పుట:Andhrula Charitramu Part-1.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములలో నెనిమిది నెలలు పరిపాలించినతరువాత తాళరాజు కొడుకయిన యుద్ధమల్లుడీతని జంపిరాజ్యమును గైకొనియెను.

యుద్ధమల్లుడు.

(క్రీ,శ. 927 మొదలుకొని 934 వఱకు.)

ఈ రెండవ యుద్ధమల్లుడు తాళరాజు కొడుకు. ఇతడు 927 మొదలుకొని 934 వ సంవత్సరము వఱకు నేడు సంవత్సరములు పరిపాలనము చేసిన తరువాత నాలవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడయిన చాళుక్యభీమునిచే జయింపబడి సింహసనమునుండి దొలగింపబడియెను.

రెండవ చాళుక్య భీమ విష్ణువర్ధనుడు

(క్రీ,శ. 934 మొదలుకొని 945 వఱకు.)

ఇతడు నాలవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుడు. అమ్మరాజవిష్ణువర్ధనుని సవతితమ్ముడు. వీనికి గండమహేంద్రుడు, రాజమార్తాండుడు నను బిరుదునామములుగలవు. చాళుక్య భీముడని పిలువంబడిన వారిలో రెండవవాడుగను విష్ణువర్ధనుడని పిలువబడిన వారిలో నెనిమిదవవాడుగ నుండెను. ఇతడు తాళరాజు కొడుకగు రెండవ యుద్ధమల్లుని చోళరాజైన లోనబిక్కిని, రాష్ట్రకూటరాజయిన యైదవ గోవిందరాజును జయించి 934 మొదలుకొని 945వఱకు రాజ్యపరిపాలనము చేసెను. గోదావరిమండలములోని సామర్లకోటకు జేరియుండిన భీమవరమీతని పేరటనే గట్టబడినందున జాళుక్య భీమవరమని శాసనములందు బేర్కొనబడినది. ఇతడు చోడులను రాష్ట్రకూటులను మాత్రమేగాక గాంగరాజగు ఎఱ్ఱపరాజుతో యుద్ధముచేసిగాంగులనుగూడ నోడించెను. వీని పేరిటి శాసనములు మూడుగానవచ్చుచున్నవి. పగుణవారవిషయములోని దిగ్గుబఱ్ఱు (దిగుమఱ్ఱు) గ్రామమును బ్రాహ్మణులకు దానము చేసెను. మఱియు నుత్తరాయన సంక్రాంతి సమయమున గుద్రవారవిషయములోని ఆకులమన్నాడు గ్రామములోని కొంతభూమిని దానము చేసినట్లు మఱియొక శాసనముగలదు.