పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

మధువిరోధి గలుగ మానవు నల్పుని
నడుగఁజూచుటెల్ల నవనియందు
హాలికుండు వార్షికాభ్రంబు మఱచి నీ
హారవారిధార లడుగు నట్లు.

154


ఆ. వె.

మహిమతోఁ ద్రివిక్రమస్వామి దీపించఁ
దగునె యన్యదేవతాభజనము
కామగవి జగత్ప్రకాశమై కనుపట్టఁ
బొదుగుగల వరాహిఁ బిదికి నట్లు.

155


తే. గీ.

హరికి నవమాన మొనరించి యన్యునొకని
దేవత యటంచు గొలుచుట దీప ముండ
నంధతమసంబు భేదించునందునకును
మించు ఖద్యోతకాంతి గావించునట్లు.

156


తే. గీ.

వాసుదేవుండు గలుగ దేవతలవెంట
భ్రాంతిఁ దిరుగుట శర్కరాపానకంబుఁ
జవి గొనక యూసరక్షేత్రజలకణములు
ప్రచురమైయుండ జిహ్వపై రుచులుగొంట.

157


తే. గీ.

పద్మనాభసమాశ్రయపరుఁడు గాక
యన్యదేవతఁ బలుమాఱు నాశ్రియింపఁ
దలఁచియుండుట బర్బూరతరువునీడ
సంచరించుట చందనచ్ఛాయఁ బాసి.

158


ఆ. వె.

అంబుజాక్షు నాత్మయందు నిల్పక యధ
మాధములఁ దలంచు టరయఁ దండ్రి
నాఁటి ధనము విడిచి నరుఁడు స్వప్నాగత
నిధి గృహంబునందు నిలిపికొనుట.

159


తే. గీ.

ఆదినారాయణునిఁ బరమాత్మఁ బాసి
పరునిఁ దలఁచుట కర్పూరతరువు విడిచి
లాంగలీకందభక్షాభిలాషవృత్తిఁ
బూని తిరుగుట గాదె యీభూతలమున.

160