పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


పత్రికలను నిర్వహించిన భారతీయులలో హరిశ్చంద్ర ముఖర్జీ ప్రధానుడు. హరిశ్చంద్రముఖర్జీ 1824లో జన్మించెను. ఈతడు ఇంగ్లీషునేర్చి దేశస్థితిగతులనుగూర్చి ఆనాటి వార్తాపత్రికలకు వ్రాయసాగెను. 1853లో కలకత్తా నగరవాసులు తూర్పుఇండియాకంపెనీ డైరెక్టర్లకు పంపిన మహజరును వ్రాసిన దితడే. 1854 లో కలకత్తాలో “హిందూ పేట్రియటు" స్థాపింపబడగా నీతడు దానికి విలేఖరియై తరువాత సంపాదకుడై అతి సమర్థతతో నడుపసాగెను. ఈతడు సంఘసంస్కర్తయై స్త్రీ పునర్వివాహములవిషయమున ఈశ్వరచంద్రవిద్యాసాగరులకు సహాయము చేయసాగెను. ఆ నాటి గవర్నరుజనరలగు డల్ హౌసీ ప్రభువు, వంశపారంపర్యముగా నేలుచుండిన స్వదేశరాజు లనేకులను పద భ్రష్టులజేసి వారి రాజ్యములను కలుపుకొనుచుండగా చూచి హరిశ్చంద్ర ముఖర్జీ ఈ అన్యాయమునుగూర్చి పలుమారు నిర్భయముగా విమర్శించెను. తరువాత వచ్చిన సిపాయి విప్లవము నణచుట కాంగ్లేయులు చేసిన దౌర్జన్యములను, తీసుకొనదలచిన చర్యలను, నిరసించి ఆంగ్లేయులకు, సిపాయీలకును గల మనస్పర్ధలను తొలగించుటకు నితడు పాటుపడెను. బంగాళాదేశమున దొరలు నీలిమందుల తోటలువేయించి అమితలాభములు పొందుచు రైతులను బాధించుచుండగా బాధలు దుర్భరములై రైతులు తిరుగుబాటుచేసిరి. అప్పుడు ఇంగ్లీషు యజమానులు వారిని హింసించుటయు వారిని కోర్టులో దింపి బాధించుటయు జూచి ఈయన రైతులకు భోజనముకూడ పెట్టి అర్జీలువ్రాసి ప్లీడర్ల చేత సహాయముచేయించెను. నీలి