భూదేవికి వసుమతి, రత్నగర్భ యను నామములు గలవు గాని తనంతట వస్తువులుగాని రత్నములుగాని మనకు గొనితెచ్చి యిచ్చునంతటి కరుణాశాలినిగాదు. మఱేమన్న శ్రమించువారికేకాని యితరుల కెట్టిఫలము నొసగదు. ఈ ప్రపంచమున నణగియుండు ప్రయోజనములన్నియు శ్రమార్జితములేకాని యూరక దొరకునవికావు.
మనుష్యునకు వస్తువును సృష్టించు ప్రభావములేదు. విశ్వామిత్రునకు బిదప వడ్లు, రాగులు, లోహములు, కొయ్య మొదలగు నురువుల నుత్పత్తిజేయు బ్రహ్మతేజము గలవా డెవ్వడునులేడు. ఇక మనమహిమచే సాధ్యము లెవ్వియన వస్తువులలో లీనమైయుండు స్వాభావికశక్తులను ఉచితరీతి నడచునట్లుచేసి యందలి ప్రయోజనమును వెలిపుచ్చి వినియోగ్యములుగా జేయుటయే. దీనికి దృష్టాంతము. సేద్యమననేమి? స్వభావసిద్ధములైన నీళ్ళు, నేల, విత్తనములు వీనిని తావుమార్చి యొకతీరున నుండునట్లు జేయుటయేకదా! పయిరు మొలకెత్తి పెరిగి పంటకువచ్చుట ప్రకృతశక్తుల వలనగాని మనశక్తులచేగాదు. బల్లలుచేయుట యనగానేమి? మనుజ కృత్యముగాని కొయ్యలనుకోసి, తుండ్లుగా ఖండించి యొకవిధముగా జేర్చుట. వస్తుకోటిలో నంతర్యామిగానుండు ఆకర్షణశక్తిచే నవి కలసినట్లుండును. అగ్నిజలవాయువిద్యుదాదుల గుణమ్ములు మన కనుగుణమ్ములుగ జేయుటయే మనుజుల ప్రభావము. వస్తువుల రూపములను తావులను మార్చుటయే కార్యసిద్ధికి నియతవిధానము.
నైసర్గిక స్వభావములు
నైసర్గిక స్వభావము ప్రతివాని స్వంతమగు ఆస్తిలో జేరినదికాదు. అయినను పదార్థములయొక్కయు జనసమాజములయొక్కయు నిర్ధారణవలన దేశైశ్వర్యస్థితిని నిర్ణయించు కారణములలో నొకటిగా నున్నది. దేశములో నుత్పత్తియయి వ్యవహారములచే దయారుచేయబడుట కుపయోగించు సస్యములు, లోహములు, జంతువులు మొద