పుట:భాస్కరరామాయణము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెక్కిన రాజ్యసంపదల నిక్కడ డించి సురేంద్రపుత్ర నీ
వెక్కడఁ బోయె దొక్కఁడవు నే నెటు పాయుదు నింక వల్లభా.

362


వ.

ఏ నెన్నివిధంబుల నిన్నుం బాయఁజాల నంగదుని మిత్రామాత్యభృత్యవర్గంబును
వీడుకొలుపు మీ యభిరామారామంబుల నీవును నేనును రతిలీలలం దేలుద మ
నుచు బహుప్రకారంబులం బలవించునత్తారను వానరస్త్రీలు దొలంగం గొని
పోవ నప్పుడు సుగ్రీవాంగదులు వాలిం జితిమీఁదఁ బెట్టి యుక్తక్రమంబున
దహించి బంధుమిత్రామాత్యభృత్యవర్గంబులతోడ వాలిపూర్వపరాక్రమంబు
లుగ్గడించుచుఁ బంపాసరోవరంబున కేఁగి కృతస్నాను లయి యార్ద్రవస్త్రంబుల
తోడఁ దిలోదకవిధానంబు లాచరించి రామచంద్రుపాలికిం జనుదెంచిన రాముండు
వారి నూరార్చి పురంబున కరిగి వాలికి దశాహతంత్రంబులుఁ బారలౌకికాదికృత్యం
బులు నడపు మనిన సుగ్రీవుండు రాఘవానుమతి నట్ల చేసి పూతస్నాతుం డయి
యంగదుండును దానును నఖిలవానరపుంగవులును భయభక్తులతో రఘుపుంగవు
పాలి కేతెంచి దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచికొని బ్రహ్మ
ముందటిఋషులునుంబోలె నుండి రాసమయంబున.

363


క.

బాలార్కముఖుఁడు గాంచన, శైలసమాంగుండు వాక్యచతురుఁడు నగువా
తూలతనూజుఁడు రఘుభూ, పాలున కిట్లనియెఁ బ్రీతిఁ బ్రాంజలి యగుచున్.

364


శా.

శుష్కారీంధనదావపావక రఘుక్షోణీశ నీప్రాపునం
గిష్కింధాపురరాజ్యముం బడసె సుగ్రీవుండు లక్ష్మీశుభా
విష్కారం బెసఁగన్ సమస్తకపులున్ వే గొల్వ నుగ్రాంశురో
చిష్ణుం డై విలసిల్ల నర్హపదుఁ డై చెన్నారుచున్నాఁ డిలన్.

365


మ.

కృతనిష్ఠం బరలోకసత్క్రియలు భక్తిన్ వాలికిం జేసి స
మ్మతి సుగ్రీవుఁడు మంత్రతంత్రములఁ బూతస్నాతుఁ డైనాఁడు త
త్పితృపైతామహ మైనరాజ్యమునకుం బెంపొంద లక్ష్మీసమ
న్వితుఁగాఁ బట్టముగట్ట నిచ్చఁ బురికిన్ విచ్చేయు భూనాయకా.

366


వ.

అని హనుమంతుండు పల్కిన రామచంద్రుండు సుగ్రీవున కి ట్లనియె.

367


మ.

జనకాజ్ఞం బదునాలుగేండ్లు చన నికష్ఠం గానలం దుండి యొ
ప్పున మీఁదన్ మఱి కాని గ్రామనగరంబుల్ దూఱ నీ వింక శో
భన మందం బురి కేఁగి పౌరు లలరం బట్టాభిషిక్తుండ వై
సునయం బారఁగ నర్కపుత్ర యువరాజుం జేయుమీ యంగదున్.

368


క.

పోలంగ వానకాలము, నాలుగుమాసములు గడచకనక శత్రుని ని
ర్మూలము సేయఁగఁ బయిఁ జనఁ, గాలము గా దింకఁ గార్తిక మ్మగుదాకన్.

369


క.

సరసిజకువలయపరిమళ, భరితామలసలిలయుతయుఁ బరిహృతపవన
త్వరయు నగునీగిరిస్ఫుర, దురుగుహ లక్ష్మణుఁడు నేను నుండెద మెలమిన్.

370