పుట:కాశీమజిలీకథలు -01.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ఆ యుపన్యాసము విని సభ్యులెల్లరు తదీయపాండిత్యవిశేషమునకును వక్తృత్వమునకును సంతసించుచు నందుల కeమోదించిరి. అప్పుడు జయభద్రుడు లవంగిచెప్పిన తీర్పుప్రకారము ప్రద్యుమ్నుని విడిచివేయ నాజ్ఞయిచ్చెను.

ప్రద్యుమ్నుని చెరవిడిచిన వెనుక లవంగి యేకాంతముగా నతనిం గలిసికొని యాప్రభావతిని నీవే పెండ్లి చేసుకొమ్మని చెప్పెను. లవంగి పురుషవేషము వైచినప్పుడు ప్రద్యుమ్నుడు వలెనే యున్నది. కావున బ్రద్యుమ్నుడే పెండ్లికుమారుడై యాలోపల సంచరింపదొడంగెను. ఆ భేద మెవ్వరును గ్రహింపలేకపోయిరి. లవంగియు రహస్యముగా నాయూర సత్రములోనే యుండెను.

అంత నారాజు శుభముహూర్తమునఁ బ్రద్యుమ్నునికిఁ బ్రభావతినిచ్చి పెండ్లి చేసెను. నిత్యము చూచుచున్న వారికిసైతము పురుషవేషము వైచిన లవంగికిని ప్రద్యుమ్నునికిని భేదము గనిపెట్టశక్యము గాదనినచో నొక్కసారి చూచిన ప్రభావతి మాత్ర మేమి యానవాలు పట్టగలదు.

ప్రద్యుమ్నుడు ప్రభావతితో (ప్రద్యుమ్నుడు ప్రభావతితో వలెనే) కొన్ని దినము లందుండి యదేష్టకామంబు లనుభవించెను. అప్పుడప్పు డతఁడు రాత్రుల యందు సత్రమునకుఁబోయి చెల్లెలి క్షేమ సమాచారములు గనుంగొనుచుండును.

ఇట్లు కామతంత్రుఁడై తండ్రిమాట మరచిపోయియున్న ప్రద్యుమ్నుని నొక నాఁడు లవంగి మందలించి యిట్లనియె అన్నా! నీవు భార్యాలోలుండవై తండ్రిమాట మరచిపోయితివి. మనమువచ్చి నెలయైనది. ఇక అయిదుమాసములే మితియున్నది. వచ్చిన కార్య మేమియుం గాలేదు ఇంతదనుక నీవు క్రొత్త పెండ్లికొడుకువని యోర్చి యూరకుంటిని. ఎన్ని దినంబులున్నను నీ కిచ్చటినుండి రాబుద్ధిపొడమదు. నీవు భార్యతో నిందు సుఖం బుండుము. నేను పోయి కార్యము సాధించుకొని వత్తునని పలికిన నులికిపడి ప్రద్యుమ్నుడు. అమ్మాణీ! నన్ను భార్యాగలోలునిగా దలంచుచుంటివే ? నాకు దండ్రికంటె భార్యయెక్కువా? ఈ దినమున నేనును ప్రయాణమున కాలోచించుచుంటిని. పోదము రమ్ము అని పలికి యతఁడు ప్రభావతితో నెద్దియో మిష చెప్పి యా దివసంబున నర్ధరాత్రంబున లవంగితోగూడ నొకయడవిమార్గంబునం బడి పోయెను పితృభక్తియుక్తులు స్వప్రయోజనముల గణింతురా! ఆ యిరువురు గుఱ్ఱములులేక కాలినడకనే పోయి తెల్లవారుదనుక నడచి నడచి యాయాసముజెందుచు నుదయకాలంబున నొక తటాకము గనంబడుటయు దత్తటంబున గూర్చుండి గమనాయాసము వాపికొనిరి. పిమ్మట నడవలేక సరస్సులో స్నానముచేసి యందే తాము తెచ్చుకొనిన యాహారపదార్థములు భుజించి యాకలి యడంచుకొనిరి.