పుట:కాశీమజిలీకథలు -01.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుగుణావతి కథ

273

బుద్ధిసాగరుఁడు పద్మావతి చర్యలు చూచినది మొదలు స్త్రీలందరు దుర్మతులే ననియు నమ్మనర్హులు గారనియు నిశ్చయించియున్న కతంబునఁ దన సతిచేయు సుపచారములన్నియుఁ గపటములే యని తలంచి పాటింపఁడయ్యెను.

పిమ్మట నాకొమ్మయుఁ బతికి వినయముతో సుగంధద్రవ్యము లిచ్చి వీణాగానంబునఁ గొంతసేపు రంజింపఁజేసి తొడలపై నతని పాదంబులఁ జేర్చి యొత్తుచు మెత్తని మాటలచే నతని చిత్తము గనుక నిట్లనియె.

ప్రాణేశా! మీరు నన్ను విడిచిపోయి పెక్కుదినములై నది గదా! యిన్నిదినంబుల దనుక రాకుండుట న్యాయమే? ఇఁక పది దినములు జాగుచేసినచో నాకు మరణమే దిక్కగుసుఁడీ! సతులకుఁ బతిసేవకన్న మిన్నయగు వ్రతమున్నదియా? యని యత్యంతవినయభక్తివిశ్వాసములతోఁ బలుకుచున్న యా చిన్నదాని మాట లన్నియును బూటకములే యని బుద్ధిసాగరుఁడు విశ్వసింపక యూకొట్టుచు దాని చర్యలుగూడఁ బరీక్షింపఁ దలచి యంతలో నిద్రబోవు వానివలె నభినయించుచు బిగ్గరగా గుర్రుపట్ట దొడంగెను.

అప్పుడాఁపడతి మెల్లన వల్లభుని చరణంబులు శయ్యాతలము జేర్చి చప్పుడు గాకుండ మంచము దిగి పసిడి పళ్ళెరములో ఫలములు మొదలగు నుపహారములు వైచుకొని యా యిల్లు వెడలి వీథిఁబడి నడువసాగెను. బుద్ధిసాగరుఁడు నిద్రపోలేదు. ఆ పూఁబోడి ప్రయాణసన్నాహమంతయుఁ జూచి దానితోడ వెన్నంటి యరుగుచు అన్నన్నా, నాతో నిన్నినీతులు బలికి యీ కలికికూడ నెక్కడికో పోవుచున్నది. ఆహా! స్త్రీ స్వభావము.

శ్లో॥ గావోనవతృణానివ గృహ్యంత్యేతా నవం నవం
     శంబరస్యచయా మాయా యామాయా నముచేరపి
     బలెః కుంభీనసస్యైవ సర్వాస్తాః యోషితోవిదుః
     స్త్రీణామగమ్యోలోకేస్మి న్నాస్తికశ్చిన్మహీతలె.

గోవులు క్రొత్తక్రొత్త గడ్డిమేయ గమకించినట్లు స్త్రీలు క్రొత్తవాని నిమిత్తము ప్రయత్నింతురు. స్త్రీలకు బొందనిరానివాఁడు పుడమిలోఁ లేఁడు. ఎట్టి నీచునితోనైనను గూడికొందురు. శంబరుఁడు నముచి కుంభీనసుఁడు లోనుగాఁగల దైత్యచక్రవర్తు లెఱింగిన మాయలన్నియు స్వభావము చేతనే స్త్రీలయందు సంక్రమించి యుండును.

అని మున్ను చదువుకొన్న స్త్రీచేష్టల గుఱించియున్న శ్లోకంబులు బెక్కు చదువుకొనుచు నది పోయినదారినే పోవుచుండెను. ఆ చిన్నది క్రమంబున నూరి