పుట:కాశీమజిలీకథలు -01.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

297

మే - పాపము మరల నీ తరుణికిఁ బతితో సంయోగము గలుగునా?

ఊ -- ఈ సంయోగినీదేవి కృపావిశేషమున నీయువతి పతితోడను, సోదరునితోడను శీఘ్రకాలములోనే కలిసికొనఁగలదు.

మే - అట్లయినచో నీ సంయోగినీదేవి నామము సార్థకమేకదా!

ఊ -- దానికేమి సందేహము? ఈమె భక్తపరతంత్రగదా?

రం – అక్కలారా! మనమువచ్చి తడవైనది పోయివత్తమా?

(అని యందరు నిష్క్రమించుచున్నారు. )

ఆ దేవకన్యలు తన్ను గుఱించి సంభాషించుకొనఁ బ్రారంభించినప్పుడే యా లవంగికి మెలకుఁవ వచ్చుటచే వారి మాటన్నియు విని యా సంవాదములోఁ దన యిడుములన్నియు నడఁగు తెరంగు స్పష్టమయ్యెనని యానందపారావారవీచికలం దేలుచు నా లవంగి యిట్లు తలంచెను.

ఆహా! జనులెంత కష్టపడినను దైవానుకూలములేక సుఖములఁ బడయగలరా! సుఖదుఃఖములు దైవాయత్తములు. సుఖము దుఃఖమునకును, దుఃఖము సుఖమునకును నొక్కొక్కప్పుడు కారణమగుచుండును. నాకింతకు బూర్వము గలిగిన దుఃఖమూలముననేగదా యిట్టివిరాగముతో నీదేవాలయమునకువచ్చితిని ఇందు మాతండ్రియిడుములువాయురీతి దేవకన్యకాసంభాషణాశ్రవంబునం దెల్లమైనది. ఇదంతయు దైవము గూర్చినదేకాని వేరుకాదు. మాకు మరల మంచికాలము రానున్నది. పతితో సోదరునితో శీఘ్రకాలములోనే గూడుకొనెదనని యూర్వశి చెప్పినది. ఆమె మాటలు దప్పునా యని యత్యంతసంతోషముతో నారాత్రి నిద్రపోక వేగించినది .

అంత నాకాంత నాల్గవజామున నత్తటాకములో స్నానముచేసి యామంటపములో జపమునకు గూర్చుండబోవు సమయంబున గోపురప్రాంతమం దెద్దియో మనుష్యుల సద్దు వినబడినది. వెరగుపడి యాలవంగి యాగోపురపుదాపునకుఁ బోయి చిన్నగుమ్మము దాపునుండి యా యడవిప్రక్కకుఁ దొంగిచూచెను. అందొక సుందరి మొరపెట్టుచుండ జెరదెచ్చిన దొంగలను పారదోలుచున్న బాలయోగి నొకనిం గనెను. ఆ లవంగి చూచుచుండ నా బాలయోగి తన యోగదండములో నమర్పబడియున్న కత్తిచే నా దొంగల నందరిని నరికివైచి యా చిన్నదాని చెరవిడిపించెను. పిమ్మట నా కొమ్మతోఁ కూడ నా బాలయోగి యా గుడిలోనికి వచ్చురీతి దోచినంత లవంగి మరలఁ బోయి మంటపములోఁ గూర్చుండి జపము చేయుచుండెను. ఇంతలో నా యోగియు నా తరుణియు నా చిన్న ద్వారమునుండి యా గుడిలోఁ బ్రవేశించిరి. అప్పుడు కొంచెము చీఁకటిగానే యున్నది. తెల్లవారలేదు.