పుట:సత్యశోధన.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

169

వచ్చారు. ముందు వాటికి అలవాటు పడడం ఎంత కష్టమైందో, అలవాటు అయిన తరువాత వాటిని విడనాడటం కూడా అంతే కష్టమైంది. ఈ నాగరికతా వ్యామోహమనే కుబుసాన్నుండి బయటపడ్డ తరువాత ఎంతో బరువు తగ్గినట్లు అంతా భావించాము.

ఓడమీద ఎక్కడికైనా నేను వెళ్ళవచ్చు. అట్టి స్వేచ్ఛ నాకు లభించింది. ఓడ ఏ రేవులోనూ ఆగకుండా తిన్నగా నేటాలు పోతున్నది. కనుక ప్రయాణం 18 రోజులేనని తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో మేము ఒడ్డుకు చేరబోతుండగా రాబోయే తుపానుకు చిహ్నంగా, ముందుగా సముద్రంలో పెద్ద తుపాను ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో డిసెంబరు నందు వేసవి కాలం వస్తుంది. వానలు కూడా కురుస్తూవుంటాయి. ఆ కారణం వల్ల చిన్న, పెద్ద తుపాన్లు, వానలు తప్పవన్నమాట. కాని ఈ తుపాను ఎక్కువ రోజులు వీచడం వల్ల యాత్రీకులకు చాలా యిబ్బందులు కలిగాయి.

అదొక విచిత్ర మైన దృశ్యం. ఆపద సమయంలో జనం ఏకమైనారు. భేదబుద్ధి నశించింది. ఒక్క భగవంతుణ్ణే అంతా స్మరించడం ప్రారంభించారు. హిందువులు, మహమ్మదీయులు అంతా హృదయ పూర్తిగా దేవుణ్ణి స్మరించసాగారు. కొందరు ముడుపులు కట్టారు. కెప్టెను యాత్రికుల మధ్యకు వచ్చి “ఈ తుపాను పెద్దదే అయినా పరవాలేదు. నేను యింత కంటే పెద్ద తుపాన్లు చూచాను. ఓడ గట్టిదే. మునిగిపోదు. భయపడవద్దు” అని చెప్పాడు. కాని దాని వల్ల ఎవ్వరికీ ధైర్యం కలగలేదు. త్వరలోనే ఓడ చిన్నాభిన్నమైపోతున్నట్లు పెద్దగా ధ్వనులు వినబడసాగాయి. ఓడ తిరగబడిపోతున్నట్లుగా సముద్రపు కెరటాల్లో ఊగసాగింది. డెక్కు మీద ఎంతో భీభత్సంగా వున్నది. ఎవరినోట విన్నా ‘దైవస్మరణే’

ఈ స్థితి 24 గంటల సేపు వున్నదని గుర్తు. ఆ తరువాత కారు మబ్బులు విడిపోయాయి. సూర్యదర్శనం అయింది. తుపాను తొలగిపోయిందని కెప్టెను ప్రకటించాడు. యాత్రికుల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అపాయం తగ్గిపోయినట్లే భగవన్నామస్మరణ కూడా తగ్గిపోయింది. మృత్యుభయం తొలగిపోయింది కదా! తిరిగి మాయ అందరినీ ఆవరించిందన్నమాట. నమాజులు ప్రారంభమైనాయి. భజనలు కూడా జరుగుతూ వున్నాయి. కానీ వీటిలో తుపాను సమయంలో గల ఏకాగ్రత లేదు.

ఈ తుపాను కారణంగా యాత్రీకులందరితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. నాకు తుపానంటే భయం కలగలేదు. భయం కలిగినా అది బహుతక్కువే. అటువంటి తుపాన్లు అదివరకు చాలా చూచాను. సముద్రయానంలో జబ్బుపడను. అందువల్ల