పుట:Bobbili yuddam natakam.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాంకము.

[రంగారాయఁడు పెండ్లికుమారులతోను, ఇతర బంధువులతోను,

దళవాయులతోను, సపరివారుఁడై నిండోలగంబుగా ప్రవేశించును.]

రంగా. - చెలికాని వెంకయ్యా, మనము బురుజు దిగి వచ్చు చున్నప్పుడు, పరాసువానిడేరాకు కొండబోటునకు నడుమ కొండంత మంట ఎగసి మాయమైనదే, అదేమి? నల్లమందు పఱపా ?

చెలికాని వెంకయ్య. - అవును మహాప్రభూ. దానిలక్షణ మట్టిదే ;

రంగా. - అచట వెంగ,ళ్రావు పోరుచుండెనా?

వెంక. - అట్టి దేమి లేనిచో ఏల నల్లమందు మారమ్మ అట్లు మండును ?

సభ్యులు. - ఈ నల్లమందు మారమ్మ ముందు ఆఁగలేక యున్నాము బాబూ !

రంగ. - మాయదృష్ట మెట్లున్నదో ?

[అంతట నల్లఁబాఱిన మానిసి యొకడు వడివడిగా,

లేచుచు పడుచు ప్రవేశించును.]

నల్లమానిసి. - దండం మహాప్రభో, దండం, యెంగళబాబు యీరస్సొర్గంయెల్లి నారు బాబూ.

రంగ. - హా ! హా ! హా ! [అని మూర్ఛిల్లి, తేరి, అరసికొని,] నీ వెవరవురా ?

నల్లమా. - నేను వారి బంటుని, జక్కణ్ణి ఖబురు చెప్పడానికి మిగిలుండ మంటే మిగిలి వచ్చినాను బాబూ.

రంగ. - మాతమ్ముడు మా కేమియు చెప్ప లేదటరా ?

జక్క. - అన్నయ్యగారు నారణయిహారం సూడరైరి గదా అన్నారు బాబూ. నేను శెప్తా నని మనివి చేసుకొన్నా.

రంగ. - ఏమిరా ఎట్లు పోరినాఁడురా నా తమ్ముఁడు ?

జక్క. - శినబాబు మొగలాయీవాళ్ల గుఱ్ఱాలని రెండువేలని సవార్లతో తెగ నఱికినారు. 1000 ఫిరంగీలవాళ్లని కూల్చి ఆఫీరంగీలు పరాసులమీదికి తిప్పించి కాల్పించినారు. అప్పటికి మిగిలిన మాతో ఆళ్ల డేరాలమీదికి వురికే తలికి నడమ నల్లమందు మారెమ్మమంటలో అందఱము మాడిపోయినాం. శినబాబూ నేను మిగిలినాము. ఆనక బుస్సీడేరాలోకి విజయరామరాజు కోసరం యెల్లి ఆయన్ని తఱుముకపోయి శినబాబు మూర్ఛపోయినారు. ఆళ్ల చేతులతో తెప్పిరిల్లి ఆళ్లు ఎంత బతిమాలుకొన్నా యినక రాజుని వొదలనని లగువు చేసిపడి యీరస్సొర్గానికి యెల్లినారు, బాబూ.

[అని సొమ్మసిల్లి కూలును. నౌకరులు వాని బయటికిం గొనిపోవుదురు.]