పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


వంగరాష్ట్రమున స్వేచ్ఛగా వ్యాపారముచేయు హక్కును పొంది ఔరంగజేబు సుంకములు హెచ్చుచేయక పూర్వము నూటికి రెండు చొప్పున సుంకము చెల్లించు పద్ధతిని సూరతులో కంపెనీకిగల ప్రాతహక్కును క్రొత్తఫర్మానా ద్వారా స్థిరపర్పించుకొనిరి. సూరతులో భూములు కౌలుకు పొందు హక్కునే గాక విక్రయముపొందు హక్కును సంపాదించిరి. కలకత్తా దగ్గర రెండూళ్ళను కౌలు పొందుటకు వీలుగలిగెను. మద్రాసుదగ్గర నైదుగ్రామములనుండి నవాబు వీరిని 1711లో బలవంతముగా వెళ్ళగొట్టగా అప్పుడు మరల 1708 లో పొందిన దానశాసనమును స్థిరపరచుకొనిరి. ఈ ఫర్మానా సంపాదించినందులకు ఆంగ్లేయులు పరమానందము బొంది సంతోష సూచకముగా ఫిరంగులు ప్రేల్చిరి.

II

మద్రాసు వర్తకస్థానమునకు గవర్నరుగా పనిచేసిన తామస్‌పిట్టుయొక్క చరిత్రవలన నా రోజులలో ప్రతివానికి నిండియాకువచ్చి త్వరగా ధనమార్జించు టెంతసులభమో తెలియును. ఇతడు వేటకాడుగా జీవితము ప్రారంభించినాడు. సైన్యములో కెప్టెన్ స్థానము పొందినాడు. ఆనాటికంపెనీ డైరెక్టర్ల నాశ్రయించి సులభముగా పెద్దయుద్యోగి యైనాడు. ఆ రోజులలో డబ్బుగలవా రందరు ఇంగ్లాండు పార్లమెంటులో సభ్యత్వస్థానములు సంపాదింప గలుగుచుండిరి. 1689 లోను 1691 లోను నిట్టి బేచీరాకు గ్రామములకు సభ్యత్వము సంపాదించినాడు.