పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

తద్వృత్తాంతంబు విని కృష్ణుం డాగ్రహంబున నున్న గురుండు గావున
బలభద్రుండు దుర్యోధనపక్షంబున హస్తిపురంబున కేఁగి రారాజునకు
నిజాగమనప్రయోజనం బెఱిఁగించిన నతండు గర్వించి యుద్ధతవచనం
బులు పలికిన సమిద్ధహలముఖంబున హస్తిపురంబు యమునలోఁ
బడఁదిగుచు కృష్ణాగ్రజునకు విచిత్రాంబరాభరణంబులు మెఱయు
లక్ష్మణకన్యకతోడ సాంబుని మరల నిచ్చి భీష్మాదిసహితుండై కురు
రాజు ప్రియంబు చెప్పిన నబ్బలదేవుండు నిజపురంబున కేఁగి తదుద్వా
హంబుఁ గావించె నంత.

393


తే. గీ.

రాజసూయంబునకు ధర్మరాజు పిలువ
నంపనేఁగి జరాసంధు నపుడు భీమ
సేనుచే నడఁగించె నాశ్రీధరుండు
తగు యుధిష్ఠిరభూవరాధ్వరమునందు.

394


క.

దమఘోషనందనుం డరి
దమఘోషముతోడఁ గృష్ణుఁ దార్కొని యపరా
ధము లొక్కశతం బపరా
ధము లెల్లన్ నవ్వఁజేసెఁ దా నుద్ధతుఁడై.

395


క.

ఆగోపనయనవిధుఁడు త
దాగోపనయన మొనర్ప నాగ్రహ మడరన్
వేగమునఁ ద్రుంచె రిపు ను
ద్వేగంబున విమతులెల్ల విఱిగి చలింపన్.

396


తే. గీ.

దురములోదంతవక్త్రవిదూరసాల్వ
ముఖ్యుల జయించె హరి లోకములు నుతింప
రాజసూయంబు గావించెఁ బ్రౌఢిరాజ
రాజసూయం బొరల ధర్మరాజసుతుఁడు.

397


క.

సూతుఁడు బ్రహ్మాసనయుతుఁ
డై తను గైకొనకయున్న హలి యుచితంబుల్
చేతోవృత్తి దలఁవక ప
రీతుని గావించె నతని ఋషులు వడంకన్.

398