పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలంప నాక్షణంబ కర్మసాక్షి లక్షదుర్నిరీక్షం బైనకౌక్షేయకంబు సాక్షాత్కరిం
చినం గైకొని రూక్షకటాక్షేక్షణుం డై సమక్షస్థితస్వరంబుశిరంబు ఖండించిన
నది నారికేళఫలాకారంబునుం బ్రధానబృహదశధావృతంబునై విజృంభించినం గని
కృపాణంబునం దిలప్రమాణంబుగా నఱకిన దశాంశోనం బయ్యు నహంకరించె
నదియునుం దునిమినం బదియవపాలు నిల్చి యేన భూతాది నని పలుక నలుక నేఁ
బది రెండవభాగంబు చిక్కం జక్కడంచె నదియు స్వావకాశఃస్వావకాశ యని
మ్రోయ రోయక వ్రేయుటయుం బదియవభాగంబు శేషించి కంపయామి యని
ఘోషింప రోషంబున నదియును విదళించిన సౌమ్యంబు సూక్ష్మంబు నైనతేజంబు
గానంబడియె నదియు మథియింపం దదనంతరంబ.

22


గీ.

భూరుహంబు పొరలు పొరలుగఁ జెక్కినఁ, గాన వచ్చు చేవకరణిఁ గానఁ
బడియె నప్పుడు పశుపాలుండు ద్రసరేణు, మూర్తితోడ సుతుఁడు మోదమంద.

23


క.

ధరణీనాయక యేత, త్స్వరము శరీరప్రవృత్తి తచ్ఛిరము నివృ
త్తి రహస్య మీకథ చరా, చరసృష్టికి మొదలు బోధసంపద నొసఁగున్.

24


మహాస్రగ్ధర.

అనినం భద్రాశ్వుఁ డాసంయమిపతికి మహాత్మా పరిజ్ఞాన మేదే
వునిఁ గొల్వం గల్గు నీజీవుల కనుడుఁ జతుర్వ్యూహుఁ బక్షీంద్రవాహున్
వనజాక్షుం గొల్వ భయార్ణవతరణి పరిజ్ఞానసౌఖ్యంబు లబ్బున్
జననాథోత్తంస యీప్రశ్నమునకు నితిహాసం బెఱిఁగింతు నీకున్.

25


సీ.

భవదూరపథమునఁ బరమభాగవతులమూఁకలు నడపించు మొత్తగాఁడు
ప్రోడయై నూఱుతంత్రులవీణ వాయించు సరిలేనిజగజెట్టిజంత్రగాఁడు
పూసిగొండితనానఁ బోయి యెవ్వరి కైన గొడవలు గావించుకొండెగాఁడు
గానప్రభావాఢ్యు లైనతుంబురుపర్వతులతోడికూరిమిచెలిమికాఁడు
ప్రబలసంసార మనులేమి బడలి తన్ను, వేఁడువారల కెల్లను విష్ణుభక్తి
సారదీనారదుఁడు తనుచ్ఛవిగుళుచ్ఛ, ధుతశరన్నారదుఁడు నారదుండు మున్ను.

26


క.

మానససరోవరమునకుఁ, దానం బాడంగఁ బోయి దరహాసవికా
సాననయానవిలాసధు, రానతసారసల నప్సరసలం గనియెన్.

27


శా.

ఆరామామణు లందఱున్ మహతికాయల్ మంజుశింజానతం
త్రీరావంబులచే నిజస్తనములన్ దీపింప లీలాగతిన్
జేరన్ వచ్చి మునీంద్ర మాకు నెపుడు జేతోభవుం గన్నయొ
య్యారిన్ శౌరి వరించువేడుకలు మల్లాడున్ మనోవీథులన్.

28