రాజ్యము విషయములుగను (Provinces) నాడులుగను (Districts) విభజింపబడి వేఱ్వేఱు పరిపాలకులచే బరిపాలింపబడుచుండెను. వీని పరిపాలనము చక్కని కట్టుదిట్టములయిన చట్టములుగలిగి నిరంకుశముగ సాగుచుండెనని శాసనములె వేనోళ్ల జాటుచున్నవి. వీనికాలమునందు దక్షిణ హిందూస్తానము నాత్రేయ, హారిత, భారద్వాజ, కౌశిక, కాశ్యప వాత్స్య మొదలగు గోత్రముల బ్రాహ్మణులు సర్వమాన్యభూముల ననుభవించుచు నగ్రహారములలో సంఘములుగా నివసించుచుండిరనియు, వీరలు కేవలము వైదిక వృత్తులను మాత్రమే గాక లౌకికవృత్తులనుగూడ నవలంబించుచుండిరని వీని శాసనములు రూఢిపఱచుచున్నవి, ఈకాలమునందు ప్రజల మత మెట్టిదయినను రాజు మతము స్పష్టముగ గానబడుచున్నది. అశ్వమేధాది క్రతువులను జేయుటయు, బ్రాహ్మణుల కగ్రహారములు మొదలగునవిచ్చి సమ్మానించుటయు, భారద్వాజ గోత్రుడనని చెప్పుకొనుటయు, తననామమునకు జివర వర్మయను క్షత్రియ సంజ్ఞందెలుపు శబ్దమును జేర్చుకొనుటయు, బ్రాహ్మణులను మంత్రులుగాను, మంత్రాలోచన సభ్యులుగ నుంచుకొనుటయు జూడగ నీతడు బ్రాహ్మణ మతావలంబికుడని గాని బ్రాహ్మణుమతాభిమాని యనికాని చెప్పదగును. జైన బౌద్ధమతములను ద్వేషభావముతో జూచినట్లుగ శాసనముల యందెచ్చటను గానరాదు. అయిన నా కాలమున జైన బౌద్ధమతములే విశేషముగా వ్యాపించి యుండుటం జేసి పరమతావలంబకులయిన రాజులంతగా ద్వేషభావమున జూపజాలకుందురు. ఆంధ్రదేశమున బల్లవరాజుల పాలనముతో గ్రొత్తయుగము ప్రారంభమైనదని చెప్పవచ్చును. బ్రాహ్మణుల యాధిక్యత పెంపొందినతోడనే ప్రజలలో గూడ జాతిభేదములు పెక్కు లేర్పడుచు వచ్చినవని చెప్పవచ్చును. అప్పటికప్పుడే యనాగరికులయి న యాదిమనివాసులను మిశ్రజాతులవారు మిక్కిలి తక్కువగ జూడ నారంభించిరి. మఱియు నాకాలమున గాంచీపురము వేదాధ్యయన సంపన్నులయిన బ్రాహ్మణోత్తముల యాదరముచే సంస్కృత భాషాభ్యాసము శతవిధంబుల నభివృద్ధి గాంచుచు విద్యలకు బెన్ని ధానమై యొప్పుచుండెను.