పీఠిక
"శ్రీనివాసవిలాససేవధి " యనునది ఆంధ్రదేశమునందలి ప్రసిద్ధపుణ్యక్షేత్రమగు తిరుపతి కొండపై నెలకొని శ్రీనివాసులని పేరుగన్న వేంకటాచలపతి విలాసములను విహారలీలలను వర్ణించు నొక చక్కని ద్విపదకావ్యము. ఆ దేవుని విలాసకథలకిది యొకనిధి. ఇది శ్రీ వేంకటాచలపతియే స్వయముగాగోరి శ్రేష్ఠలూరి వేంకటార్యుఁడను కవిచే రచింపించుకొని తాను కృతిగొన్న కావ్యములలో నొకటి. వెంకటవీరరాఘవ అనునది యీతని పూర్తిపేరయినట్లు బ్రౌనుదొరగారువ్రాసికొన్నదానినిబట్టి తెలియవచ్చుచున్నదిగాని, యా పేరీతని గురువగు అన్నావి అప్పలాచార్యులపేరుగాఁ గనఁబడుచున్నది. బ్రౌనుదొరగారది యీతనిపేరే అని పొరబడియుండవచ్చును.
వేంకటార్యుఁడను నీ కవి భారద్వాజగోత్రుఁడు. ఆపస్తంబసూత్రుఁడు.
“అష్టభాషా కవిత్వార్జిత ప్రోద్య
దష్టావధాన విఖ్యాత బైరదుడు
శ్రీ కృష్ణయార్య లక్ష్మీగర్భవార్థి
రాకాసుధానిధి రాజపూజితుఁడు
వివిధ విద్యాశాలి వేకటార్యుండు"
అగునీతఁడు కావ్యరచనాభిలాషియై యుండగా శ్రీ వేంకటేశ్వరు లాతనికి స్వప్నమునఁ గానుపించి,
"గరిమ నీక్షించి, యో కవివర్య మున్ను
ధర సంస్కృతప్రాకృతముఖ భాషలను