పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఎన్నఁడు గాంతు నాదు హృదయేశ్వరు నెప్పుడు గౌఁగిలింతు నా
చన్నులతీపున న్వెడలఁ జక్కెరమోవిసుధారసంబు నే
నెన్నడు విందు సేయుదు మహేంద్రుఁడొ చంద్రుఁడొ యారతీంద్రుఁడో
యున్న మనుష్యమాత్రుఁడె యనూనమహత్వవిలాసనంపదన్.

354


వ.

నిద్రాసమయంబున ననుం గూడిన విభుండు కనుపట్టండయ్యెనని మదన
బాణమోహితయై యాయుషాకన్య యివ్విధంబునఁ జిత్రరేఖయను చెలి
కత్తెకు నెఱింగించిన నది చిత్రపటంబునందు సురాసురనాగనరలోకంబుల
ఘనులైన సౌందర్యనిధుల వ్రాసి చాతుర్యంబు మెఱయించినం జూచి
యందు ననిరుద్ధుం గాంచి లజ్జావనతముఖియై తదాసక్తభావంబుఁ దెలుప
నాబాణతనయతోడ నీవిభుని సత్వరంబుగాఁ దెచ్చెదనని పలికి యా
చిత్రరేఖ సంభ్రమంబున.

355


ఆ. వె.

ద్వారావతికి నేఁగి యారామ మాయచే
నడరి దివ్యరత్నహర్మ్యడోలి
కాంతరస్థుఁడైన యాయనిరుద్దుఁ జొ
క్కించి తెచ్చె పంతగించి యపుడు.

356


వ.

తెచ్చిన యతనితో బహుదినంబులు మదనకేళి విహరించుచునుండ నుషకు
గర్భంబైనఁ దద్రక్షకు లెఱింగి బాణునకు విన్నవించిన నతండు ఘోరా
హవంబున ననిరుద్ధు నాగపాశబద్ధుం జేసె నంత నారదునివలనఁ
గృష్ణుండు తద్విధం బంతయు నెఱింగి.

357


క.

బలభద్రప్రద్యుమ్నా
దులతో రథ మెక్కి వచ్చి దుర్వారభుజో
ద్బలమునఁ జక్రాద్యాయుధ
ములు మెఱయన్ శోణపురిని ముట్టడి చేసెన్.

358


తే. గీ.

హరిహరులు గూఢకర్ణకుంభాండముసల
హస్తులును సాంబబాణాసురాత్మజులును
శంబరారాతితారకశాత్రవులును
బాణశైనేయులును రణక్షోణిఁ గదిసి.

359