పుట:భాస్కరరామాయణము.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డెత్తెరు వేఁగె నత్తెరువ యిష్టము పో మన కంచు నుండఁగన్.

30


క.

కనుఁగొని జానకి దానవు, ఘనబలమునఁ జిక్కి రనుచుఁ గాకుత్స్థునిఁ ద
మ్మునిఁ బనవి యధికశోకం, బున మూర్ఛిల్లుటయుఁ జూచి పొగు లొదవి వెసన్.

31


స్ర.

సంభూతక్రోధఘోరజ్వలనపరిగతస్వాంతు లై విస్ఫురత్సం
రంభం బేపార రామప్రభుఁడు ననుజుఁడున్ రాక్షసాధీశుబాహు
స్తంభంబుల్ ద్రుంచి ఖడ్గోద్గతరుచు లెసఁగన్ దాఁటి రవ్వైరి గూలెన్
శుంభద్దంభోళిధారాచ్యుతవిపులగురుక్షోణిభృత్పాతభాతిన్.

32


వ.

ఇవ్విధంబునం గూలియు ననేకజంతువులతోడం గూడ నచ్చేరువ భూరుహంబు
లును బొదలును జదియం బొరలునయ్యసురం బొలియింపమి కర్జంబు గా దని
కదిసి నిర్ఘాతపాతవజ్రప్రహారంబులంబోనిపిడికిళ్లను జానుకూర్పరఘాతంబులను
నొప్పించినం బ్రాణవ్యయసమయంబున వాఁడు తలయెత్తి రఘునందనుఁ గనుఁ
గొని పేరెలుంగున మీ రెవ్వ రెచ్చోటి కరుగుచున్నవారు నావుడు నన్నరేం
ద్రుం డేము సూర్యకులవరేణ్యుం డగుదశరధునితనయులము రామలక్ష్మణు లను
వార మని చెప్పి నీ వెవ్వండ విట్లు ఘోరాకారంబు గైకొని యీమహారణ్యం
బునం జరియింపఁ గారణం బేమి మా కెఱింగింపు మనిన నారాక్షనుం డి ట్లనియె.

33


క.

జననాథ యేను దుంబురుఁ, డనుగంధర్వుఁడను రంభ కనురక్తుఁడ నై
యెనసి తనుఁ గొలువ మఱచిన, ధనదుఁడు శపియించె నంతఁ దను విది యయ్యెన్.

34


మ.

పటుశాపాహతి యస్మదీశుఁడు భవద్బాణంబు ప్రాణంబు లొ
క్కొటఁ దూలించిననాఁడు గల్గు ననుచుం గోపోపశాంతిం బరి
స్ఫుటనాదంబునఁ బల్కినాఁ డది రఘుక్షోణీశ సిద్దించె నా
గ్రమ్మఱ దీనిమిత్తమున గంధర్వత్వముం బొందెదన్.

35


చ.

ఇచటికి సార్ధయోజనసమీపమునన్ శరభంగుఁ డున్నవాఁ
డచలతపోవిభూతి గలయమ్మునిముఖ్యుఁడు గారవించి మి
మ్ముచితవిధంబులం బ్రియము లొందఁగ జేయుఁ దదాశ్రమంబునం
బ్రచురకుతూహలంబు జనపాలతనూభవ మీకుఁ జేకుఱున్.

36


ఉ.

ఏను మదీయలోకమున కేఁగెద నింక నరేంద్రచంద్ర యీ
మే నధికప్రయత్నమున మేదిని నొక్కెడఁ బాఁతిపెట్టఁగా
నానతి యిమ్ము లక్ష్మణుని కంచుఁ గరంబులు మోడ్చి మ్రొక్కుచున్
ఫేనిలరక్తపూరములు పెల్లుగ ముక్కున నోరఁ గ్రక్కుచున్.

37


శా.

రక్షోదేహము వీడి తుంబురుఁడు పూర్వస్థానముం బొంద రా
మక్షోణీపతిపన్పునన్ వనమహీమధ్యంబునం దొక్కచోఁ
నిక్షేపించె వృకాదిసత్త్వములకు న్భేదింప రాకుండఁ ద
ద్రక్షాగాధకృతావటంబున సుమిత్రాపుత్రుఁ డగ్గాత్రమున్.

38