పుట:భాస్కరరామాయణము.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆజి న్నీ వీల్గిన నిను, రాజశ్రీ వాయ దనఘ రాజిల్లెడు నం
భోజాప్తుఁ డస్తమించిన, రాజితకనకాచలంబుప్రభయుం బోలెన్.

354


ఉ.

ఇక్కడఁ బ్రాణముల్ విడిచి యే దివి కేఁగడునిన్ను వెన్కొనన్
నిక్కము నీవు నన్ విడిచి నీకృతపుణ్యఫలానుభూతి కిం
పెక్కినయన్యలోకముల కేఁగిన నక్కడ నిట్టు లొంటిమైఁ
జిక్కఁ గదయ్య నన్నుఁ గృపఁ జేకొని పాయక యుండుదే యటన్.

355


క.

నీవు నను డించిపోయిన, నీవెంటనె నన్నుఁ బాసి నినుఁ బొందెను నా
లావణ్యశుభశ్రీ లటు, గావున ననుఁ బాయఁ జనదు కపికులవర్యా.

356


ఉ.

ఇన్నివిధంబులం బిలువ నే మన వాదటఁ జూడ
వప్రియం
బెన్నఁడుఁ జేయ నీకు హిత నే నయి యుండుదుఁ దప్పు గల్గినన్
నన్ను క్షమింపు నాథ సురనాథతనూభవ యింక వేగ మ
త్యున్నతపుణ్యు లొందెడుసదుత్తమలోకముఁ బొందు సమ్మతిన్.

357


వ.

అని యి ట్లనేకప్రకారంబులం దార విలపించుచున్న సమయంబున.

358


క.

వాలి మృతుఁ డవుట పోలఁగ, నాలో లక్ష్మణుఁ డెఱింగి యర్కజుతోడన్
బాలుఁడువోలెం దాలిమి, మాలితి విది యేమి యకట మఱిఁగెద వింకన్.

359

సుగ్రీవుఁడు వాలికి దహనాదికృత్యంబు లాచరించుట

క.

తారాంగదులకు శోకము, వారింపుము వారు నీవు వాలి దహింపుం
డారఁగ నీపురి నేయియు, భూరీంధనవస్త్రగంధపుష్పచయాదుల్.

360


వ.

వేవేగ మఱియు వలసినయవి దెప్పింపు మనుచు హనుమంతుం జూచి పావనీ
నీవు వివిధవస్త్రమాల్యఘృతతైలాదిసమస్తవస్తువు లెల్లఁ దెమ్ము తారుండ నీవు
శీఘ్రంబ శుభశిబికం గొనిరమ్ము ఘనుం డయిన వాలిని మోవంజాలులావరు లగు
మేటివానరు లాయత్తపడుం డని పలుకం దన్నియోగంబునఁ దారుండు గుహ
సొచ్చి శిబిక గొని వేగ మేతేర నప్పుడు వాలిని వస్త్రగంధమాల్యభూషణాలం
కృతుం జేసి యధికదుఃఖంబున శోకించుచు సుగ్రీవాంగదు లాకపీంద్రు నెత్తి
కొని తెచ్చి శిబికయందుఁ బెట్టి కొనిపోవుచు నడుమ భూమిని శిబిక యుక్త
క్రమంబున డించి యెత్తికొనుచు నంగదసహిత లై తారాదికాంతలు రోదనం
బులు సేయ సుగ్రీవుండును సకలభృత్యామాత్యులు సడలఁ దదీయరోదనధ్వా
నంబు లాకర్ణించి సకలవానరస్త్రీలు గుహలెల్లఁ జెలంగ నధికాక్రందనంబులు
సేయ విహితక్రమంబున వాలివిమానంబు గొనిపోయి పర్వతావృతం బయిన
గిరినదీపులినంబున శుద్ధకాంతస్థలంబున శిబిక డించి రప్పు డాతార పతిం జూచి
యవ్వాలిమస్తకంబు దనతొడలమీఁద నిడికొని యధికదుఃఖంబున.

361


ఉ.

అక్కట నన్ను నీసుతుని నంగదు నీప్రియ లైనకాంతలం
దక్కినబంధుమిత్రులఁ బ్రధానుల భృత్యులఁ బట్టణంబుఁ బెం