పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదోత్పత్తి

శ్రుతులు అనంతాలని గతంలో పేర్కొనడం జరిగింది. అనంతాలైన శ్రుతులకు చతుర్విధాలుగా విభజనను, చతుర్ముఖుడైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకొని విభజించి వుండవచ్చు. వాస్తవానికి వేదాల సృష్టికర్త బ్రహ్మకాడు. బ్రహ్మకు వేదాలను అమూలాగ్రం నేర్పినవాడు, వేదవిజ్ఞానాన్ని ప్రసాదించినవాడు శ్రీమహావిష్ణువు. అనేక సందర్భాలలో వేదవిజ్ఞానాన్ని రాక్షసులు అపహరించినపుడు సృష్టినిర్మాణంలో బ్రహ్మ అశక్తుడు కాగా మహావిష్ణువు వివిధ అవతారాలెత్తి వేదాలను అపహరించిన, ఆ రాక్షసులను సంహరించి, వేదాలను తీసుకొనివచ్చి బ్రహ్మకు తిరిగి వేదజ్ఞానభిక్షను పెట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. బ్రహ్మకు వేదాలను శ్రీ మహావిష్ణువే బోధించాడన్న విషయాన్ని ప్రస్తుత నారదీయపురాణంలో "శ్రీహరి నాభికమలమునఁ జతుర్ముఖ బ్రహ్మ ముదయించిన" అనంతరఘట్టంలో "ప్రణవంబునకుఁ గారణం బకారం, బకారంబున కర్థంబు పరబ్రహ్మంబగు నారాయణపదంబు. ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం జూచి భగవంతుండు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁజేసె." (నార. 97. పుట. 18 వచనం.) అని విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. అనంతుడైన విష్ణువు సృష్టించిన వేదాలకు అంతత్వ మెక్కడిది? కాగా చతుర్విధాలుగా వేదాలను విభజించడం చతుర్ముఖుడైన బ్రహ్మను దృష్టిలో పెట్టుకొని జరిగివుంటుంది.

అష్టాదశ సంఖ్యావైశిష్ట్యం

వేదాలను విడిచిపెడితే స్మృతులు, ఉపస్మృతులు పురాణాలు, ఉపపురాణాలు 18 విధాలుగా విభజింపబడ్డాయి. శ్రుతి, స్మృతి, పురాణేతిహాసాలలో చివర పేర్కొనబడిన ఇతిహాసం 18 ఇతిహాసాలుగా రచియింపబడ్డాయో లేదో గ్రంథాలు అలభ్యాలైన కారణంగా చెప్పలేము. కాని భారతేతిహాసం మాత్రం 18 పర్వాలతో విభజనమై రచింపబడ్డ విషయం విస్పష్టం.

మను, దక్ష, యమ, బృహస్పతి, శంఖ, పరాశర, యాజ్ఞవల్క్య, విష్ణు, అత్రి, అంగిరస, సంవర్త, శాతాతప, ప్రాచేతస, హరీత, ఆపస్తంభ, గౌతమ, ఉషనస, ఆశ్వలాయన, కృతాలైన స్మృతులు 18 వున్నాయి. వీటిలో బృహస్పతి, యాజ్ఞవల్క్య, సంవర్త, ఆపస్తంభ, ఆశ్వలాయన, స్మృతులకు మారుగా మరికొందరు బ్రహ్మ, యోగీశ్వర, సంవర్త, ఆపస్తంభ, లిఖిత, మహర్షి కృతాలైన స్మృతులను పేర్కొన్నారు.