడు నాకన్న ముందు నీవు ఎట్లు వీరస్వర్గమునకు వెళ్లితివయ్యా! హాహాహాహా ! నా యదృష్టము !
రంగ. - అన్నలారా, పడవాళ్లారా నాకుడిభుజము విఱిగిపోయినదే! ఇఁక నే మున్నది ! వెంగళ్రావు పోయిన పిమ్మట ఇంక నేమి బొబ్బిలి !
[ఫిరంగియగాదులు, నౌకరులు సంభ్రాంతులై ప్రవేశింతురు.]
నౌక. - మహాప్రభో, పరాసుల ఫిరంగిగుళ్లు వొచ్చి కోటలోనంతా పడతావున్నయి, లోగిళ్లు కూలిపోతావున్నయి. గుళ్ల దెబ్బలకి మన నౌభత్తువాళ్లు నాశమై పోయినారు. మనజెండా ఏమయిందో తెలవకుండా యెగిరిపోయినది.
[రంగారాయని మ్రోల దివాణములో ఫిరంగిగుండ్లు పడును.]
రంగ. - హాహా ! అయ్యా పెండ్లికుమారులారా, ఓబంధువులారా -
సీ. పెండ్లికై విచ్చేయఁ బిలిచికొంటిని మిమ్ము ;
నిట నిట్టు లగు నని యెఱుఁగనైతి!
దురమునకై మిమ్ముఁ దోడు వేడఁగలేదు,
దైవంబు మా కిప్డు దాయ యయ్యె.
మముఁగూర్చియే కదా మలకలు వచ్చిరి,
వారికి మీమీద వైర మేమి ?
దారికి సామగ్రి దయసేసి కైకొని
సకుటుంబముగ మీరు సాగిపొండు
ఆ. 'పెండ్లికతమున మేము బొబ్బిలికి వచ్చి
యేఁగుచున్నార' మనినఁ, బోనిత్త్రు మిమ్ము.
మిగిలియుండుఁడు నేమాన మీరలేని;
మాకొఱకు మీకు సంఘాతమరణ మేల ? ౬౮
[పెండ్లికుమారులు రాజబంధువులు అందఱు ఉగ్రవీక్షణులై నిష్క్రమింతురు.]
రంగ. - వెంకయ్యా, ఏమి ? వీరు బదులు చెప్పకయే లేచిపోయినారు ?
వెంకయ్య. - మహాప్రభూ, వారి గాంభీర్యము మీకు తెలిసినదే గదా ?
ఆ. ప్రాణ మిచ్చునట్టి బంధులు గావునఁ,
బ్రాణబంధుసంజ్ఞఁ బడసినారు ;