పుట:కాశీమజిలీకథలు -01.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

పిమ్మటఁ దిమ్మర్సును కళానిలయ తండ్రియగు గోపాలవల్లభునకుఁ వార్త నంపి యొక శుభముహూర్తమున నధికవైభవ మొప్పఁ గళానిలయకును గృష్ణదేవరాయలకును వివాహమహోత్సవము జరిగించి యతని యభీష్టము తీర్చెను. అధికబుద్ధిమంతుఁడగు తిమ్మర్సును మంత్రిగాఁగల రాయలు కోరినకోరిక దీర్చికొనుట యేమి యాశ్చర్యము.

తర్వాతఁ జిత్రకారుండు తా నధికప్రయత్నముతో నందముగాఁ జేసిన విగ్రహం బట్లు విచ్చిన్నంబగుటకు జింతించి రాయలునొద్ద కరిగి, దేవా! నే నీప్రతిమ నప్రతిమసామర్ధ్యంబునం జేసితి దాని వృథా పారవైచిన నా మనంబునకుం గష్టముగా నుండును, దాని యుదరము మరల బాగుజేసితి నది మీ యాకారమేగాన సప్తసంతానములవలె భూమియందుఁ జిరకాలముండున ట్లేర్పాటు చేయుఁడని వేడుకొనిన నతని మాటలు విశ్వసించి రాయలును తిమ్మర్పును మిగుల సంతోషముతో భూరిశిలానిర్మితంబగు నాలయంబునం బర్యంతమునం బండుకొనియున్నట్లు ఆ విగ్రహమును స్థాపించి దానికి నిత్యోత్సవములు జరుగుటకుఁ బెక్కు అగ్రహారములిచ్చి పరిచారకుల నియమించి నిత్యకళ్యాణములు వెలయఁ జేయించెను.

నాటంగోలె నేఁటి తుదదాక దానికా యుత్సవములు జరుగుచున్నవి. అదియట్లు జరిగి చిరకాలమగుటచే నిప్పుడు దాని దేవతావిగ్రహమని భావింపుచుండిరి. గోపాలా! నీవు చూచిన విగ్రహవృత్తాంత మిది. ఈ రహస్య మెవ్వరును నెఱుఁగరు మద్గురుప్రసాదలబ్దంబగు రత్నప్రభావంబునం జేసి నాకుఁ దేటయైనది. చిత్రకారకుని రచనాచమత్కృతిచే నది యిప్పటికిని చెక్కుచెదరక కొత్తదానివలె నున్నది. దానంజేసియే దాని కన్నులు మూయబడియున్నవి. కథయైనది. లేలెమ్ము. బ్రొదెక్కినది. మరల నడువవలెనని చెప్పిన విని యా గొల్లవాఁ డుల్లంబున నెంతేని సంతసించుచు నతనికి నమస్కరించెను. తరువాత వానితోఁగూడ నాస్వాములవారు క్రమంబునఁ బ్రణవాక్షరజపమ్ము జేయుచు దొమ్మిదవ మజిలీ జేరిరి.

తొమ్మిదవ మజిలీ

సింహదమనుని కథ

అందు గోపాలుం డాలకై పొలమున కరిగి యొకచో మేదోమాంసచర్మశూనంబై మిక్కిలిపెద్దదియగు పుఱ్ఱె నొకదానిం జూచి దాని వృత్తాంతము జెప్పుమని యడిగిన మణిసిద్ధుం డారత్నప్రభావంబునఁ దెలిసికొని యక్కథనిట్లు చెప్పందొడంగెను.