పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

నిరుపమదివ్యమాణిక్యరాజత్సహ
                       స్రస్తంభజృంభవిరాజమాన
స్థాపితానంతభాస్కరమండలాయమా
                       నాంచితరత్నకుడ్యాభిరామ
తారకాన్వీతసంధ్యారుణాభ్రోదగ్ర
                       చారుముక్తాంకకాంచనవితాన
పరభయస్థాపితాసురవరామృతహేమ
                       కుంభవిభ్రాజివిజృంభకలశ


తే. గీ.

ఘనఫణామణికుండలాకారశేష
భోగి నిరుపమసద్రత్నపుంజవేది
చంద్రకాంతోరుసోపానసమధికాభ
సౌధ వరలక్ష్మి యప్పురి చాల మించె.

436


వ.

ఆసౌధంబుచుట్టును మందారపారిజాతసంతానకల్పవృక్షహరి
చందనచందనచంపకనాగపున్నాగమాధవీకంకేశీజంబూజంబీర
ఫలపూరచూతపనసనారికేళకపిత్థామలకీప్రముఖనానాభూజరాజ
విరాజమానఫలకుసుమసంపత్సమృద్ధమహోద్యానంబును ద్రాక్షామాల
మాలతీమల్లికాలవంగలవలీలతావేల్లితంబై సూర్యరశ్మి సోఁకక నీరం
ధ్రమై మెఱయ శుకపికశారికాముఖ్యనానావిహంగమమధురకూజి
తంబులు వీనుల విందు సేయఁ గెలంకులఁ గొలంకులు నానారత్నసోపా
నంబు లమరఁ జుట్టును కర్పూరకదలికాతపస్వినిస్స్రుతఘనసార
ఖండంబులు జలంబునం బడ్డ సౌరభ్యశైత్యమాంద్యంబులు గలిగి
మలయానిలంబు విసర రాజహంసకలహంసబకచక్రవాకక్రౌంచాది
నానాజలపక్షికులంబు పద్మకుముదకల్హారహల్లకేందీవరషండ
మండితతరంగమాలికపై విహరించు నందు నపుడు కృష్ణుం డరుణో
దయంబున నంతఃపురంబున మేల్కాంచి మంగళస్నానంబు చేసి దివ్యాం
బరంబులు ధరియించి కస్తూరితిలకంబులు దీర్చి సంధ్యావందనాగ్ని
హోత్రంబు లాచరించి భూసురులకు గోహిరణ్యరత్నవస్త్రాద్యసంఖ్య
వస్తువు లొసంగి తాంబూలఫలపుష్పంబులు సమర్పించి యప్పుడు.

437