పుట:కాశీమజిలీకథలు -01.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహదమనుని కథ

189

నాథా! స్త్రీలచర్యలు స్త్రీలకేగాని యెఱకపడపు. వారి కృత్యములు నాకుఁ దెలియక మీకుఁ దెలియునా? ఈ రహస్యము నాకు మొదటనుండియుఁ దెలిసియే యున్నది గాని నాకు నేనై చెప్పిన యుక్తము గాదని యూరకుంటిని. నన్నడిగితిరిగాన యిప్పుడు చెప్పితిని. వానికి దగినశిక్ష చెప్పెదవినుండు. వారు గర్భములు ధరించియున్నవారు గావున జంపుట యుక్తముగాదు. మహారణ్యములోఁ గనుగ్రుడ్డులు పెరికి విడచివేయవలయును. ఇట్టి కృత్యములు చేసిన వారికిదియే దండనయని చెప్పెను.

ఆతండు సమ్మతించి యప్పుడే భటులం బిలిపించి గర్భవతులని కొంచెమేని సందియమందక దయారహితుఁడై భార్యల నడవిలో విడిచి కన్నులు బెరకిరండని యాజ్ఞాపించిన రాజకింకరులును తదాజ్ఞానుసారముగా నా మగువలతో నేమియుంజెప్పక యెద్దియో మిషచే మహారణ్యమునకుఁ గొనిపోయి యందు వారి కనులం బెరకి పెద్ద యెలుంగున నేడ్చుచున్న వారిని విడిచి యానవాలుగా నాకన్నులం దెచ్చి యారక్కసి కిచ్చిరి. పిమ్మట రాజు భార్యలు అందు మితిలేని శోకంబున గుందుచుండ నందులోఁ బెద్దదానికిఁ బ్రసవవేదన యావిర్భవించినది. వెంటనే పుత్రుం డుదయించెను. అబ్బాలుండు జనించిన కొంచెముసేపులోనే తల్లులు యంధత్వంబు గనిపెట్టి దాపుననున్న మృగము లాశిశువుం జంపి భజించినవి.

ఆ సుందరులందరు తమముందు శిశువుం గానక యుల్లంబులు పగుల బలు దెరంగుల నేడువఁజొచ్చిరి. వారి యరణ్యరోదనం బాలించి యోదార్చువా రెవ్వరు? అ మరునాఁడే రెండవదిగూడ మగశిశువుం గనెను. గాని యప్పసికూననుగూడ మునుపటి మృగములె తినినవి. క్రమంబున దినము వరుస వరుస నార్గురు రాజభార్యలు పిల్లలం గని మృగముల పాలుచేసిరి. కటకటా! పుత్ర శోకంబున నడలు నప్పడతుల కంఠనాదంబులు నయ్యడవియంతయుఁ బ్రతిధ్వనులిచ్చినవి. ఏఁడవ దానికిఁగూడఁ బ్రసవవేదన యంకురించిన తోడనే వారిలో బుద్ధిమంతురాలగు మూడవది తక్కినవారి కిట్లనియె.

అక్కలారా! మనమిక్కడ నూరక యేడ్చుచున్న నోదార్చువారెవ్వరు? మన పురాకృతదుష్కృతఫలం నిట్లు పలించినది. మన యార్వురకుఁ బొడమిన బాలుర నడవిపాలు సేసితిమిగదా! ఇప్పుడు యేఁడవదానికిఁగూడ నొప్పులు పట్టుచున్నవి. దాని పిల్లనుగూడ నేదియో యీడ్చికొనిపోవును. కావున నాకొక్క యుపాయము తోచుచున్నది వినుఁడు. మనమొక్క చిన్నవానినేని బ్రతికించుకొనకపోయితిమేని మనలను రక్షించువా రెవ్వరు? ఇప్పుడు మన మార్వురము దీనిచుట్టు జేతులు లంకెలు వైచుకొని కాచియుందము. ప్రసవమైనతోడనే యాబిడ్డ నెత్తుకొనినచో మృగబాధ యుండదు.